29, జులై 2017, శనివారం

ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే ( తానా జ్ఞాపిక నుంచి నా జ్ఞాపకం)


 బోలువో, బోల్డువో - బోల్డన్ని కబుర్లు రాస్తున్నానామరి!
అందులోనూ అంకెలతో పాటు అక్షరాలతోనూ, మాటలతోనూ నా ఆటల-పాటల సరదా ఉండనే ఉందా?!

అదీ - అద్గదీ ... అదే మరి  - చేర్చింది నన్ను తానా చోటికి - తానాలోని సాహిత్యకమిటీకి.

తానా జ్ఞాపికకి ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు  అన్న శీర్షికన వ్యాసమో, కథో, కవితో రాస్తే బావుంటుందని హితులు, స్నేహితులు, సన్నిహితులు అన్న మాట పట్టుకుని తానా-వారి శీర్షికని నా మాటల్లో ఎల్లలు దాటే  - ఎల్లెడలా వెలిగే అనేసుకునితెలుగుమాట మీద నాకున్న ఇష్టాన్ని ఆ మాటా - ఈ మాటాగా - మాటలు పేర్చి-  కొన్ని మాటల్లో రాసి పంపించాను.



నన్నచ్చెరువున ముంచెత్తుతూ అదచ్చయ్యింది - అచ్చు పత్రికన నిచ్చలుగా నిలిచింది.

ఆ కబురు - ఈ కబురు అంటూ ప్రతీ వారం చెప్పడానికో కబురు ఎలాగూ ఉంటోంది కదా అని  ఓ పక్కన పెట్టగా - మరుగున వున్న ఈ జ్ఞాపిక-కబురు ఈ రోజుకి బ్లాక్కెక్కించాలనిపించింది.

రెండు చోట్ల మాత్రం అచ్చులో మార్పు కనిపించింది. అదీ... ఈ పేరాలో :



అన్నిటికన్నా త్రిక సంధి మీద ఆదో-ఈదో-ఏదో చెప్పలేని ప్రీతి కలిగింది - అందుకు ముఖ్య కారణం వేటూరి వారి "కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలమాబాలగోపాలుని అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో) విచ్చిన కన్నుల జూడ" అన్న పాటే అని చెప్పడానికి ఎలాంటి మోమాటమూ లేదు.


"ఆ-ఈ-ఏలు త్రికములనబడును" అన్న త్రికసంధి సూత్రాన్ని తలుచుకుంటూ ఆదో-ఈదో-ఏదో అన్న నా పన్-ధోరణి ఎడిటింగ్‌లో ఆటకట్టి ఆదో-ఇదో-ఏదో గా పండిపోయింది.

నా మోమాటం లేని హకారాన్ని హల్లు-అప్పు తెచ్చుకుని మోహమాటంగా  అచ్చు- తప్పయ్యింది.

ఏదేమైనా నా-మాట అచ్చులో తానా-మాటయ్యింది. ఈ రోజుకి నా బ్లాగుకి పోస్టయ్యింది. 



ఎల్లలు దాటే  - ఎల్లెడలా వెలిగే



ఓ న మః
శి వా యః
సి ద్ధం న మః

- అని నాలుగు పక్కలా పసుపు గౌర్లు పెట్టిన నల్లటి కొత్త పలక మీద తిన్నగా, పొడుగ్గా, బల్-నున్నగా వున్న పాలబలపం పట్టిన నా చేయి పట్టి రామశేషు మేష్టారు రాయించగానే నాలోని పసితనం ఆ అక్షరాల పసిడితనపు భ్రాంతిలో పడిపోయింది.

అప్పటివరకు ఆటపాటలే ఆరుకాలాలుగా సాగిన నాకు ఈ కొత్త అక్షరాలు దిద్దే ఆట బహు బాగా నచ్చింది. పొద్దున్న బళ్లోకి వెళ్లగానే మల్లయ్య మేష్టారు, రామయ్య పంతులుగారు, కోటేశ్వర్రావు మేష్టారు, రామశేషు మేష్టారు అన్ని తరగతుల పిల్లలనీ రెండు వరసల్లో నిలబెట్టి చేయించిన ప్రార్థన -

తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్ నీవు నా
యుల్లం బందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!

అని ఆ చదువులతల్లి పద్యంతో మొదలు. 

ఆ తర్వాత రోజూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడాల్సిందే. ఇవి రెండూ అయిన తర్వాతే పాఠాలు. 

పొద్దున్న పలకమీద మేష్టారు రాసిచ్చిన అఆలు నున్నగా జుట్టు దువ్వుకుని ముస్తాబైన కళకళలాడే అందమైన సన్నటి మెరుపు తీగల్లాంటి ఆడపిల్లల్లా కనిపించేవి. 

వాటిని దీక్షగా దిద్దీ, దిద్దీ - మధ్యాహ్నానికి శ్రద్ధగా పెంచి పెద్ద చేసేశాను - అని మురిసిపోయే సమయానికి అవి ఆటపాటల్లో, అరువు దెబ్బలాటల్లో జుట్టు చెదిరి, కాటుక కంటి హద్దులు దాటి బుగ్గల దాకా పాకిన గడుగ్గాయి అమ్మాయిల్లా తయారయేవి. 

ముందు రోజు రాసిచ్చిన నాలుగక్షరాలు గబగబా నేర్చేసుకుంటే మరుసటి రోజు ఇంకొన్ని కొత్తక్షరాలు పోగేసుకోవచ్చని - అలా కూడబెట్టుకున్న అక్షరాలతో కూడబలుక్కుని కనిపించిన కాయితమల్లా చదివేస్తూ ఉంటే కళ్ల ముందు రోజుకో కొత్త బంగారు లోకపు కిటికీ తెరుచుకుంటూ ఉంటుందని తెలిసిపోయింది. 

ఇంకేముంది - పరుగాపక చదువుబండి సాగింది. 

అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతాలు .... ఆ ... అక్కడ - ఆ గుణింతాల మలుపు దగ్గర బండి కొత్తదారి పట్టింది. 

క-కార అ-కారముల క  - క-కార ఆ-కారముల కా 
క-కార ఇ-కారముల కి  - క-కార ఈ-కారముల కీ 
క-కార ఉకారముల కు  - క-కార ఊకారముల కూ ...  అని గుణింతపు రాగాలు పాడుకుంటూ చిందులేసింది. 

అలా - అక్షరాలా - అక్షరాల మాలల్లుతూ మాటలూ, మాటల మూట గట్టి వాక్యాలు - చదవడం, రాయడం వచ్చేసింది - అలా రావడం నచ్చేసింది. 
తరగతులు త్వరితగతిన దాటుతుంటే జీవభాష వ్యాకరణం - జన జీవన వ్యవహారం ఒకేలా అనిపించేవి. 
అదెలా అంటే -  
మాటల మధ్య సంబంధాలు సంధులని 
మాటలు చేసే సావాసాలు సమాసాలని 
మాటలు చేసుకునే సోకులు అలంకారాలని 
మాటలు కట్టుకునే గుంపులు గణాలని 
మాటలు పేర్చి (పద్య)మాలలు కూర్చొచ్చని
ఆ మాటకొస్తే మాటకి, మనిషికీ బహు దగ్గర సంబంధముందనీ 
మాట కలిపిన మనసు కలుస్తుందని 
మాట నేర్పులేని మనిషికి  మనసు-చేర్పువుండదని 
మాటల గురించి ఇన్ని మంచి మాటలు తెలిశాక 
మాట-మనిషి అరమరికలు లేని అమరిక అని  ఎరుకయింది.
ఆ ఎరుకతోనే మాట తూలక ఒబ్బిడిగా వాడితే మాట మరింత ఎన్నికగా మన్ని మన్ననిస్తుందని తెలిసింది.

సరి సరి - ఈ మాటల-మాటలతో ఏమారి నా దారి దారి-మళ్లిపోయినట్లుంది.

ఎక్కడ ఆగాను - గుణింతాల దగ్గర కదూ ?! అనగా-అనగా తెలుగు-చదువు అతిశయ రాగపు బాట పట్టింది. హై స్కూల్ చదువులో విభక్తులు, ప్రత్యయాలు నేర్చి సంధులతో సంధి కుదిరింది. సంధులు నేర్వడం లెక్కలు కూడడం ఒకేలా అనిపించేది - రెంటి మీదా మక్కువ మిక్కిలిగా పెరిగింది.

