1, ఏప్రిల్ 2012, ఆదివారం

దేవులపల్లి వారి "కృష్ణ" కౌముది

ఫిబ్రవరి "విహంగ" లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


(ఫిబ్రవరి 24న శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి 32 వ వర్ధంతి సందర్భంగా ఆయన వ్రాసిన కొన్ని సినిమా పాటలను మరొక్కసారి ఇష్టంగా మననం చేసుకుంటూ నా ఈ వ్యాసం....)

మనకు తెలుగునాట కొన్ని తరాలుగా అందమైన పద జిగిబిగితో తెలుగువారిని అలరిస్తున్నరచయితలు, కవులు చాలా మంది వున్నారు. అలాంటి వాళ్ళల్లో "తన బాధ లోకం బాధగా" పంచినా తీయని హాయయిన  నొప్పినే పంచారు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

సౌరభము  లేల  చిమ్ము   పుష్పవ్రజంబు ?
చంద్రికల  నేల వెదజల్లు  చందమామ ?
ఏల సలిలంబు  పారు ? 
గాడ్పేల  విసరు ?....

అని ప్రకృతిలో సహజంగా జరిగే వాటిని మరొక్కసారి ఎత్తిచూపుతూ తను భావకవిత్వం వ్రాయడం కూడా అంతే సహజంగా జరిగింది అని చమత్కారంగా మనకి చెప్పకనే చెప్పారు శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు. ఆయన కృష్ణ పక్షం, ప్రవాసం, ఊర్వశి లాంటి కవితా సంకలనాలతో పాటు ఎన్నో తీయని తెలుగు సినిమా పాటలు తెలుగువారికి అందించారు. అందులో కొన్ని వెన్నెల తునకల వెలుగులు,  మది చల్లబరచే "సినీ గేయ" శీతలాలు ఇవిగో......

అది మల్లెల వేళయని, అది వెన్నెల మాసమని తొందరపడి కూసిన కోయిలలా కుమిలిన ఆ అన్న  చెల్లి - ఆ ఇద్దరి బాధని అది మన బాధేనేమో అనిపించేలా మన మనసంతా కృష్ణ పక్షపు అమ్మవాస్య నలుపుని నింపుతుంది దేవులపల్లి గారి "సుఖ దుఖాల " అల్లిక.

***ఇల్లు  వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువనిపించాలి
ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పూవనిపించాలి - 
అలాంటి  అడుగడుగునా, అందరిలోనూ గుడి వున్న ఒక అందమైన పల్లెటూరిలో -
గురివింద పొదకింద గొరవంక , గోరింట కొమ్మల్లో కోయిల్లు  పలుకుతుంటే
కడివెడు నీళ్ళు కళ్ళాపు జల్లి, కావెడు పసుపు గడపకు పూసి, ముత్యాల ముగ్గులు వేసి, ఆ రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు పెట్టి "రావమ్మా మహాలక్ష్మీ" అని సంక్రాంతి లక్ష్మిని పగలంతా కొలిచి అలసిన అతివ అమ్మై-
రాత్రి పూట ఆకాశం లో సయ్యాటలాడే ఆ జాబిలికి దీటుగా ఇంకా అల్లరి చేస్తూ
దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలని, సోగ కనుల రెప్పల్లో తూనీగల్నిఆడిస్తున్న తన జాబిలికూనతో చాలులే !నిదుర పొమ్మంటూ  ---
అంత దవ్వు నుంచి అయ్య  అడుగులు తెలిసేనా 
వేలెడేసి లేవు బోసి నవ్వులదానా - అని ఆ చిన్నారి నిద్రా భంగానికి ఆ పాప అయ్య అడుగులని అందంగా ఆడిపోసుకుంటుంటే-
ఆ అభాండానికి  దీటుగా  ఆ అయ్య-
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే
చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ - 
అని ఒకే చిటికెకి రెండు నవ్వులన్నట్టు -  చెప్పకనే చెబుతున్న  చిలిపి కోరికతో అటు అమ్మనీ, నిద్ర పోకపోతే తమ్ముడిని పోటీగా తెస్తానని ఇటు పాపనీ మైమరిపించాడు .  
ఆంధ్రుల పరభాషా ప్రియత్వానికి జడిసి వడివడిగా పారిపోతున్న తెలుగు పేరంటాలిని "ఉండమ్మా! బొట్టు పెడతానని" నట్టింట నిలపగలిగే పాట కదూ ఇది?!

మనసులోని మాట పైకి చెప్పలేక మూసిన పుస్తకంలో దాచి పెట్టిన పేజీ లా -

వుసురుసురనినా గుసగుసమనినా వూగదేమది నీ మది-
అని తాను కట్టుబాటు తప్పలేక ప్రియురాలు కాలేక,  స్నేహం గా ఉంటూ తన ఎదని నిష్ఠూరం ఆడుతున్నస్నేహితురాలికి-
నిదుర రాని నిశి రాతురులెన్నో, నిట్టూరుపులెన్నో 
- అని విరహపు బాధని "గోరింటాకు" దాచుకున్న మూగ ఎరుపులా తన నోరులేని ఆవేదనలన్నీ  ఆమెకి చెప్పడానికి ఆ అబ్బాయి ఎంత ఆరాపడ్డాడో  కదా!

 వన్నెలూ వగలూ నేర్వకముందూ, నేర్చిన తర్వాతా కూడా  గడుసరి అయిన  "సీతామాలక్ష్మి"  తనకి మాత్రం సిరి 
అని మురిసిన ఒక బంగారు కొండ(య్య) లాంటి అబ్బాయి ఆ సీతామాలక్ష్మి పగడాల పెదవి మీద నవ్వుతో తన కంటిలో దివిటీలు వెలిగించుకున్నాడు.

***ఆకాశ పందిరిలో  తళుకు బెళుకు నక్షత్రాల తలంబ్రాలతో, మెరుపు తీగ తోరణాల మధ్య, పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాటలు పాడుతుంటే , రాజహంస జంట రత్న హారతి ఇస్తుంటే మరపురాని వేడుకగా తనని పెళ్ళాడదామని కలలు కంటున్న ఆ "శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్బు" వారి  అమ్మాయికి  ఆ నిరంతర సంచారి తన ప్రవర ఎలా చెప్తున్నాడో   విందామా?  

మనసైన చోట మజిలీ కాదన్న చాలు బదిలీ
తోటకి  తోబుట్టువును ఏటికి నే బిడ్డను.......
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు 
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు 
అసలు నామరోపేరు ఆనందవిహారి  

***ఆకులో ఆకై, పూవులో పూవై , ఆకలీ దాహమూ లేక నిరంతరమూ తనని తాను మరిచి ప్రకృతిలో ఆనంద నాట్యం చేసే యువతికి-
తనని ఆలన చేసే,  తను ఆరాధించే  కవికుల తిలకుడు ఏ కమ్మా , ఎలాంటి కబురూ, కనీసం మేఘసందేశం అయినా పంపక-
హృదయము సంకెల చేసి బంధించలేని తన అశక్తికి  వగచే వనితకి- 
ఆ గడుసు కవి ఇదిగో - ఇలా నిన్ను వదిలి నన్ను పోనీయకు అని మాయ మాటలు చెబుతున్నాడు -

ఎద  లోపల  పూలకారు  ఏనాటికీ  పోనీయకు .....