అన్నిటికన్నా త్రిక సంధి మీద ఆదో-ఈదో-ఏదో చెప్పలేని ప్రీతి కలిగింది - అందుకు ముఖ్య కారణం వేటూరి వారి "కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలమాబాలగోపాలుని అచ్చెరువున (ఆ+చెరువున) అచ్చెరువున (ఆశ్చర్యంతో) విచ్చిన కన్నుల జూడ" అన్న పాటే అని చెప్పడానికి ఎలాంటి మోమాటమూ లేదు.

తెలుగు బాటలో తొలితొలి దారుల మలుపులు దాటి - సాగే కొద్దీ ఒక్కొక్క మెట్టునెక్కుతుంటే  - కనుల చూపుకాననివీ  మినుకు-చూపులకానేవి అయిన మిణుకు లోకాల మజిలీలెన్నో. 

ఆ మజిలీలలోనే మొట్టమొదటిసారిగా అందిపుచ్చుకున్నవి  అందమైన ముగ్గులా అనిపించే దేవులపల్లి వారి అక్షరాలలో వరమోయి అనిపించిన నేటిరేయి కవితలు, మనపక్షం కాకపోతేనేమి కురిసేద్దామా అని వెన్నెలలే పరవశించే కృష్ణపక్షపు పాటలు. లోకానికి బాధ పంచిన ఆయన భాష ఆ బాధలో సౌఖ్యాన్నే చూపింది.

అలా సొంతమైంది  - క్షరము కాని అక్షరాల సాయంతో నింపుకున్న చదువుల అక్షయ తూణీరం. అమ్మ చెప్పిన 'విద్వాన్ సర్వత్ర పూజ్యతే' అన్న లోకోక్తి పట్టుకుని - జీవితపు సహచరునితో కలిసి - కోటివిద్యల్లో చెరో విద్యా ఎన్నుకుని తెలుగు దేశపు ఎల్లలు దాటి ప్రవాసమొచ్చాము. తెలుగు పాటలకు జిలుగులద్దిన మన-సు-కవి ఆత్రేయ గారన్నట్టు దూరమైన కొలది అనురాగం పెరుగుతుంది కదా!  ఏ పని మీదో బయటికి వెళ్లినప్పుడు తెలుగు మాట వినగానే అమ్మ-ఆవకాయ-ఇల్లు ఇత్యాదిగా అ-ఆ-లు జ్ఞప్తికొచ్చి మనసునీ-నోరునీ ఒక్కలా ఊరించేవి.

ఏ రెండు-మూడేళ్లకో వీలు కుదిరి సెలవు చిక్కి కన్నవారిని-మునుపున్న వూరుని చూడడానికి వెళ్లినప్పుడు వస్తూ వస్తూ మూటకట్టుకొచ్చిన కమ్మని కథలుండే-కమ్మలుగల-పుస్తకపు-తాయిలాలెన్నో.

ఈమధ్యే - నలుగురం చేరి కబుర్లాడుకునే వేళ - "ఎండాకాలంలో వడదెబ్బ తగిలిందెవరికో" - అన్న మా మాటలు విని - మా మాటల మేత నందిపుచ్చుకుని తామూ తెలుగు-పులుగులమై ఎగరాలని చూస్తున్న మా వంశవృక్షపు చిగురులు "Was she hit by a వడ? అని అడగ్గానే - ఫక్కుమనే నవ్వుతో బాటు "ఫర్వాలేదు - తినిపిస్తున్న తెలుగు-చిగురాకు వగరు - వగరు అంటూ తింటున్నా తీపిరాగమే పలికిస్తోంది - ఇలాగైతే మన తెలుగుకి ఢోకా లేదు - ఎల్లెడలా వెలిగేస్తుంది" అన్న నమ్మిక కుదిరింది.

ఉపసంహారం: 

తెలుగు - మన తెలుగు
మాటల వెలిగే - మనదైన వెలుగు
వీనుల విందు - పాటల పసందు
తెలుగు పలుకు అనండి -  మీరు వినండి
ఎవరైనా అనగా వింటుంటుండండి
ఇంకెవరో వినగా మీరంటుంటుండండి
తెలుగు అంటుంటే మనం వింటుంటే - ఎంత బావుంటుందో !
ఇలాగే అంటూ వింటూ వుంటే మన తెలుగు ఎంతకాలమైనా ఇలా వుంటూనే వుంటుంది
ఇలలో ఎప్పటికీ నిలిచి వుంటుంది - ఎల్లలు దాటి వెలుగుతుంది - ఎల్లెడలా వెలిగిస్తుంది.



22, జులై 2017, శనివారం

ఆ కబురు... ఈ కబురు... ఓ కోతి కబురు


మామూలుగా ఏ జలుబో, దగ్గో వచ్చి - మూలుగుతూ మందివ్వండి అని వెళ్తే - ఆ మూలుగుకి హీలుగా anti-biotics ఇస్తూ -  కన్నడ దేశాన్నుంచొచ్చి - ఈ సిరిమిన్నల దేశంలో స్థిరపడ్డ మామంచి*-డాక్టర్ చంద్ర శేఖర్‌గారు ఇచ్చే dosage ఎలా ఉంటుందంటే - మొదటి నాలుగు రోజులు నాలుగు చొప్పున, తర్వాతి నాలుగు రోజులు ఒకటి చొప్పున.

(*మామంచి=మహా-మంచి మరియు మా-మంచి) 

నాకు గత ఆరున్నొక్క వారాలుగా తానా కబుర్లు రాస్తూ ఉంటే  - బోల్డంత సేపు రైల్లో ప్రయాణం చేసింతర్వాత - దిగాక్కూడా - ఇంకా అటూ ఇటూ ఊగుతున్నట్టనిపిస్తుందీ - అలా - ఇంకా తానా సంబరాల్లోనే ఉన్నట్టు, ఇంటికి రానట్టు అనిపించేస్తోంది. తెగ బెంగొచ్చేస్తోంది.

అందుకే తానా-కబుర్లు వరసగా చానా రాసేశాను కదా - ఇంకిప్పట్నుంచీ నెలకొకటి రాద్దామని - మా డాక్టరుగారి మోడులో, మోతాదులో 

ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు బోల్డున్నాయి కానీ - తానా-కబుర్లకి తాత్కాలిక విరామం - ఎందుకంటే నాక్కొంచెం మామూలు కబుర్లు చెప్పేసుకుని రిఫ్రెష్ అవాలనివుంది.

అంతే  - అంతకంటే మరేం లేదు.

తాత్కాలిక-తానా-వైరాగ్యం అన్నమాట.

తినగ తినగ వేము తీపి కానీ, అనగ అనగ ఒకే-కబుర్లు ఓకే కాదు మరి.

మర్చిపోయినవి ఎలాగూ మర్చిపోతాను - నాకు గుర్తుండాల్సినవే గుర్తుంటాయి - విన్నప్పుడైనా - విన్న ఆర్నెల్లకైనా.

అందుకని ఏదో సమాచార-loss ఉంటుందని అనుకోను.

ఇవాళ రాసినా - ఇంకో నెల తర్వాత రాసినా అవే కబుర్లు. అదీ నా ధైర్యం.

అసలు నిజం చెప్పాలంటే మొదట్లో నా కబుర్లెప్పుడూ extemporeగా రాసినవే తప్ప - ఏదో అనుకునీ, అనాలకునుకునీ - రాసేవీ - రాసినవీ కాదు.

అలాంటిదీమధ్య అనుకోకుండానే తెగ studiousగా - నా బుద్ధికి విరుద్ధమైనదేదో చేసేస్తున్న ఫీలింగ్.

ఏదో ఒక టాపిక్ లేకుండా ఫ్రీగా, కేర్-ఫ్రీగా, టాపిక్-ఫ్రీగా రాసినట్లు గానీ , ఏ విషయమూ లేకుండా అసలు విషయమే కాని  విషయమే రాసినట్టు గుర్తు లేదు.

అందుకే మళ్ళీ నా గాలి-కబుర్ల mode లోకి వచ్చేశాను - సరదా కబుర్లు ఇవీ అంటూ - ఈ పోస్టుతో - ఒక్క కీ పోటుతో.

సరే! ముందుగా మున్ముందుగా ఓ బుల్లి వివరణ - ఈ పోస్టు పేరు గురించి.