ఉదయాన  మగత  నిదుర  చెదరిపోవు వేళ 
ముసలి  తనపు  అడుగుల సడి  ముంగిట  వినబడెనా
వీడలేడని చెప్పించు వీలుకాదని  పంపించు 

***జీవితపు "చీకటి వెలుగుల" కౌగిలిలో, చిందే కుంకుమ వన్నెలలో తమ బ్రతుకు పూదోటకి పాదులు కట్టి, గుండెల వలపులు కుమ్మరించి ప్రాణం పోసిన ముంగిట్లోకి వచ్చేపోయే అతిథులెవరంటే....
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం 
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు ....
వారి రాకపోకలతో 

ఆరు ఋతువులు ఆమని వేళలే - ఆ జంట పెంచిన తోటలో  
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే - ఆ రెండు మనసుల్లో.

***కొమ్మ కొమ్మకి పూచిన పూవులు చూస్తూ వాటితో తనకున్న "ఈనాటి ఈ బంధం ఏనాటిదో" అని అబ్బురపడుతూ ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ - పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ - అని హరి పూజకు పూలు పడే తొందరని ముచ్చటగా పాటలో పాడుకుంది ఒక పడుచు.

***"అమ్మ మాట" వినే ఒక బుద్ధిమంతుడు- 
అటు పొద్దు వాలుతోంది, మన ముద్దు తీరకుంది, కోయని పిలిచే కోరికలెరిగి నన్నందుకుని పోరాదా అని తొందర చేస్తున్న గడుసు అమ్మాయిని - 
మొదట ఎవరైనా చూశారా ఏమనుకుంటారు అని బెరుకుగా అడిగాడు.
ఇంతకీ ఆ "ఎవరైనా" అంటే ఎవరో చూద్దామా -
ఇటు పువ్వు , అటు గువ్వ,  గుబులు గుబులుగా వున్న గురివింద పొదరిల్లు :)
చివరికి ఆ అమ్మాయి చొరవకి దాసోహం అని - ఎవరైనా చూసినా సరే - కొత్త మురిపెం పొద్దెరుగదని చెప్పుకుని తప్పుకుంటారని- ఆ పిల్ల నడుమున చేయేసి నీలాల నింగికి ఎగరేసుకుపోయాడు.

*** అదిగదిగో అక్కడ ఓ పల్లెపడుచు ఒళ్ళో ఒక యువకుడు-
రత్న పీఠిక లేని రారాజు బోలు, మణికిరీటము లేని మహరాజు కాబోలు 
ఆమె చూశారా ఏటి గలగలలకే ఎగసి లేచే, ఆకు కదలికలకే అదరి చూసే ఆతని నిదుర చెదిరిందంటే వూరుకోనని గాలినే బెదిరిస్తోంది.
ఇంకా పండు వెన్నెల నడిగి పాన్పు తెచ్చి , నీడ మబ్బుల దాగు నిదుర ఇచ్చి పైగా విరుల వీవన పూని విసరాలిట.
ఆ ప్రియురాలి ప్రేమకి ఏ "రాజ మకుటాలు" సాటి రాగలవు చెప్పండి !!!

***ఒకే ప్రాణదీపం కోసం "కార్తీక దీపా"లు వెలిగించి కోవెలలో కొలువైవున్న దేవికి హారతి పడుతున్న ఆ పడతులేమంటున్నారో?
ఒక ఇంతికి తన ఇంటి లోని పాపే కొండంత దీపం 
మరో వెలదికి తన మనసులో వెలిగే దీపం - మనుగడ నడిపే దీపం.
వారిద్దరూ కలిసి ఆకాశాన ఆ మణి దీపాలు ఏ ముత్తైదువలు వెలిగించారో - వారు భూమి మీద కనిపించే ఈ కార్తీక దీపాలు చూసి చుక్కలనుకుంటారేమో అని తమలో తాము మేలమాడుకుంటున్నట్టు వున్నారు. ఆ ముచ్చట కూడా విని ఆనందించండి మరి....

కన్న తల్లి ఏమంది అని, పొగడ మీది పొదరిల్లు ఎలా వుంది అని కుశలమడిగాడు ఒక ఉడికించే కొంటె భర్త. 
గుబులు గుబులుగా వున్న మనసుతో ఆ అతివకి జీవితం ప్రేమ "బలిపీఠం" లా అనిపించిందంటే ఆశ్చర్యం వేయదసలు. 

***"కలిసిన మనసుల" సంబరంలో ఒక్క క్షణమైనా సరే ఆకులలో గాలి వూసులాడకూడదు. ఏటి లోని అలలు పెదవి విప్పకూడదు అని మౌనంగా గువ్వల్లా ఒదిగిపోతున్నారొక జంట. ష్! వారిని అలాగే ఉండనివ్వండి.

***"మాయని మమత" వున్నా తనకోసం వాకిటిలో నిలబడకని, ఇంక తనకై మరి మరి చూడకనిప్రతి గాలి సడికి తడబడకని, పదధ్వనులని పొరబడకని - తను రాక పోతే వసంత మాసమే రాదనీ తన సఖిని వదిలి దూరపు సీమలకి ఎందుకిలా ఏగుతున్నాడో - పాపం!

***ఇన్ని కబుర్లు చెప్పి మన "మల్లీశ్వరి" గురించి ఏమీ చెప్పకపోతే అమ్మో! ఇంకేమైనా ఉందా - రాయలవారితో చెప్పి అంతఃపురానికి అరణంగా పంపించేస్తుంది. 
చిన్ననాటి ఆకతాయి, ప్రసాదం భక్తురాలు తన నాగరాజు బావని ఎంత ఆట పట్టించిందో మీరెరుగుదురా?
అతను కోతి బావంట, వాని పెళ్ళికి కోవెల తోట విడిదంట. ఆ పెళ్ళిలో బావ మెడలో గంధం పూసి, హారాలు వేసి, కుళ్ళాయి, కుచ్చుల తురాయి పెడుతుందట. హన్నా! ఇంత అల్లరి కనీ వినీ ఎరిగామా ఎప్పుడైనా?
బావ బండెక్కి - నల్లని మబ్బులు గుంపులు, గుంపులు- తెల్లని కొంగలు బారులు, బారులు - అని చూపించిహోరుగాలి, కారుమబ్బులు ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి అని తొందర చేసింది.
ఇంకేముంది! అనుకున్నంతా అయింది - ఆ వాన ముంపు రానే వచ్చింది. కాలక్షేపానికి, మళ్ళీ బావని ఆట పట్టించడానికి అదిగో ఆ మల్లి పిల్ల మళ్ళీ - పిలచినా బిగువటరా ! ఔరౌరా! చెలువలు తామే వలచి వచ్చినా - అని ఆడింది, పాడింది. రాయలవారి కళ్ళల్లో పడనే పడింది. రాణివాసం వెళ్ళింది. 
ఇప్పుడు తీరికగా కూర్చుని బాధపడుతూ నెలరాజుకి ఎన్ని జాలి కథలు వినిపిస్తే ఏం లాభం? జరగాల్సిన ఆగం జరిగేపోయింది - విరహపు భోగం నిలిచేపోయింది.
మల్లిని తలచి - ఔనా! ఇది నిజమేనా! - అని వగచి శిల్పి నాగరాజు దేశద్రిమ్మరే అయ్యాడు.
జాలి గుండెల మేఘమాలా అని పిలిచి తన బావ జాడ చెప్పమంటే మాత్రం ఇవేమన్నా కాళిదాసు మేఘసందేశం రోజులా- మేఘాలు రాగాలు మోయడానికి? పిచ్చి మల్లి! ఎన్నాళ్ళైనా తన కళ్ళు దిగులుతో రేబవలు బావకై ఎదురు తెన్నులు చూడాల్సిందే అని ఎప్పటికి గ్రహిస్తుంది?
ఆ నాగరాజుకి మాత్రం తెలీదా - మల్లికే తెలియరాని తన మనసు మేఘానికి తెలియబోదని - మల్లితో మరవలేనని చెప్పమన్నా చెప్పబోదని? ఎన్నాళ్ళు అలా విలపిస్తాడు?
హమ్మయ్య! మేఘ దౌత్యమో, మరింకే దైవ బలమో ఇన్నాళ్ళకి మళ్ళీ మల్లీ-నాగరాజులు కలుసుకున్నారు.

మన మల్లికి ఏ మాత్రం తెలిసిందో చూద్దామా- నాగరాజునింక అల్లరి పెట్టకూడదని---?
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని 
కన్నుల నీరిడి కలయ జూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా 
ఎగసిన హృదయము పగులనీకుమా...

అద్దీ! అలా దారికి రావాలి- మన ప్రసాదం భక్తురాలు! ఇప్పుడు మన మనసుల్లో మల్లెల మాలలూగినట్టు వుంది కదూ మల్లీ-నాగరాజులు మళ్లీ ఒక్కటై వూరికి వెళ్ళబోతున్నందుకు!!  

ఇంత అద్భుతమైన కవితా వారసత్వాన్ని మనకిచ్చి వెళ్ళిన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని కన్న మన రత్న గర్భకి   ఆయన పాటతోనే ఒకసారి జేజేలు పలుకుదాం...


(పాటల పూర్తి  అర్ధమే తెలియని తెలిసీ తెలియని వయసునుంచే దేవులపల్లి పాటంటే నాకు చాలా ఇష్టం. నేను వ్రాసిన ఈ వ్యాసం  "కృష్ణ పక్షం" లో కూడా వెన్నెలలు వెదజల్లే ఆ కవితా చంద్రునికి ఒక నూలు పోగు లాంటిది. ధన్యోస్మి!!!)

~లలితా TS

3, జనవరి 2012, మంగళవారం

“నా” అదుపు – “న” అదుపు

జనవరి "విహంగ" లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


అలవాటు  ప్రకారంగా ఉద్యోగ ధర్మం లో భాగంగా నా డిజైన్ సెషన్ కి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయా అని చూసుకుంటూ ఇంకో పది నిముషాల్లో మొదలవబోయే కాన్ఫరెన్సు కాల్ కి తయారవుతున్నాను. ఇంతలో ఆఫీసు మెసెంజర్ లో ప్రాజెక్ట్ మేనేజర్ మెలిస్సా అడిగింది: లలితా! Are you ready to meet nearly 80 folks from 16 teams? (నువ్వు దాదాపు పదహారు టీమ్సు నుంచి నీ మీటింగ్ చేరబోతున్న ఎనభై మందిని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నావా?) ? అని. నేను బదులుగా ఒక స్మైలీ ని పంపించాను. అది చూడగానే - Aren't you worried about what they would be asking you? (నీకు బెరుకుగా లేదా వాళ్ళు ఏమి అడగబోతారో అని?)  అనడిగింది. దానికి ఎప్పటిలాగే నా బదులిది (నా ఆంగ్ల సమాధానానికి తెలుగు లో అనువాదం) - మెలిస్సా! ఈ ప్రపంచం లో నాకు రెండు విషయాలంటే ఎలాంటి వర్రీ లేదు. ఒకటోరకం నా కంట్రోల్ లో వున్నవి, రెండో రకం నేను కంట్రోల్ చేయలేనివి. అందుకని నేనెప్పుడూ సంతోషం గానే వుంటాను  - అని. ఎప్పటిలాగే మెలిస్సా "తంబ్స్-అప్" పంపించింది నన్ను మెచ్చుకుంటున్నట్టుగా. 

నిజమండీ - ఈ ప్రపంచం లో ఏ మనిషికైనా సంబంధించినంతవరకూ ఏ విషయాన్నైనా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు - మొదటి రకం అంతో ఇంతో ప్రయత్నించి తమ ఇష్టమైనట్టుగా మలుచుకోగలిగినవి, రెండో రకం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేనివి. మన అదుపులో ఉన్నవాటి గురిచి అసలు ఆలోచించక్కర్లేదు - ఎందుకంటే వాటిని ఎలా సాధించుకోవాలో, అమలు పరచుకోవాలో మనకి తెలిసి వుంటుంది. అదే ఏ రకం గా చూసినా మన అదుపులో లేని వాటి గురించి ఎంత ఆలోచించినా ఏమీ చేయలేము. అలాంటి వాటిని గురించి ఆలోచించి ప్రయోజనం వుండదు కాబట్టి అంత పట్టించుకోకుండా వదిలేయగలిగితే హాయిగా వుంటుంది. 

ఒక విద్యార్ధి  పరీక్షలు బాగా వ్రాయాలంటే బాగా చదివి పాఠ్య పుస్తకాలని అర్థం చేసుకోవడం, చదివిన దాన్ని గుర్తుంచుకుని పరీక్షల్లో వ్రాయడం వరకూ ఆ విద్యార్థి చేతుల్లో వుంటుంది. రోజుకి గంట మాత్రమే కష్టపడి అరవై  శాతం తెచ్చుకుంటాడా , లేకపోతే ఆరు గంటలు చదివి తొంభై శాతం తెచ్చుకుంటాడా అనేది ఆ విద్యార్థి తీసుకునే టైం మేనేజ్మెంట్ నిర్ణయాన్ని బట్టి వుంటుంది. కానీ ఒకసారి పరీక్ష వ్రాసి వచ్చాక ఫలితం ఆ దిద్దే వారి చేతుల్లో వుంటుంది. అందుచేత తన అదుపులో లేని ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా తాను మాత్రమే చేయగల సాధన గురించి ఎక్కువ సమయం కేటాయించగలిగితే ప్రతీ విద్యార్థీ / విద్యార్థినీ తను అనుకున్నది సాధించగలరు.