ఆ కబురు ... ఈ కబురు ... ఓ కోతి కబురు ... అనగానేమి ?

ఆ కబురు - ఆపేసిన తానా-కబురు.
ఈ కబురు - ఈనాటి సరదా కబురు
ఓ కోతి కబురు - చదివిస్తాగా ...ఉందురూ!

అనగనగా ఓ బెద్ద-మామయ్య.
ఆ బెద్ద-మామయ్యకి ఓ బుల్లి మేనల్లుడు  - బుజ్జి-బాబు.
రెండార్ల వయసువాడు - ఆరున్నొక్క క్లాసువాడు. 
వాడే ఈనాటి కబుర్ల హీరో.
బెద్ద-మామయ్యకి వారం వారం టెలి-తీగల మీద భూమికి ఆవల ఉన్న చెల్లితో - అదే మన హీరో తల్లితో - మాట్లాడకపోతే, ఆ చెల్లి నవ్వుల రవ్వలు  తీగల మాటున రాగాలై వినిపించకపోతే అస్సలంటే అస్సలు తోచదు - ఇది సిసలైన కబురు.

ఓ రోజలా కబుర్లాడుదామని టెలి-మీటలు నొక్కి పలకరించబోయేవేళ  - బుజ్జి-బాబు ఎత్తాడు ఫోను.

"హలో మామయ్యా!'

"బుజ్జి-బాబూ! బావున్నావా? ఏం చేస్తున్నావు అమ్మేం చేస్తోంది?"

"బావున్నాను మామయ్యా! మరి మామయ్యా! బయట కోతులు వచ్చాయి. అందుకే అమ్మ అటు కొట్టడానికి వెళ్ళింది "

"అమ్మో! అవునా! నువ్వూ కొడతావా కోతుల్ని?"

"అవును మామయ్యా! ఒక స్టిక్కు తీసుకుని కొడతాను"

"అరె! అలా ఎవరైనా కోతుల్ని కర్రతో కొడతారా?"

"మరెలా కొట్టాలి, మామయ్యా?"

"కొబ్బరికాయతో. మరీ ... కోతి అంటే ఆంజనేయస్వామి కదా - గుళ్ళో ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొడతాం కదా - మరి కోతికీ అంతే - కొబ్బరికాయ కొట్టాలి"

"ఆంజనేయస్వామి సగం మనిషి - సగం కోతి కదా, మామయ్యా! ఇదేమో పూర్తి కోతి - తేడా వుంది కదా?!"

"సగం-కోతికన్నా పూర్తి-కోతి  ఇంకా గొప్పకదా! ఇంకా ఎక్కువ గౌరవించాలి"

"అవును మామయ్యా!నాకూ అప్పుడప్పుడు డౌటు వస్తూ ఉంటుంది"

"ఏంటా డౌటు?"

"మనుషులు కోతి నుంచి పుట్టారని చెప్తారు కదా? అసలెలా పుట్టారూ అని?"

"భలే ఉందిరా ఇది? ఎవరు చెప్పారు నీకిది? మనిషి కోతి నుంచి వచ్చాడా? నాకు తెలీనే తెలీదే!"

"అవును మామయ్యా! మా స్కూల్లో చెప్పారు - పుస్తకాల్లో కూడా రాశారు"

"అలా అయితే మనకి ancestor కోతి కదా - మనింట్లో ఓ కోతి ఫోటో కూడా పెట్టుకోవాలేమో కదా?!"

"హహ్హహా ...  హహ్హహా"

"నవ్వొచ్చేస్తోందా నీకు ? భలే. మరిది చెప్పు - మనం కోతి నుంచి పుడితే మరి తోకేమయ్యింది?"

"డెవలప్ అయ్యాం కదా, మామయ్యా! అందుకే తోక పోయింది"

" డెవలప్ అయితే తోక బో... ల్డంత పొడుగవ్వాలి - కానీ -  మాయమై పోతుందేంటి?"

"డెవలప్ అంటే ఛేంజ్ మామయ్యా! అందుకే మరి తోక తగ్గిపోయి తగ్గిపోయి మాయమై పోయింది"

"ఓహో - డెవలప్ అంటే ఛేంజా - ఇది కూడా తెలీదురా నాకు - నీకు చాలా విషయాలు తెలుసే! ఇంతకీ నువ్వు మీ అమ్మకి చెప్పావా నువ్వు కోతికి పుట్టావని?"

"హహ్హహా ...  హహ్హహా"

"అవునూ - కోతి నుంచి పుట్టాం అని చెప్పావు కదా - అందుకేనేమో ఒక్కోసారి మనం చేసే అల్లరి చూసి తే "కోతి వేషాలు వెయ్యకు" అని కోప్పడతారు - కదా ?"

"అవును మామయ్యా! కానీ అలా తిట్టేవాళ్ళు కూడా కోతులే కదా - ఎందుకంటే కోతులే కోతులతో మాట్లాడగలవు కదా?! అందరం కోతుల్లోంచే వచ్చాము కదా?!

"మంచి డౌటేరోయ్! నాకు తట్టనే లేదు - అందుకేనేమో కదా -  మనం గోడలెక్కి ఆడుకుంటామూ, చెట్లెక్కుతామూ"

"అవును - మామయ్యా!"

"అవున్రా - నువ్వెప్పుడైనా చెట్లెక్కావా? నీకు చెట్లెక్కడం వచ్చా?"

"లేదు మామయ్యా "

"నాకూ చెట్లెక్కడం రాదురోయ్ - నీపోలికే వచ్చినట్టుంది నాకు - కానీ... మీ అత్త చెట్లెక్కేది తెలుసా?!"

అప్పుడెప్పుడో - సెలవులకి వచ్చినప్పుడు - లేపాక్షి గుడిలో - చెంగుమని చెట్టెక్కిన అత్తరూపు కళ్ళ ముందు వెలిగి - బుజ్జి-బాబు నోట పెటేల్మన్న నవ్వు - బెద్ద-మామయ్య పక్కనే నించుని కోతి-కబుర్లు విటున్న అత్త పెదవుల మీద పకాల్మంది. ఎండాకాలపు పగటిలో పండు వెన్నెలయ్యింది.


19, జులై 2017, బుధవారం

త్వామనురజామి - 15 - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట!

కిందటి 19 చెప్పిన కబుర్లు

దసరా ... అంటే ఎలాంటి పండగ?

మహా సరదా పండగ - పది రోజులకు పైగా సెలవులు పప్పి, కుట్టిలకి, నాకు - పైగా లక్ష్మి దొడ్డ,  ప్రశాంతి వస్తారు. వీలైతే బాబూ వస్తాడు - చిన్న శ్రీను ఇక్కడే వున్నాడు.

వీటన్నిటికీ తోడు ప్రతి దసరాకి - వారం రోజుల ముందునుంచీ ఇల్లు దులపడం, కడగడం -  తెల్ల నామురాయి నీళ్ళల్లో తడిపి - ఆ తడి నాముతో ఇల్లంతా నా చేత మా అమ్మ వేయించే ముగ్గులు -  మా అమ్మ  - ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులతో, మాష్టారితో కలిసి ఇంటింటికి వెళ్ళి - "ఏదయా! మీ దయా మామీద లేదు - ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు - అయ్యవారికి చాలు ఐదు వరహాలు - పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు" - అంటూ ఎలా పాడేవారో చెప్తూ ఇష్టంగా గుర్తు చేసుకునే పాటలు - దుర్గాష్టమి రోజు అమ్మవారు యుద్ధం చేసి అలసిపోయి ఉగ్రంగా ఉంటుందని - మహర్నవమి రోజుకి మాష చక్రాలు, ఆవడలు చేయాలని - కథలు చెప్తూ - ఆవిడ చెప్పే కథలకి మావైన అర్థాలు తీసుకుని అమ్మని ఉడికిస్తూ మేం ముగ్గురం మాలో మేమే నవ్వుకునే అల్లరి కబుర్లు, నవ్వులు - ఇల్లు మహా సందడిగా ఉండేది.