మనమెక్కడికో వెళ్లాలని ప్రయాణమవుతాము. కావలసినవన్నీ సర్దుకుని ఏ బస్ స్టాండ్ కో, రైల్వే స్టేషన్ కో వెళ్తాము. తీరా అక్కడికి వెళ్ళాక ఆ బస్సో, రైలో అనుకున్న సమయానికి రాదు. అప్పుడు మన ముందున్నవి రెండు మార్గాలు - ఒకవేళ వెళ్ళవలసిన పని మరీ ముఖ్యమైనదైతే ఇంకేమైనా ప్రత్యామ్నాయం  - అంటే టాక్సీ లాంటిది ఏమైనా దొరుకుతుందా చూడడం, లేదా రావలసిన బస్సు / రైలు కోసం ఎదురు చూడడం. ఆ ఎదురుచూడడంలో కూడా ఏదో పుస్తకం చదువుకుంటూనో, లేక ప్రక్క ప్రయాణీకులతో మాట్లాడుతూనో మనకి నచ్చినట్టుగా కాలక్షేపం చేస్తూ ఎదురు చూడడంలో సమయం తెలియకుండా గడిచిపోతుంది. అలా కాకుండా ఇంకా రాని బస్సు / రైలు గురించి తిట్టుకుంటూ కూర్చుంటే ఒక పది నిముషాలు గడవడం కూడా దుర్భరం అవుతుంది. మనమెంత ప్రయత్నించినా తొందరగా తెప్పించలేని బస్సు/ రైలు గురించి అంత ఆలోచించకుండా మనకు అనుకోకుండా లభించిన ఆ అదనపు వేచి వుండే  సమయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచిస్తే సద్వినియోగమవుతుంది.

కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్టుగా వుంటారు. వేసవి లో "అబ్బబ్బా! వేడి భరించలేక పోతున్నాము. తొందరగా నవంబర్ / డిసెంబర్ వచ్చేస్తే బాగుండును. హాయిగా వుంటుంది చల్లగా" అనుకుంటారు. తీరా డిసెంబర్ నెలలో " ఈ చలి కన్నా ఎంత ఎండా వున్నా భరించొచ్చు, బాబూ!" అనుకుంటూ వుంటారు. 
కానీ తమ చేతుల్లో లేని వాతావరణ మార్పులని వదిలేసి ధరించే కాలానికి అనుగుణంగా ధరించే దుస్తుల్లో కొంచెం జాగ్రత్త తీసుకుని, వీలయినంతవరకూ పని వేళల్లో మార్పు చేసుకుంటే ఎవరి ఆనందం మీద, మనస్థితి మీద వారికి అదుపు ఉంటుందేమో కదా! 

అసలండీ - అదే ఆ "అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" సినిమా లో కథానాయకుడు పాడినట్టు:  

మే నెల్లో ఎండ హాయి 
ఆగస్ట్ లో వాన హాయి
జనవరిలో మంచు హాయి 
హాయి గుంటే చాలునండీ
వేయి మాటలెందుకండీ .....

అని అనేసుకుంటే ఎంత హాయి కదండీ!

 విశ్వనాధ్ గారి  సినిమా చూస్తూ " ఏంటో ఈయన చాదస్తం. ఈ రోజుల్లో ఇంకా ఈ సంగీతాలు, నాట్యాలు అంటే ఎవరు చూస్తారు?" అంటారు. అదే ఏ క్రొత్త దర్శకుడి సినిమానో  చూసి "అసలు ఈ సినిమాలు చూసే జనం చెడిపోతున్నారు" అని విసుక్కుంటారు. కానీ అసలు ఏ సినిమా చూడాలి అనేది తాము నిర్ణయించుకుని నచ్చినవే చూడగలిగేలా చేసుకోవడం తమ చేతుల్లో వుందని గ్రహిస్తే మన సంతోష కాల పరిమితి పెరుగుతుందేమో!

నా వరకు నేను ఆలోచిస్తే ఈ వ్యాసం వ్రాయడం వరకే, టైపు చేయడం వరకే నా కంట్రోల్ లో వున్నట్టు. సాధ్యమైనంత వరకూ ఎవరి మనసునీ నొప్పించకుండా వ్రాద్దామనే మొదలుపెడతాను, అలాగే వ్రాశాననీ అనుకుంటాను. కానీ ఈ వ్యాసాన్ని అందరి చేతా చదివించడం, వాళ్ళ మెప్పు పొందడం అనేవి నాచేతుల్లో లేని విషయాలు. 

సారాంశం: వ్రాయడం వరకూ నా ప్రయత్నం బాగానే చేశాను (థింగ్ దట్ ఇస్ ఇన్ మై కంట్రోల్), చదివినవాళ్ళ భూషణ దూషణ తిరస్కారాలని నేను ఆమోదిస్తాను- ఎందుకంటే అది నా పరిధికి ఆవల వున్న విషయం కనుక (థింగ్ దట్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్), దాని గురించి ఆలోచించి నేను ఇంకో చోట ఉపయోగించుకోగలిగే సమయాన్ని వృధా చేయలేను కనుక.

నాకు చేతనయింది -
ఈ నూతన సంవత్సరం నేను ఆనందంగా వుండడం 
మీరందరూ ఆనందం గా జరుపుకోవాలనుకోవడం - 

మీరు చేయగలగాలని నేను కోరుకునేది 
మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం
అందరూ సంతోషం గా వుండాలి అనుకోవడం - 

2012 నూతన సంవత్సర శుభాకాంక్షలతో....

~ లలితా TS

27, డిసెంబర్ 2011, మంగళవారం

నచ్చావులే...!!!


డిసెంబర్ నెల విహంగ లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


అపూర్వ మిత్రద్వయం "బాపు-రమణ" ల శ్రీ రామ రాజ్యం విడుదలయింది కదా - మళ్ళీ మళ్ళీ పౌరాణికాలు రాబోయాయా-చూడబోయామా అనుకుని  ఒక 45 నిముషాల డ్రైవ్ లో వున్నఒకానొక ధియేటర్ కి వెళ్లి ఆ సినిమా చూసి అక్కడక్కడా లవ-కుశ తో పోల్చుకుని మనసు లో కలగబోయిన అసంతృప్తిని అంతగా లెక్కచేయక ఒక మంచి సినిమా చూశామనేసుకున్నాము. మరుసటి రోజు కలవడానికి వచ్చిన మిత్రులతో మాట్లాడుతుండగా శ్రీ రామ రాజ్యం ప్రస్తావన వచ్చింది. ఎలా వుంది అన్న ప్రశ్నకి తెగ ఉత్సాహపడి ఆ సినిమా లో నచ్చిన సన్నివేశాలు, బాలకృష్ణ నటన, నయనతార ఆహార్యం, అభినయం, లవకుశుల హావభావాలు, ఫోటోగ్రఫి, గ్రాఫిక్స్ గురించి నాదైన ధోరణిలో చెప్పుకుపోతూ వున్నాను. ఆ వచ్చిన వారు నన్ను మధ్యలోనే ఆపేసి - మిమ్మల్ని అడిగాను చూడండి ! అసలు ఆ బాలకృష్ణ నీలం సున్నం వేసుకున్నవాడిలా ఏమన్నా బాగున్నాడాండీ? ఆ ఇళయరాజా సంగీతం అసలు సంగీతమేనా- పాటలు అన్నీ చెడగొట్టాడు. కీరవాణి అయితే పాటలు గొప్పగా ఉండేవి. లవకుశ తో పోలిస్తే పాసు మార్కులు కూడా రావు ఈ సినిమాకి- మీరెంతైనా చెప్పండి- అనేశారు. అంతే! ఇంకేమీ చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. 

వారు "అస్సలు బాలేదు - మీరెంతైనా చెప్పండి" అని  తెల్చేయకుండా ఒక్క మాటైనా  మంచిగా  అంటే - ఏదో బాపు-రమణ కాంబినేషన్ లో ఆఖరి సినిమా, ఎక్కడా ఇంగ్లీష్ మాట-పాట లేని అచ్చ తెలుగు సినిమా, మన సీతారాముల్ని సరికొత్త రంగుల్లో చూపించిన సినిమా అని అనివుంటే మా సంభాషణ ఇంకొంచెం ఆహ్లాదం గా సాగేదేమో! 

అనుకోకుండా ఆ  మిత్ర కుటుంబాన్నే మళ్ళీ ఒక పుట్టిన రోజు పార్టీ లో కలిశాము- మరుసటి రోజే. పలకరింపులు, కుశల ప్రశ్నలు అయాక చుట్టు పక్కల వున్న ఇండియన్ రెస్టారెంట్స్ లో ఏది బాగుంటుంది అన్న మాట వచ్చింది. మేము గత ఆరేళ్లుగా మా పెళ్లి రోజు, పిల్లలపుట్టినరోజులు, ఇంకా ఏమైనా ముఖ్య సందర్భాలలో ఆలోచించకుండా అతి ఇష్టం గా వెళ్ళే ఒకానొక రెస్టారెంట్ పేరు చెప్పాము. వెంటనే " అదాండీ! మీకైతే ఎలా నచ్చిందో కానీండి. ఒకసారి వెళ్ళాము - ఆ ఓనరో, మరెవరోనండీ బొత్తిగా  మేనర్సు లేనివాడిలా వున్నాడు. మధ్యలో వచ్చి "ఈస్ ఎవ్రీతింగ్ ఆల్రైట్" అనడుగుతాడు. అసలు ప్రైవసీ నే వుండదు ఆ రెస్టారెంట్ లో " అనేశారు ఆ కుటుంబ పెద్ద. నిజంగా చెప్పాలంటే  వారు "బొత్తిగా మేనర్సు లేదన్న ఆ ఓనరు" మిగిలిన రెస్టారెంట్లలా  కాక మొదటిసారి ఇచ్చిన రైస్ కానీ, రోటీలు కానీ ఖాళీ అయితే అదనంగా ఛార్జ్ చేయకుండా మళ్ళీ సర్వ్ చేస్తాడు. అక్కడ లభించే పదార్థాలు ఎప్పుడు  తాజాదనం లోనూ, రుచిలోనూ తేడా లేకుండా వుంటాయి. అది దాదాపుగా అందరూ అంగీకరించారు - మా సంభాషణలో పాల్గొన్నవాళ్ళంతా - ఒక్క మా మిత్రులు తప్ప. అసలు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్న వాటి గురించి మాట్లాడకుండా సంబంధం లేని ఏదో ఒక రెండు నిముషాలు వచ్చిపోయే ఓనర్  ప్రవర్తన గురించే అయేటప్పటికి ఆ సంభాషణ అంతటితో సరి.

తర్వాత ఆలోచిస్తే అనిపించింది - కొంతమంది చేత ఏదైనా సరే బావుంది అనిపించాలంటే చాలా కష్టం. నలుపంటే ఇష్టం లేదు అంటూ అన్ని రంగులూ కలిస్తేనే తెలుపు అవుతుంది - అంటే తెలుపులో కూడా నలుపు వుంది. అందుకే తెలుపు అంటే కూడా ఇష్టం లేదు అని వాదించి నెగ్గేస్తారు కూడా. 


అలాగే ఇంకొందరు పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అది తప్పని తెలిశాక కూడా అంత తొందరగా ఆ అభిప్రాయాన్ని మార్చుకోరు. ఒకసారి నాలుగు కుటుంబాలు కలిసి వారి ఊరికి దగ్గరగా వున్న సముద్రతీరానికి కార్తీక మాసం లో వనభోజనాలకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అలా అనుకున్న తర్వాత చాలా ఉత్సాహంగా ఎవరు ఏమి వండి తీసుకుని వెళ్ళాలో మాట్లాడుకుని కావాల్సిన వస్తువుల జాబితా వ్రాసుకున్నారు. అందులో ఒకావిడ పులిహోర చేస్తానని చెప్పారు. తీరా ఆ రోజు వచ్చేసరికి అనుకున్న సమయానికి ఆ కుటుంబం నిర్ణీత స్థలానికి రాలేదు. కొంచెం ఎదురు చూశాక అందులో రామన్ అనే ఆయన  "నేను ముందు నుంచే అనుకుంటున్నాను. వీళ్ళిలా హ్యాండ్ ఇస్తారని- ఇలాంటి వాళ్ళతో ఎప్పుడూ పెట్టుకోకూడదు" అని. అది విన్న మరొకరు "అయ్యో! అలా అనకండి. రావుగారెప్పుడూ అందరి కన్నా ముందు వుంటారు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దాము - సంగతేంటో తెలుస్తుంది కదా " అని బయల్దేరి వెళ్ళారు. ఆ రావుగారు వెళ్ళిన వారికి వారి ఇంటి గేటు బయటే కనిపించి "అనుకోని ఇబ్బంది వచ్చింది - రాలేకపోతున్నాము. ఏమీ అనుకోకండి" అని చెప్పి పంపించేశారు. తిరిగి వచ్చేదారిలో, మళ్ళీ పిక్నిక్ వెళ్లి వచ్చేదాకా రామన్ గారు ఆ పిక్నిక్ కి వస్తామని చెప్పి , చివరికి రాని రావుగారిని తిడుతూనే వున్నారు. రెండో రోజు ఆఫీసులో ఎవరో చెప్పగా తెలిసింది రావుగారి భార్య తెల్లవారుఝామున చీకట్లో కనపడక మెట్ల మీద జారిపడి కాలు ఫ్రాక్చర్ అయింది - హాస్పిటల్ లో వున్నారని. ఆ సంగతి తెలిస్తే అందరూ పిక్నిక్ మానేస్తారని రావుగారు భార్యని ఆసుపత్రి లో చేర్చి తాను ఇంటి గేటు దగ్గర వీరి కోసం వేచి వున్నారు. అలా కాకపోతే పక్కింటి వాళ్ళ వల్ల తన భార్య కాలు విరిగిన విషయం తెలిసి అందరి ప్రోగ్రాం పాడవుతుందని. ఇది విన్న తర్వాత పికినిక్ కి వెళ్ళిన అందరూ బాధ పడ్డారు - ఒక్క రామన్ గారు తప్ప. ఆయన ఇప్పటికీ పిక్నిక్ కి రావడం ఇష్టం లేకే ఏదో చిన్న దెబ్బ తగిలి  రావుగారి భార్య కాలు బెణికితే దానికి ఫ్రాక్చర్ అని అబద్ధం చెప్పారని అనుకుంటూ వుంటారు - అందరికీ చెప్తూ వుంటారు.