ఈ సందడికి తోడు కొత్త బట్టల హడావిడి. నేను హాస్టల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికే అమ్మ డ్రెస్ మెటీరియల్ కొని ఉంచేది. నాకు గుర్తుండి - నా MCA అయ్యేవరకూ ప్రతి పండక్కీ మా ముగ్గురికీ ఒకే రంగు బట్టలు ఉండేవి. పప్పి, కుట్టి ఇంట్లోనే ఉండేవారు కాబట్టి వాళ్ళ డ్రెస్సులు పండక్కి ఒక వారం ముందుగానే తయారైపోయేవి - కుట్టించుకోవడం, చున్నీలు జిగ్-జాగ్ చేయించుకోవడం. నావి మరి - నేనింటికి వచ్చి నాకెలా కావాలో చెప్పేదాకా అమ్మ కుట్టించేది కాదు - అందుకని పండగ ముందు రోజు వరకూ టైలర్ చుట్టూ తిరగడం నాకు అలవాటే.

ఆ తిరగడంలో నాకు బోల్డంత ఉక్రోషం వచ్చేసేది - ఒక్కోసారి అసలు టైంకి ఇస్తారో ఇవ్వరో అని టెన్షనూ వచ్చేది .  ఈ దసరాకలాగే అయ్యింది. ఎప్పుడూ కుట్టే ఆస్థాన-టైలర్ నాగేశ్వర్రావు దగ్గర మిషన్ ఏదో రిపేర్ ఉందని నావి కుట్టననేశాడు. సరే - ఇంకేం చేయాలో తెలీక అప్పుడే 18 అడ్డరోడ్డులో మా ఇంటికి ఎదురుగుండా రోడ్డులో కొత్తగా పెట్టిన టైలర్ షాప్‌లో ఇచ్చి వచ్చాను - చుడీదార్ కుట్టి ఇవ్వమని. అష్టమి సాయంత్రం దాకా ఇవ్వనే లేదు.

ఎక్కెడికి వెళ్లినా , అదెంత చిన్నపని అయినా మా ముగ్గురికీ కలిసి వెళ్ళడం అలవాటు కాబట్టి - నవమి పొద్దున్నే తొమ్మిదింటికి ముగ్గురం టైలర్ దగ్గరికి వెళ్ళాం.

నేను షాప్ ముందు ఉన్న రెండు మెట్లు ఎక్కి "నా డ్రెస్ కుట్టడం అయిందా?" అనడిగితే - తలొంచుకుని ఎవరిదో పరికిణీ కుడుతున్న అతను తల కూడా ఎత్తకుండా లేదన్నట్టు తలూపాడు.

"ఇంకెప్పుడిస్తారండి? ఇలా అయితే ముందే చెప్పి ఉండచ్చు కదా - కుదరదని. ఇలా ఆలస్యం చేస్తే ఎలా?" - కోపమో దుఃఖమో - మాటలు గబగబా వచ్చేస్తున్నాయి.

పక్కనే తన-మార్కు చిరునవ్వుతో పప్పి, నవ్వితే నేనేడుస్తానేమో అన్నట్టు - బుగ్గల్లో నవ్వు దాచుకుని పగలబోతున్న బుడగలా కుట్టి - ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుంటున్నారు.

అప్పటికీ ఆ టైలరతను తల తిప్పలేదు - పాపం - అతనికి అప్పటికే చాలా కుట్టాల్సినవి వున్నాయి - పైగా ఎదురుగా నా దబాయింపు ఒకటి.

అంతే - ఇంక కోపం పట్టలేక - "సరే అయితే! - మీరిప్పుడు కుట్టిచ్చినా నేను తీసుకోను - మీరే ఉంచుకోండి" అని పరిగెట్టుకుంటూ - వెనక నుంచి  పప్పి, కుట్టి పిలుస్తున్నా ఆగకుండా ఇంటికొచ్చేసి - చేతికందిన పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టాను. నాక్కోపం వస్తే మాట్లాడకుండా పుస్తకాలు చదివేసేదాన్ని - అలా అయితే వాళ్ళ కేసి చూడడం, మాట్లాడడం ఎవాయిడ్ చెయ్యొచ్చు కదా!

ఓ రెండు పేజీలు చదివానో లేదో - వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చారు -వస్తూనే కుట్టి అడిగింది - "అదేం కోపమే లల్లెమ్మా! డ్రెస్సు కుట్టడం లేట్ అయిందని వాళ్ళనే ఉంచేసుకోమంటే ఎవరికే నష్టం?" - అంటూ.

ఆ మాట విన్న మా అమ్మ  - నాకొచ్చే ఏ బాధకైనా, కోపానికైనా ఆవిడ పెట్టే లింకు నా భోజనానికే - ఎప్పట్లాగే "అందుకే కడుపునిండా తినాలి - అప్పుడైతే మాట్లాడడానికి ఓపిక ఉంటుంది - ఆ విసుగు తగ్గుతుంది" - అంటూ - ఇంకా ఏదో అనబోతూ ఉంటే  - పప్పి అమ్మ మాట మధ్యలోనే అందుకుని  "తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్" - అంటూ ఆవిడ స్టాక్-డైలాగ్‌ని పూర్తి చేసేలోగా - "ఆ...  కండ కలవాడేను మనిషోయ్ - (మొక్కజొన్న) కండెలు నమిలెడిది లల్లోయ్!" - అంటూ దానికింకో రాగయుక్తపు-పొడిగింపు కలిపింది కుట్టి.

ఇలా పొంతన లేకుండా ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే - ఎప్పుడొచ్చారో నాన్న - వెనకనుంచి "అలా ఎక్కువ నవ్వితే మీ నోళ్ళు చెవులదాకా సాగిపోతాయి - ఎప్పుడో ఇలాగే" అని అన్నారో లేదో - అంతగా సాగిపోతే మేమెలా ఉంటామో ఊహించుకుని ఇంకొంచెం ఎక్కువ నవ్వుకున్నాం మా అమ్మాయీ-త్రయం.

మొత్తానికి ఆ రోజు సాయంత్రం పప్పి, కుట్టి నేను లేకుండా వెళ్ళి టైలర్ దగ్గర్నుంచి నా డ్రెస్ తీసుకొచ్చారు. నా కొత్తబట్టల కథ సుఖాంతం.

సరదా సరదాగా దసరా అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఉంటుందో - ఇంటి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు అంతే బెంగగా ఉంటుంది.

మళ్ళీ అందరూ వచ్చి ట్రెయిన్ ఎక్కించారు - మా అమ్మ ఎప్పట్లాగే Higginbotham's లో CSR, Tinkle, Wisdom - ఇలాంటి పుస్తకాలన్నీ కొనుక్కొచ్చి నాకిచ్చింది. ఎప్పట్లాగే నేనున్న ట్రెయిన్ కదిలి నేనింక కనిపించను అనేదాకా చేతులూపుతూ నించుని - సెండాఫ్‌ ఇవ్వటానికి వచ్చిన ఇంటిల్లిపాదీ ఇంటికెళ్ళిపోయారు.

ఈసారి నాతోపాటు శ్రీలత కూడా ఉండడంతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ఎప్పటికన్నా హుషారుగానే సాగింది.

మళ్ళీ back-to-pavilion. థర్డ్ సెమిస్టర్ కదా - పైగా సత్యం సర్ టీచ్ చేసే OB నాకు తెగ నచ్చేసేది - సబ్జెక్ట్, దాంతో పాటు ఆయన టీచ్ చేసే పధ్ధతి.

ఒక కవిత కూడా రాసుకున్నాను అప్పుడు - అదొక bookmark గా తయారుచేసుకున్నాను కూడా.
Whenever i think of Behavioural Science
My mind will be full of  **Robbins, Davis, Luthans
Who were introduced by you
They give me utmost joy too
As long as the clouds trail on the hills
I will be coming to your class
With Pleasure - but not with pressure

(** Stephen Robbins, Ketih Davis, Fred Luthans are the authors who wrote the Organizational Behaviour text books)

ఇవే కాకుండా సత్యం సర్ క్లాస్ నచ్చడానికి ఇంకో కారణం కూడా ఉంది - ఆయన క్లాస్ అయిపోగానే నెక్స్ట్ క్లాస్ మొదలయేలోగా ఒక పదినిముషాలు టైం ఉంటుంది కదా - అప్పుడు మా CC (కంప్యూటర్ సెంటర్) ముందున్న మావిడిచెట్టు కాయలు కర్రతో కొట్టి కోసి ఇచ్చేవారు - మా మధ్యాహ్నపు స్నాక్ అవి - డైనింగ్ హాల్ నుంచి తెచ్చుకున్న ఉప్పుతో కలిపి.