అన్నీ నచ్చాలని లేదు- నచ్చి తీరాలనీ కాదు. కానీ తటస్థ పడ్డ ప్రతీ వ్యక్తిలోనూ, ప్రతీ సంఘటన  లోనూ తప్పులే ఎన్నుకుంటూ పోతే చివరికి మనకి మనమే ఇష్టం లేకుండా పోతామేమో.

ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలని వుంది. ఒకరోజు నేను మా ఏడేళ్ళ బాబుకి లంచ్ టైమ్లో అన్నం, పప్పు కలిపి తినమని ఇచ్చాను. వాడు అది తిన్న తర్వాత పెరుగు అన్నం కలపబోతూ అలవాటు ప్రకారం"ఏం నాన్నా! పప్పూ-ఆమ్ ఎలా వుంది" అని అడిగాను . వాడు ఒక నిముషం నిశ్శబ్దం గా వుండి "అమ్మా! నువ్వు బాగా చేశావు కానీ నాకు నచ్చలేదమ్మా" అన్నాడు. ఆ మాటకి పప్పు బాగా లేదన్నాడని బాధ వేసే బదులు నేనెక్కడ  బాధ పడతానో అని అలోచించి నా ప్రయత్నంగా నేను బాగా వండానని చెప్పాడని మురిసిపోయాను.

మనకి నచ్చని వాటిని పది కారణాలు  వెతికి ఎత్తి చూపేకన్నా నచ్చిన ఒక కారణం చెప్పగలిగితే మన ఇంటర్ - పెర్సనల్ రిలేషన్షిప్స్ పొడి-పొడి మాటలు దాటి స్నేహపూరిత వాగ్జ్హరులు అవుతాయి. 

మనకి పది మంది సన్నిహితులుంటే పదిమందీ మనలాగే ఆలోచించాలి , మనలాగే వుండాలి - అలా అయితేనే మెచ్చుతాము, నచ్చుతారు అనుకుంటే మన పరిధి అంతగా విస్తరించక  కూపస్థ మండూకాల్లా తయారవుతామేమో. 

ఇంట్లో గానీ, ఆఫీసుల్లో కానీ, స్నేహితులు /పరిచయస్తుల్లలో కానీ - ఎక్కడయినా ఎప్పుడయినా ఎవరినీ , ఏ పరిస్థితినీ మనకి తోచినట్టు అంచనా వేయకుండా, వున్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ నచ్చుతారేమో / యేమో కదా! 

ఇంకొద్ది రోజుల్లో 2012 నూతన సంవత్సరం లో అడుగుబెట్టబోతున్నాము కదా....శుభాకాంక్షలతో పాటు 

మొన్న తొడిగిన భూతద్దాలు లేవులే
నిన్న పెట్టుకున్న  రంగుటద్దాలు కావులే
నిన్ను ఎలాగైనా మెచ్చాలనే నా కళ్ళులే
నిన్ను మెచ్చానులే! నువ్వు నువ్వుగా నచ్చావులే!

....అని చెబ్దామా?!!!!



21, డిసెంబర్ 2011, బుధవారం

మా నాన్న గారు నేర్పిన "సకల పప్పు సహిత ఓట్స్ పాకం"


అమ్మాయిలూ!

మీరంతా చాలా మంచి రెసిపీలు చెప్పారు (ఇప్పటివరకూ చెప్పినవాళ్ళు) మరియు చెప్పగలరు (ఇంకా చెప్పవలసినవాళ్ళు) - . నేనూ ఏదో వ్రాద్దామనుకున్నాను. కానీ ఎంత ఆలోచించినా ఏదో మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిల కోసం వండే ఇంగువ పప్పులూ, బంగాళ దుంప, చేమదుంప వేపడాలు, నేను ఇష్టంగా తినే టమాటా బండ పచ్చడి (బండ అంటే బండలా వుండే టమాటా తో చేసేది కాదు - అప్పటికప్పుడు తాజా టమాటాలతో చేసేదన్నమాట!) తప్ప ఇంకేమీ తట్టట్లేదు. మా అమ్మ పుణ్యమాని (నిజ్జంగా ! పాపం ఆవిడ చేసిన ఏ పూర్వ పుణ్యమో -  ఎంత మంది వచ్చినా పగలు, రాత్రి అనకుండా వేడి వేడిగా వండి పెట్టగలిగే ఓపిక ఆవిడకి, ఇటు పెట్టిన మంచి నీళ్ళ గ్లాసు అటు పెట్టకుండా ఆవిడ చేసిన వంటలు తిని పెరిగే భాగ్యం ఆవిడ ముగ్గురాడపిల్లలకీ దక్కింది) "మావూరి వంటలే" కాదు ఏ వూరి వంటలూ రాకుండానే గడిపేస్తున్నాను. 

నా అదృష్టం కొద్దీ 
- నేను ఉట్టి పప్పు (అంటే ముద్ద పప్పు) చేసినా - "మామా! యు ఆర్ ది బెస్ట్ పప్పు కుకర్ " అని తినేసే బుజ్జిగాళ్ల మంచితనంతో, 
- బంగాళ దుంప తో ఏ వంటకం చేసినా కళ్ళు మూసుకుని (తన్మయత్వం తో) "చాలా బావుంది బుజ్జాయ్!!" అని ప్రశంసా పూర్వకం గా కళ్ళేగరేస్తూ  మరుసటి రోజే కాకుండా ప్రతీ రోజూ బంగాళ దుంపలు చేసేద్దామా అనిపించేలా చేసే నా ప్రియ పతి ఇచ్చే పాక-స్ఫూర్తితో,  
- అంతే కాకుండా నేను చేసే కోనసీమ-కర్నాటక కాక్టైలు వంటలు తిని మురిసిపోతూ "లలితా! ఆ ముద్ద ఉప్మా చేస్తావూ ఇవాళ" అని నా ఫేవరేట్ జారు-జారు పెళ్లుప్మా (అదే - బిర్యానీలు,  టొమేటో బాతులు రాకముందు తెలుగు వారి  పెళ్లి పందిళ్ళలో ఆప్యాయంగా రాజ్యమేలిన ఉల్లిపాయ-రహిత ఉప్మా) అడిగి మరీ చేయించుకుని తినే అత్తగారి ప్రోత్సాహం తో.....
నేను తరిగిందే కూర - వండిందే వంటగా కాలం గడిపేస్తున్నాను.

ఇంతలో ఒకసారి మన అన్నపూర్ణ "నేను చేసిన పెకాన్ పై (pecan pie) అందరికీ ఇష్టం లలితా! ఎన్ని చేసినా అందరూ ఇష్టంగా తింటారు" అంటే నేర్చేసుకుందామన్న ఉత్సాహంతో మన యాహూ గ్రూప్ లో ఆ రెసిపీ పోస్ట్ చేయమన్నాను. తను పోస్ట్ చేసిన వెంటనే  అమృతవల్లి పంపిన మాస్టర్ రెసిపీ కూడా చదివాను.  

నేనేం వ్రాయాలా అని అప్పట్నుంచీ ఆలోచిస్తూ వున్నాను. నేను దోశ వేయడమే ఒక ప్రహసనమైన నా వంటింటి పాక-కళాకౌశలంతో ఏం వంటకం గురించి చెప్పాలో తట్టట్లేదు.

 (దోశ-ప్రహసనం అంటే ఏం లేదు- నేను పిండి రుబ్బి పొద్దున్నే స్టవ్ ని భక్తిగా తుడిచి, నా అస్త్ర-శస్త్రాలైన పెనం-అట్లకాడ తో హారతి ఇస్తున్నట్లుగా తిప్పి, మనసులో మా ఆయన్ని తలచుకొని గరిటతో పిండి తీసుకుని పెనం మీద వేసీ వేయగానే - అదేదో ఎవరైనా దీపావళి బాంబు వెలిగిస్తుంటే దూరం గా నుంచుని అది పేలుతుందో లేదోఅని టెన్షన్ గా చూస్తూ వుంటామే - అలా బదరి వంటింటికి దూరంగా లివింగ్ రూం లో నుంచుని - దోశ వస్తోందా? వస్తోందా? - అని అడుగుతూ వుంటే వణికే చేతులతో దోశలు వేసిన వారాంతపు ఉదయాలెన్నో!!)

ఇలా నేనింత వంటింటి-మథన పడుతూ వుండగా ఆపద్బాంధవిలా మా నాన్నగారు  చెప్పిన "సకల పప్పు సహిత  ఓట్స్ పాకం" గుర్తుకి వచ్చింది.
అదేంటో వివరం గా వ్రాస్తాను - చదవండి :)

క్రిందటి  శనివారం అలవాటుగా ఇంటికి (రాజమండ్రి) కి ఫోన్ చేస్తే ...అబ్బే అలా చెప్పేస్తే మజా ఎలా...చదవండి క్రింద ఇలా...

"హలో! నాన్నా! బావున్నారా?"
"బ్రహ్మాండంగా వున్నాను. అది సరే గానీ లల్లీ! ఓ పెన్నూ పేపరూ తీసుకో. నీకో ప్రోటీన్-రిచ్ స్వీటు చెప్తాను. రాసుకో"
"అదేంటి నాన్నా!"
"ముందు రాసుకో- పెన్నూ పేపరూ తెచ్చావా"
"......."
"నిన్న మధ్యాన్నం బాలూ వాళ్లకి చేసి పెట్టాను. బ్రహ్మాండం గా వచ్చింది. మాంచి ఫైబర్ ఫుడ్డు - ఇంక రాసుకో"
"సరే నాన్నా! చెప్పండి"
"ఓట్సు 200 గ్రాములు, బెల్లం 180  నుంచి 200  గ్రాములు, జీడిపప్పు 25  గ్రాములు, బాదం 25  గ్రాములు, పిస్తా 25  గ్రాములు, నూపప్పు 15  గ్రాములు, వేరుశనగ పప్పు 25  గ్రాములు - ఇవన్నీ తీసుకో.
ఓ బూర్లి మూకుడులో వేయించి పక్కన పెట్టుకో - ఓట్స్ కూడా వేయించుకో నెయ్యి వేసి.
బెల్లం కోరి పడేయ్. నీళ్ళు పోయ్.
ముదురుపాకం తీయ్. పాకం స్టవ్ మీంచి దించేసి దాంట్లో ఇవన్నీ పోసెయ్. 
మొత్తం కలియబెట్టి బాగా కలిసిన తర్వాత పెద్ద కంచం లో వేసి, వేడి మీద చాకుతో కోసేయ్.
ఫ్లేవర్ కావాలంటే ఏలకుల పొడి వేసేయ్. ఇది పెట్టి చూడు. బదరీకి, పిల్లలకీ కూడా నచ్చుతుంది"

అదీ మా నాన్నగారు చెప్పిన "సకల పప్పు సహిత  ఓట్స్ పాకం" రెసిపీ. 

(మా నాన్నగారు జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజుకి ఒక రోజు ముందు పుట్టారు - కొన్ని సంవత్సరాల తేడాతో. అందుకే నెహ్రు గారు ఇందిరా గాంధీకి వ్రాసినట్లు నాకూ ఉత్తరాలు వ్రాస్తూ వుంటారు - అలా పంపిన రెసిపీలు చాలా వున్నాయి కానీ ప్రస్తుతానికి ఇది చదివేసేయండి :) ఈ మధ్య ఇంకా ఉద్యోగం ఎందుకు నాన్నా రెస్ట్ తీసుకోండి అంటే పొద్దున్న మాత్రం ఆఫీసు కి వెళ్లి వచ్చి మధ్యాహ్నాలు ఇలా పాక-శాస్త్ర ప్రయోగాలు చేస్తున్నారు.)

జై పాక-మాతా! జయహో ఔత్సాహిక కుకర్లూ! 

~లలిత 

11, డిసెంబర్ 2011, ఆదివారం

కోతీ - డాం డాం

(నాన్నమ్మ చెప్పిన కథ. ఈ కథ చిన్న పిల్లలలు ఒక వరుసలో విషయాలు మననం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి అవసరమైన మానసిక అభ్యాసానికి  చాలా ఉపయోగపడుతుంది.)