ముందు సెమిస్టెర్స్ కన్నా ఈసారి నా క్లాస్‌మేట్స్‌తో కూడా ఎక్కువగా కలిసి క్లాసెస్‌కి  వెళ్ళడం, వాళ్ళ రూముల్లోకి వెళ్ళి కొంచెం సేపు కూర్చుని రావడం మొదలుపెట్టాను.

103-సి లో ఉషశ్రీ, అపర్ణ, ప్రగతి, మాధవీలత - 502-బి లో నిగమ, నిరుపమ, మల్లిక -  506-బి లో పద్మప్రియ, సునీత; 501-ఏ లో అమృతవల్లి, ఉషారాణి, 201-బి లో అన్నపూర్ణ, సోనియా - వీళ్ళని వారానికి ఒక్కసారైనా వెళ్ళి మాట్లాడి వచ్చేదాన్ని.

రోజూ సాయంత్రం ఏడింటికో ఎప్పుడో హాస్టల్ మేట్రన్స్ హాజరు తీసుకునేవాళ్ళు - అమ్మాయిలందరూ హాస్టల్ బయటకి వెళ్లి ఎటెండెన్స్ వేయించుకుని రావాలి.

నేను ఆ ఎటెండెన్స్, డిన్నర్ అయిపోయాక - షిప్లీని పట్టుకుని - కళ్యాణి బ్లాకులో నా రూమ్ నుంచి - రెండు బ్లాకులని లోపలనుంచి కనెక్ట్ చేసే డైనింగు హాల్ ముందు నించి - కిన్నెరలో వున్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని.

రాత్రి డైనింగ్ హాల్ మూసేశాక అక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చుని చదువుకుంటూ ఉండేవారు.

నేను ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పో, పాటలు పాడో - రాత్రి పదకొండింటికి నా రూంకి వెళ్ళే టైంకి వాళ్ళింకా చదువుకుంటూనే వుండేవాళ్ళు. కాకపొతే సగం నిద్రావస్థలో వుండేవాళ్ళేమో - ఆ రాత్రిపూట జడ సరిగ్గా వేసుకోవడం రాక వదిలేసిన జుట్టుతో, చేతిలో షిప్లీతో వచ్చే నన్ను చూసి - ఉలిక్కిపడి - వాళ్ళ వీపులు వాళ్ళే - థూ థూ - అని కొట్టుకుని - నన్నొక్కసారి గట్టిగా విసుక్కునేవాళ్ళు - ఆ జడేసుకోవచ్చు కదా - జడుసుకుని చస్తున్నాం - అంటూ. అందులోనూ అమ్మ ఏరికోరి కుట్టించిన బాంబే డైయింగ్ - తెల్ల పువ్వుల నైటీలు వేసుకునే దాన్ని. వాళ్ళలా అనగానే - హహ్హహ్హ- అని నవ్వి పరిగెట్టేదాన్ని. దెబ్బకి రూముల్లోకి వెళ్ళిపొయ్యేవాళ్ళు.


మొత్తానికి రోజులు భలే పరిగెడుతున్నాయి.


నా సీనియర్స్ శ్రీలత, సంగీత, గుత్తి పద్మజ, పద్మజవల్లి - వాళ్ళు అప్పటికే ఫోర్త్ సెమిస్టర్.

(వాళ్ళు మామూలుగా అయితే ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండాలి - కానీ మా కన్నా ఒక సెమిస్టరే ఎక్కువ - ఒక పూర్తి సెమిస్టర్ టైం లాస్ అయిందని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు.)

వాళ్ళు నలుగురూ కలిసి బాలాజీ కాలనీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్‌లో Unix / Shell Scripts & C నేర్చుకుందామని చేరారు. వాళ్ళతో పాటే నేనూను - ముందు ముందు పనికొస్తుంది కదా అని.

సంగీత హైద్రాబాదునుంచి తన TVS 50 తెచ్చుకుంది - ఎక్కడికైనా వెళ్ళడానికి ఉంటుందని. ఈ Unix క్లాసెస్‌కి వెళ్ళేటప్పుడు నన్ను తన వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళేది.

సాయంత్రం కాగానే - వారానికి ఎన్ని రోజులు వెళ్ళేవాళ్ళమో గుర్తు లేదు కానీ వెళ్ళిన ప్రతి రోజూ ఆ యూనివర్సిటీ ఎవెన్యూ రోడ్డులో  - జుయ్ జుయ్ మంటూ - వెళ్ళిన ఆ TVS రైడ్స్ తెగ ఎంజాయ్ చేశాను నేను.

నవంబర్ మొదటివారంలో ఫోన్ చేసినప్పుడు నాన్న చెప్పారు శ్రీనన్న బెంగుళూరునుంచి తిరుపతి వస్తున్నట్లు. ఈలోగా శ్రీనన్న దగ్గర్నుంచి కూడా ఉత్తరం - తను నవంబర్ థర్డ్ వీక్‌లో తిరుపతి వచ్చి - ఒకవేళ నాకు గనక కుదిరితే తనతో పాటు కడపలో ఉన్న సుందరి పిన్ని వాళ్ళింటికి తీసుకుని వెళ్తానని.

నాకింక బోల్డంత ఆనందం - శ్రీనన్న వస్తున్నాడని. శ్రీనన్నతో కబుర్లు చెప్తూ ఉండడం నాకు చాలా ఇష్టం. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా తను వస్తున్నాడంటే ఆ రోజు కాలేజ్ మానేసేదాన్ని.

నా క్లాస్‌మేట్ అమృతవల్లిది కూడా కడప - తను చేసే smocking work నైటీల మీద, డ్రెస్సుల మీద చాలా బావుండేది. తను ఎంత స్టూడియస్సో - అంతే జోవియల్ & స్టైలిష్.

తనకి నేను కడప వెళ్తున్నానని చెప్పగానే - తను కూడా చాలా సరదా పడింది - ఎందుకంటే ఆ వారం తను కూడా ఇంటికి వెళ్తున్నాను అని - నన్ను వాళ్ళింటికి రమ్మని కూడా చెప్పింది.

వెంటనే గబగబా వాళ్ళింటికి డైరెక్షన్స్ అడిగి నోట్ చేసేసుకున్నాను. నాకు సుందరి పిన్ని వాళ్ళ ఇంటి ఎడ్రెస్ తెలీదు కాబట్టి ఈ ఊరుకైనా ల్యాండ్-మార్క్ బస్టాండ్ కదా - అందుకని అక్కణ్ణించి దారి  చెప్పమన్నాను.

బస్టాండ్ దగ్గర నుంచి అమృతవల్లి చెప్పిన ల్యాండ్-మార్క్స్: అప్సర థియేటర్, టీటీడీ చౌల్ట్రీ, అన్నమాచార్య విగ్రహం, దేవి స్టూడియో - ఆ స్టూడియోకి ఇవతల వాళ్ళిల్లు.

నాకింక భలే ఎక్సయిటెడ్‌గా అనిపించింది - కడప ప్రయాణానికి రోజులు లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టాను.

శ్రీనన్న హాస్టల్‌కి శుక్రవారం సాయంత్రం వచ్చాడు - శ్రీలత, సంగీత, పద్మజ, పద్మజవల్లిలకి తనని పరిచయం చేశాను -  తను కాసేపు మాతో కబుర్లు చెప్పి - రేప్పొద్దున్న కడపకి వెళ్తున్నాము రెడీగా వుండు అని నాతో చెప్పి తను హాటల్‌కి వెళ్ళాడు. తనటు వెళ్ళగానే - అంతవరకూ మాట్లాడిన మా సీనియర్ పద్మజవల్లి - He is so informative - అనగానే నాకు భలే గొప్పగా అనిపించింది - మా శ్రీను కదా - అందుకని.

మరుసటిరోజు బయల్దేరి కడపలో సుందరి పిన్ని ఇంటికి వెళ్ళాము. మమ్మల్ని చూడగానే సుందరి పిన్ని తెగ సంబరపడ్డారు. శనివారం సాయంత్రం శ్రీనన్న ఇంట్లో పిల్లలందరినీ - అంటే చైతన్య, సౌజన్య లతో పాటు నన్ను - తీసుకుని ఆమీర్ ఖాన్ - దిల్ - సినిమాకి తీసుకెళ్ళాడు .