అనగనగా ఒక కోతి వుంది.
ఒకరోజు అది ఒక అడవిలో వెళ్తూ వుంటే కాలులో ముల్లు గుచ్చుకుంది.
వెంటనే ఆ కోతి నేల మీద కూర్చుని కాలు చూసుకుని ఏడుస్తూ వుంది.
ఇంతలో అటుగా ఒక అబ్బాయి వచ్చాడు అతని చేతిలో ఒక కత్తి వుంది.
"కోతీ! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
కోతి తన కాలులో గుచ్చుకున్న ముల్లు చూపించగానే తన చేతిలో వున్న కత్తితో ఆ ముల్లు తీసేసి అవతల విసిరేశాడు.
వెంటనే కోతి కోపంగా "హన్నా! ముల్లు తీయమన్నాను కానీ పడేయమన్నానా? నా ముల్లిస్తావా? లేకపోతే నీ కత్తిస్తావా ? "అని అడిగింది.
ఆ అబ్బాయి ఏం చేస్తాడు, పాపం! కత్తి కోతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
కోతి ఆ కత్తి తీసుకుని వెళ్తూ వుంటే అడవిలో ఒకచోట ఒక కట్టెలు కొట్టుకునే అతను చేతితో చెట్టు కొమ్మలను విరుస్తూ కనిపించాడు.
కోతి అతని దగ్గరికి వెళ్లి "అయ్యో! అలా ఎంతసేపని చేతితో విరుస్తావు. ఇదిగో ఈ కత్తి తీసుకో" అని అతనికి కత్తి ఇచ్చింది.
కత్తితో కొన్ని కట్టెలు కొట్టాక  కత్తి విరిగిపోయింది.
అంతే కోతి " నీ కట్టెలు కొట్టుకో అని ఇస్తే నా కత్తి విరిచేస్తావా? నా కత్తి ఇస్తావా? నీ కట్టెలు ఇస్తావా?" అని దబాయించింది.
ఇంకేం చేస్తాడు పాపం, ఆ కట్టెలు కొట్టుకునే అతను! తన కట్టెలు అన్నీ కట్ట కత్తి కోతికి ఇచ్చేశాడు.
కోతి కట్టెల మోపును తల మీద పెట్టుకుని వెళ్తూ వుంటే ఒక వూరిలో ముసలమ్మ కొబ్బరి ఆకులతో పొయ్యి వెలిగించడానికి సతమతమవుతూ కనిపించింది.
వెంటనే కోతి ముసలమ్మ దగ్గరికి వెళ్లి "అవ్వా! ఆ కొబ్బరాకులతో పొగే కానీ మంట మండదు. అలా ఏం అవస్థ పడతావు గానీ ఈ కట్టెలు తీసుకుని వంట చేసుకో " అని తన దగ్గరున్న కట్టెలు ఇచ్చింది.
ఆ అవ్వ ఆనందంగా కట్టెలు పెట్టి పొయ్యి రాజేసి పెనం కాల్చి అట్లు పోసుకుంది. అట్లు వేయడం పూర్తి అయేటప్పటికి కోతి ఇచ్చిన కట్టెలు అన్నీ కాలి బూడిద అయిపోయాయి.
అది చూసి కోతి "నా కట్టెలన్నీ కాల్చి బూడిద చేసేస్తావా? నా కట్టెలు ఇస్తావా? లేకపోతే నీ అట్లు ఇస్తావా?" అని పేచీ పెట్టింది.
పాపం ఆ అవ్వ చేసేదేమీ లేక అట్లన్నీ కోతికి ఇచ్చేసింది.
కోతి ఆ అట్లు మూట కట్టుకుని వెళ్తూవుంటే బజార్లో ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు.
వెంటనే కోతి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి " బాబూ! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది.
దానికి ఆ పిల్లాడు " మా అమ్మ కొత్త కుండ కొనుక్కురా అని సంతకి పంపించింది. వున్న డబ్బులన్నీ కుండ కొనడానికే ఖర్చు అయిపోయాయి. నాకిప్పుడు ఆకలి వేస్తోంది. కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు." అని ఏడ్చాడు.
అది వినగానే కోతి "అయ్యో! అలాగా! దా...నా దగ్గర అట్లు వున్నాయి. తిను. " అని అట్ల మూట ఆ అబ్బాయి చేతికి ఇచ్చింది.
వాడు బాగా ఆకలి మీద వున్నాడేమో - ఆవురు ఆవురని అట్లన్నీ తినేశాడు.
అంతే కోతికి మళ్ళీ కోపం వచ్చేసింది. "ఏదో ఒకటో రెండో తింటావని ఇస్తే అన్నీ తినేస్తావా? నా అట్లు ఇస్తావా? నీ కుండ ఇస్తావా? " అని అరిచింది.
ఆ పిల్లాడు బెదిరిపోయి కోతికి కుండ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
కోతి ఆ కుండ తీసుకుని వెళ్తూ ఒక తోట దగ్గర ఆగింది.
ఆ తోటకి చిల్లు కుండతో నీళ్ళు పెడుతూ తోటమాలి కనిపించాడు.
కోతి తోటమాలి దగ్గరికి వెళ్లి "ఆ చిల్లు కుండతో ఎన్ని సార్లని అటూ ఇటూ తిరుగుతావు? ఇదిగో ఈ కొత్త కుండ తీసుకో." అని ఇచ్చింది.
తోటమాలి ఆనందంగా ఆ కొత్త కుండతో తోటకి నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలో నూతి లోంచి కొత్తకుండతో నీళ్ళు తోడుతూ వుండగా నూతి గోడకి తగిలి కుండ పగిలిపోయింది.
వెంటనే కోతి "నా కుండ ఇస్తావా? నీ పూల దండలు ఇస్తావా? " అని పట్టు పట్టి ఆ తోటమాలి దగ్గర పూలదండలన్నీ పట్టుకుపోయింది.
పూలదండలు పట్టుకుని కోతి అలా వెళ్తూ వుంటే ఒక చోట రాజుగారి కూతురి పెళ్లి జరుగుతూ కనిపించింది. ఆ పెళ్ళిలో పూలు దొరకలేదని అందరూ అనుకుంటూ వుంటే కోతి వెళ్లి " పూలు లేని పెళ్లి ఏం పెళ్లి? ఈ పూలు తీసుకోండి" అని తన దగ్గరున్న పూలదండలు పెళ్లికూతురుకి ఇచ్చింది.
కోతి ఇచ్చిన పూలతో అలంకరించుకుని రాజుగారి కూతురు పెళ్లి చేసుకుంది.
మర్నాటికి పూలదండలు వాడిపోవడం చూసి " నా పూల దండ ఇస్తారా? మీ పిల్ల నిస్తారా " అని పేచీ పెట్టి రాజుగారి కూతుర్ని తీసుకుని కోతి వేరే వూరికి బయల్దేరింది.
దారిలో ఒక సర్కస్ చేసేవాళ్ళు కనిపించారు. గడ ఎక్కడానికి పిల్ల లేదే అనుకుంటూ వుంటే "ఇదిగో నా దగ్గర పిల్ల వుంది. దీన్ని గడ ఎక్కించండి" అని కోతి రాజుగారి కూతుర్ని వాళ్లకి ఇచ్చింది.
సర్కస్ వాళ్ళు గడ ఎక్కించగానే కొంచెం నడవగానే అలవాటులేక తూలిపడి రాజుగారి కూతురుకి కాలు విరిగింది.
వెంటనే కోతి "హన్నా! నా పిల్ల కాలు విరక్కొడతారా? నా పిల్ల కాలు బాగు చేస్తారా? లేకపోతే మీ డప్పు ఇస్తారా? " అని అడిగింది.
కోతితో గొడవ ఎందుకని సర్కస్ వాళ్ళు డప్పు ఇచ్చేశారు.
కోతి ఆ డప్పు తీసుకుని ఒక చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చుని ఇలా పాడింది.....

ముల్లు పోయి కత్తి వచ్చే డాం డాం డాం
కత్తి పోయి కట్టే వచ్చే డాం డాం డాం
కట్టే పోయి అట్టు  వచ్చే డాం డాం డాం
అట్టు పోయి కుండ వచ్చే డాం డాం డాం
కుండ పోయి దండ వచ్చే డాం డాం డాం
దండ పోయి పిల్ల వచ్చే డాం డాం డాం
పిల్ల పోయి డప్పు వచ్చే డాం డాం డాం - డాం డాం డాం