ఆదివారం పొద్దున్న పదింటికి ఎడ్రెస్ వెతుక్కుంటూ అమృతవల్లి వాళ్ళింటికి వెళ్ళాము - నేను, శ్రీనన్న. అక్కడ ఒక అరగంట కూర్చుని - అమృతవల్లిని, వాళ్ళ అమ్మగారిని పలకరించి - మళ్ళీ ఇంటికి వచ్చేశాం. నాకు ఆరోజు అమృతవల్లి వాళ్ళ ఇంట్లో షోకేసులో ఉన్న చిన్న-చిన్న ఇత్తడి సామాను, ఇంకా బోల్డన్ని బొమ్మలు - బోల్డు నచ్చేశాయి - ముఖ్యంగా ఆ ఇత్తడి సామాను చూడగానే మా నాన్నమ్మ నాకిచ్చిన చిన్న ఇత్తడి డేగిసాలు, గోకర్ణాలు, నేతి జాలీలు గుర్తుకొచ్చాయి. కాకపోతే నా దగ్గరున్నవి ఎక్కడో పోగొట్టుకున్నాను - అప్పటికే.


ఆ తర్వాత రోజు - సోమవారం - కాకపోతే సుందరిపిన్ని ఉండిపొమ్మన్నారని - ఒక్కరోజు కాలేజ్ పొతే పర్వాలేదని ఆదివారం సాయంత్రం కాకుండా సోమవారం పొద్దున్న బయల్దేరి వచ్చి నన్ను హాస్టల్ దగ్గర దింపేసి శ్రీనన్న బెంగళూరు వెళ్ళిపోయాడు.

మళ్ళీ - కథ మామూలే!

పొద్దున్న - కాలేజ్‌లో క్లాసులు -
సాయంత్రం - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట! - అంటూ ఆడుతూ పాడుతూ రోజులు సాగుతూ...
నేనిక్కడ ఆగుతూ ...
మీరీలోగా ఆ టైటిల్ పొడుపు-పాట విప్పుతూ
దాంతో పాటు ఈ కొసరు పాట పని పట్టుతూ...

క్లాసు లేదని...  డోంటీచు మాకని  
మాటినీ ఉందని ... మమ్ము నేడు వెళ్లనీ 
ఓ సారూ ... నో  హాజరూ !

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

16, జులై 2017, ఆదివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం


పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా - బదరి నన్ను అమెరికా's సెంటర్ దగ్గర దింపి - లోపలికి వెళ్ళి ఎవరైనా వున్నారో లేదో నేను చూసి - తనకి కాల్ చేశాక వెళ్తానని - బయటే కార్లో కూర్చుని వున్నారు.

ఇంతకీ బదరి బెంగేంటంటే ...

రోజూ విడవక తిరిగే తెలిసిన దారుల -
పూబాలల, పుప్పొడుల జాడల - అడుగులు కదిపి
కాళ్ళ వెంట నడిచి - నడకల నాపు పిల్లుల - జతగా నడుస్తూ
కాలి అలికిడికి దడిచి - పరుగాపని ఉడతల - వడిగా కలుస్తూ
ఏ దారి వెళ్తున్నానో మైమరచి  -
నా దారిని మరిచి -
దొరికిన దారే "గో"దారని -
ఏ దారిన పడితే ఆ దారే నా దారని
ఏదో ఒక దారిన ఇంటికి చేరడమే నాకున్న దారని
తిరిగే తన నిజదార -
నైజం తెలిసిన బదరి - అలా వెయిట్ చేయడంలో వున్న దారి - తన జవాబుదారి తప్ప మరేం కాదు :)

లోపలికి వెళ్ళగానే - అక్కడ కూర్చున్న సెక్యూరిటీ లేడీకి గుడ్‌మార్నింగ్ చెప్పి - అలా చూశానో లేదో - లోపల అప్పటికే మెరిసిపోతున్న చీరలు, రకరకాల డ్రెస్సుల్లో హడావిడిగా మెయిన్ స్టేజ్ వైపు వెళ్తున్న అమ్మలు, అమ్మాయిలు కనిపించారు.

వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి - బయట కార్లోంచి లోపలికి చూస్తున్న బదరికి - "పర్వాలేదు- నేనొక్కదాన్నే కాదు - ఇంకా లోపల చాలా మంది వున్నారు - మీరు ఇంటికి వెళ్ళొచ్చు" - అని చెప్పి తను వెళ్ళగానే - లోపలి వెళ్ళాను.

లోపల అందరూ బ్రేక్‌ఫాస్ట్‌రూం వైపుగా వెళ్తున్నారు.

ఎదురుగుండా చిన్నారి దేవాంశి - వాళ్ళమ్మ అంజలి కనిపించి - హాయ్ చెప్పారు. అంతకు కొన్నిరోజుల ముందు Tae-Kwon-Do టోర్నమెంట్‌లో - నాలుగేళ్ళ బుల్లిపాప - దేవాంశి - అమెరికన్ నేషనల్ Anthem - భలే పాడింది. అదే ఇంకోసారి గుర్తు చేసుకుని - చెప్పి - అంజలికి పుత్రికోత్సాహము కలిగించాను.

అప్పుడే అంజలి చేతిలో కాఫీ చూసి - నేనూ ఒక కప్ తెచ్చుకుందామని బ్రేక్‌ఫాస్ట్‌రూం వైపు కదిలాను. కానీ అక్కడున్న క్యూ చూసి - వద్దులే - అనేసుకుని - మళ్ళీ వచ్చి ఈరోజు తానా-సాహిత్య కార్యక్రమాల్లో మొదటిదైన అష్టావధానం జరగబోయే ఫెర్రార థియేటర్ ముందున్న కుర్చీల్లో ఒక దాంట్లో కూర్చున్నాను.

ఇంతలో - మా లిటరరీ కమిటీ మెంబర్ - సుధాకర్ - ఫెర్రార థియేటర్ లోపలనుంచి బయటికి వస్తూ కనిపించారు. తనని చూడగానే - నేనూ థియేటర్ లోపలికి వెళ్ళాను.

అక్కడ అమృతరెడ్డి-సుగుణ -గార్లు కనిపించగానే - నిన్నటి రోజు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు-సాయం చేసిన సుగుణగారికి డబ్బులు ఇస్తూ - దాంతోపాటు అమృతరెడ్డిగారికి - భరాగో కథలు పుస్తకం ఇస్తూ - మీరిచ్చిన అప్పుకి నా వడ్డీ అండీ - అనగానే - సుగుణ గారేమో - "మీరిలా పుస్తకాలు ఇస్తారనుకుంటే అసలు డబ్బులు ఇచ్చేదాన్నే కాదు" అనీ -  అమృతరెడ్డిగారేమో "మీరిలా పుస్తకాలు ఇస్తారంటే మీకు రోజూ డబ్బులు అప్పిస్తాను" అనిన్నీ - మొత్తానికి రోజులో మొదటి నవ్వులు పూయించారు. అప్పుడే అమృతరెడ్డిగారు నేనెప్పటినుంచో చదువుదామనుకుంటున్న కాళీపట్నం రామారావుగారి కథలు - పుస్తకం నా చేతికందించారు - చదివి ఇవ్వండి అంటూ.

ఆ పక్కనే కొత్తపాళీ-నారాయణస్వామిగారు కనిపించారు. ఆయన నన్ను చూడగానే - దగ్గరికి వచ్చి - "అమ్మా! నిన్న మీరు పలకరించినప్పుడు మాట్లాడలేకపోయాను. నేను మీకు తెలుసన్నారు? ఎలా తెలుసు" - అనడిగారు. "మీ బ్లాగ్ చదివేదాన్నండి - మిమ్మల్ని ఇలా కలవడం ఆనందంగా వుంది" - అని చెప్తూ - ఆయనతో పరిచయ వాక్యాలు అయ్యాక - ఏవో బ్లాగుల విశేషాలు, నిడదవోలు మాలతిగారి బ్లాగులు, అనువాదాలు, అవీ మాట్లాడుతూ ఉంటే - ఇంతలో స.వెం. రమేష్‌గారు వచ్చి - అసలు అష్టావధానం అంటే ఏంటి అనడగ్గానే - నారాయణస్వామిగారు ఆయనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అవధానం ఎలా మార్పులు చెందింది - అసలు అష్టావధానంలో ఏమేమి అంశాలు ఉంటాయి - అనే విశేషాలు ఒక ఐదారు నిముషాలు చక్కగా వివరించారు.

అది వింటూ నిల్చుని ఉన్న నన్ను - ఆ పక్కగా కూర్చుని వున్న సదా-రమ దంపతులు వారి దగ్గరికి రమ్మని పిలిచారు. వెళ్ళిన నన్ను - పేరు, ఊరు - అడిగి - "మీ తెలుగు ఎంత బావుందోనండి - అసలు మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటే భలే ముచ్చటగా అనిపించింది - పైగా మీ పేరు మాకెంతో ఇష్టమైన గాయని శ్రీలలిత పేరు. మేము మెంఫిస్‌లో ఉంటాం - మా ఊళ్ళో మంచి గుడి ఉంది. మా ఇంటికొచ్చేయండి - మీకు చూపిస్తాం. వచ్చేముందు ఒక్కసారి కాల్ చేయండి చాలు" - అని అప్పటిదాకా ముక్కు-మొహం తెలియని నన్ను అంత ఇష్టంగా పలకరించి అభిమానంగా మాట్లాడుతూ - తాము తెచ్చుకున్న పాల-టీ పాలు పంచి ఇచ్చిన - నా వాక్కు మెచ్చిన - ఆ దంపతులని చూడగానే - ఒక్క నిముషం - అవాక్కయ్యాను.

వారి పక్కనే కూర్చుని అవధానం చూద్దామని రమగారి పక్కనే కూర్చున్నాను.

ఇంతలో నారాయణస్వామిగారు వచ్చి - అమ్మ! మీరు అవధానంలో పాల్గొనగలరా ?" అనడిగారు.

"పాల్గొనడం మాట అటుంచి - నేనింతవరకు - ఒక్క అవధానం కూడా పూర్తిగా చూడలేదు" - అని చెప్పాను.

"ఫర్వాలేదు - మీరు చేయగలరు - సమస్యకి పృచ్ఛకులు కావాలి - ఇదిగో సమస్య నేనిస్తాను మీకు - ఇందులో మొదటిది యుక్తంగా ఉంటుంది - అదే ఇవ్వండి" అంటూ ఒక చిన్న కాగితం నాచేతికిచ్చారు.





 అది పట్టుకుని - నా చేతిలో వున్న పుస్తకాల సంచీని - సదా-రమ-గార్ల దగ్గర వదిలి -

యమాతారాజభానసలగం 
భ ర న భ భ ర వ 
న జ భ జ జ జ ర 
మ స జ స త త గ 
స భ ర న మ య వ -

అని ఎప్పుడో పదోతరగతిలో వదిలేసిన ఛందస్సు పాఠాలు గుర్తు తెచ్చుకుంటూ - వేదిక మీదికి వెళ్ళాను.

వేదిక మీద - అష్టావధానం చేయబోతున్న నరాల రామారెడ్డిగారు, సంధానకర్త రామారాజభూషణుడు గారితో పాటు - నాతో కలిపి వేదిక మీద ఉన్న ఎనిమిది మంది పృఛ్ఛకులు ఎవరంటే:



నిషిద్ధాక్షరి: జువ్వాది రమణగారు
**సమస్య: నేను 
దత్తపది: గాజులపల్లి రామచంద్రారెడ్డిగారు
వర్ణన: కుప్పా విజయశ్రీగారు
న్యస్తాక్షరి: మద్దుకూరి విజయచంద్రహాస్‌గారు
ఆశువు: బండ్ల హనుమయ్యగారు
ప్రబంధపఠనం: దిట్టకవి సుందర్‌గారు
అప్రస్తుతప్రసంగం: కొత్తపాళీ-నారాయణస్వామిగారు

[**లలిత ఉవాచ: భలే - కుదిరింది - సమస్య నేనే అవడం ;) -  ఆఫీస్‌లో Harry ఆత్మీయంగా నాకు ప్రసాదించిన బిరుదు:  Trouble - Lalitha! The T in your name stands for Trouble - అంటూ. దానికి కారణం ఏంటంటే - బోల్డంత మాట్లాడేసుకుని, వాదించేసుకుని - హమ్మయ్య - అన్నిరకాలుగా ఆలోచించేశాం - Let's finalize this design - అని అందరూ ఊపిరి తీసుకోబోయే సమయంలో - Oh wait! This is all good - but I see an issue...- అంటూ అప్పటివరకూ కనిపించని ఇంకేదో సమస్యని బయటికి తెస్తానని - "అబ్బా! ఇలాంటివన్నీ నీకే ఎందుకు కనబడతాయి - ఎలాగైనా - ట్రబుల్‌వే కానీ మామంచి ట్రబుల్‌వి" - అంటుంటారు నన్ను. అసలు సమస్యా పూరణంకి మొదట అనుకున్నది ఆలూరి సురేంద్ర కుమార్‌గారిని - కానీ తానొకటి తలిచిన - తానా ఒకటి తలిచిందని - సమస్యాపూరణం కాదు - అక్కడ సమస్యే అవ్వాలంటే నేను తప్ప ఇంకెవ్వరు నాకు పోటీ? :) ]

వేదికకి అటు నలుగురు, ఇటు నలుగురుగా - పృచ్ఛకుల కోసం వేసిన కుర్చీల్లో కూర్చున్నామో - లేదో - అప్పుడు గుర్తుకొచ్చింది - నా ఫోన్ పుస్తకాలసంచీలో పెట్టేశానని - కనీసం అది ఉంటే అయినా - అంతకుముందే  సేవ్ చేసుకున్న నారాయణస్వామిగారి నంబరుకి టెక్స్ట్ చేసి - నా సందేహాలు తీర్చుకోగలిగేదాన్ని కదా - అని తెగ బెంగ పడిపోయాను.

ఇంతలో - ఆయనకే ఏదో అనుమానం వచ్చినట్టుంది - నా దగ్గరికి వచ్చి - వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా - అన్న చంపకమాల పద్య-పాదంలో అన్ని జ-గణాలూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి - అన్నీ సరిగ్గానే వున్నాయి అని చెప్పి వెళ్ళారు.

నేను కూడా - మనసులో లెక్కలేసేసుకుని - పోన్లే! అన్ని గణాలూ బానే వున్నాయి - ఏదో ఈ ఒక్క లైనూ చెప్పేస్తే నా అవధాన-అవస్థ తీరిపోతుంది అనుకున్నాను.

ఇంతలో నా పక్కన కూర్చున్న జువ్వాది రమణగారు - నా దగ్గరున్న సమస్య చూసి - "అవధానిగారు ఇదెలా పూర్తి చేస్తారో చూడాలి. ఒకవేళ ఆయన చెప్పలేకపోతే మీరు పూరించాల్సి ఉంటుంది" అన్నారు.

అంతే ! ఆ మాటతో నరాల రామారెడ్డిగారి అష్టావధానం - నా పాలిట కష్టావధానం కాబోతోందని అర్థమైపోయింది నాకు.

చేసేదేముంది - కష్టమో, క్లిష్టమో - మొట్టమొదటి అష్టావధానం - పార్టిసిపేటేద్దాం - అనేసుకునేశాను.

వేదిక మీద అందరి పృచ్ఛకుల పరిచయాలు మొదలయ్యాయి.

నా వంతు వచ్చేసరికి - "నా పేరు లలిత - తెలుగు ఇష్టం - తెలుగులో పుస్తకాలు చదువుతాను - అంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేదు"- లాంటి మాటలేవో చెప్పి ఊరుకున్నాను.

ఒక మాట: మిగిలిన తానా-పోస్టులకి , ఈ అవధానం పోస్టులకి ఒక తేడా వుంది. మిగిలినవన్నీ - విన్నవి గుర్తు పెట్టుకుని రాస్తే - ఈ అవధానం పోస్టులు మాత్రం మా సాహిత్య కమిటీ సభ్యులు - కూచి శాస్త్రిగారు - రికార్డ్ చేసిన వీడియో ఆడియోని చెవిలో-ఇయర్‌బడ్స్ పెట్టుకుని రాశాను. 

వీడియో ఇలా మొదలవుతుంది (వీడియో యూట్యూబ్ లింక్ ఈ అవధానం పోస్టుల చివర ఇస్తాను - ఓపిక పట్టండి ప్లీజ్!)


అందరికన్నా చివరిగా వచ్చిన మద్దుకూరి విజయచంద్రహాస్‌గారు తన ఆలస్యానికి క్షమాపణలు చెప్తుండగా వీడియో మొదలవుతుంది.

 చంద్రహాస్‌గారికి ఇది మూడో అవధానం - ఇంతకుముందు మేడసాని మోహన్‌గారు, గరికిపాటి నరసింహారావుగారు చేసిన అవధానంలో పాల్గొన్నారట.

సంధానకర్త రామరాజభూషణుడుగారు అప్పటికే కాలాతీతమయింది - మరింత జాగు చేయకుండా కార్యక్రమం మొదలుపెడదామని చెప్పి - అవధానిగారిని సభకి పరిచయం చేశారు:
శ్రీ నరాల రామారెడ్డిగారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు. పదహారో ఏటనుంచి అవధానం మొదలుపెట్టారు. వెయ్యికి పైగా అవధానాలు దేశ విదేశాల్లో దిగ్విజయంగా సాధించారు. వారు చేసిన రచనలు - గాథాత్రిశతి, కర్ణభారతం, అవధానకవిత మొదలైనవి. మీ మనసుల్ని తుమ్మెదల్లాగా ఈ  కవితా ధారని గ్రోలడానికి విహరింపజేయండి - అంటూ శ్రీ నరాల రామారెడ్డిగారిని అవధానం ప్రారంభించమని కోరారు.

నరాల రామారెడ్డిగారి ఉపోద్ఘాతం:

నలభై వసంతాలు పూర్తిచేసుకుని ఇరవై ఒకటవ మహాసభగా రూపుదిద్దుకున్న ఈ తానా మహాసభలకు ఆత్మీయంగా, ఆప్యాయంగా ఆహ్వానించిన తానా అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరిగారికి, కన్వీనరుగారికి, కార్యవర్గసభ్యులకు అందరికీ నా హార్దికాభినందనలు. 1992లో మొదటిసారిగా ఆటా ఆహ్వానం మీద న్యూయార్క్ నగరంలో అష్టావధానం చేశాను. ఆ తర్వాత ఆటా వారు పిలవగా మూడుసార్లు, నాట్స్ వారు పిలవగా మూడుసార్లు గత 20, 25 సంవత్సరాలుగా అమెరికా వచ్చి అవధానం, అవధానం మీద ఉపన్యాసాలు  చేశాను. ఈ 21వ తానా మహాసభలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

అవధానానికి ముందుఉపోద్ఘాతంగా నాలుగైదు పద్యాలు చెప్పడం సంప్రదాయం. దానికి కారణం - సాహిత్యవాతావరణంలోకి ప్రేక్షకులని తీసుకుపోవడం. అందుకని సంక్షిప్తంగా నా అవధానం గురించి నాలుగైదు విషయాలు చెప్తాను.

కవితా ఆవాహనం:

ఒక తరుణ తరంగం సంచలిస్తే
ఒక కిరణ కురంగం సంచరిస్తే
ఒక వనవల్లిక పల్లవిస్తే
ఒక నవచంద్రిక పల్కరిస్తే
ఒక ప్రశాంత కాసారజలం కదలివస్తే
ఒక నిశాంత నీహారకణం నిలిచి చూస్తే
ఒక రాగమాలిక రవళిస్తే
ఒక మేఘబాలిక దిగివస్తే
అదే అదే నా కవితారూపం
అదే అదే నా హృదయ దీపం
అదే అదే నా విజయచాపం

తెలుగు భాషలో ఉండే అందమైన పదాలను పరిచయం చేయడం కోసం ఛందస్సులేని ఒక చిన్న వచన కవితలాగా చెప్పాను.

అవధానమన్నప్పుడు పద్యకవితలోనే సాగుతుంది. ఇప్పుడు పద్యం లోకి ప్రవేశిస్తాను.

ఏ తల్లి వర్ణింప కవీంద్రుల కలములు కదలివచ్చు
ఏ తల్లి కీర్తి గానింప గాయక కంఠముల రాగములు దేలి పొరలిపోవు
ఏ తల్లి రూపు చిత్రింపగ చిత్రకారుల చేతికుంచెలు తలలనూచు
ఏ తల్లి మూర్తి నిర్మింప శిల్పుల చీని ఉలులెల్ల నిలువెల్ల జలదరించు
ఆమె ... పారిజాత మనోజ్ఞ భూవిజాతజాత సుజాత ప్రపూత నేత్ర
భారతీ దేవి!  జ్ఞాన పుష్పష్పాలతావి! 
నాట్యమాడును గాక నా నాల్కపైన!

ఉపోద్ఘాతం ఇలా చెప్పిన సభలో ఈ "నాట్యమాడును గాక నా నాల్కపైన " అన్నమాట విన్న తర్వాత ఓ పృచ్ఛకుడు వర్ణనలో అడిగాడు - ఎక్కడో బ్రహ్మలోకంలో బ్రహ్మ సన్నిధానంలో ఉన్న సరస్వతిని మీరు ఆహ్వానించి మీ నాలుక మీద నిలుపుకున్నారు. సరస్వతి ఇప్పుడు మీ నాలుక మీద వుంది కదా ! మీరు బ్రహ్మదేవునికి సరస్వతీవియోగం కలిగించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఓ పద్యం చెప్పండి - అన్నాడు.

అప్పుడు ఓ ప్రార్థనగా - క్షమాపణ చెప్తూ - ప్రాయశ్చిత్తంగా చెప్పిన పద్యం

జననీ! నాథుని నాలుగు వక్త్రములలో సంచారమున్ జేసి
జీవనమాధుర్యము గ్రోలు నిన్నిచటి కాహ్వానించి
నీ ప్రాణనాథునకున్ నీకెడబాటు చేసితిని
నా దోషమ్ము మన్నించి  మోహనభావములు కల్గు పద్యములు నాకందించవె భారతీ!
- అని పూజాపుష్పమును సమర్పించి అవధానమును ప్రారంభించాను.

నాట్యమాడునుగాక నా నాల్కపైన

ప్రత్యూష పవనాంకురములు సోకినయంత రింగున యెగురు తరంగమట్లు
శ్యామల శాద్వల సార కేదారాల చెంగున ఎగురు కురంగమట్లు
పూల మొక్కలవంటి పాలరెక్కలు సాచి హాల్లీసకించు విహంగమట్లు
తోకచుక్క విధాన తోయదాంగన వీధి తారాడి ఆడు పతంగమట్లు

ఒక  తరంగమట్లు - ఒక కురంగమట్లు - ఒక విహంగమట్లు - ఒక పతంగమట్లు

కల్పతరుపుష్పకల్పిత తల్పమసృణకల్పనాకల్పశిల్పసంకల్పగరిమ
(  కొత్తపాళీ - నారాయణస్వామిగారి - బలె!బలె! - ఇక్కడ భలేగా వినిపిస్తుంది )

ఈ మొత్తం సమాసానికి కవిత్వం మెత్తగా ఉండాలని - అంతే - మృదులంగా ఉండాలి - మధురంగా ఉండాలి

కల్పతరు పుష్ప కల్పిత  తల్పమసృణ కల్పనాకల్ప శిల్ప సంకల్ప గరిమ
పలుకు పలుకున తేనెలు చిలుకరించి
కదలి వచ్చునుగాక నా కవనకన్య
నా కవనమ్ములో నిలుచు
నాకవనమ్మున పూయు

నా కవనం - నాక వనం (కొత్తపాళీ - నారాయణస్వామిగారి - బలె!బలె! - ఇంకోసారి)

[లలిత ఉవాచ: ఇక్కడ నాకు వేటూరిగారి ఎన్నో పాటలు గురుకొచ్చాయి - ముఖ్యంగా - కురుక్షేత్రం సినిమాలో - సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో వచ్చిన - మ్రోగింది కళ్యాణ వీణా - అనే పాటలో కల వరించి, కలవరించి పులకిత తనులత నిను చేరుకోగా అన్న వాక్యం]

కల్పకాలోక పుష్పగుచ్ఛముల నూత్న సుగంధము
దివ్య వాహినీ శీకర సిక్త రక్త సరసీజ మరందము
ఆమ్ర శాఖికా కోకిల గానమున్ నవ యువ చకోర మయూర విలాస నాట్యముల్
నాకవనమ్ములో నిలుచు
నాలో పూచిన పూల భావనలు - పెన్నా వాహినీ ...

ఇప్పుడు మా పెన్నలో నీళ్ళు లేవు కాబట్టి - దురదృష్టం - పెన్న ఎండిపోయింది -  మా కడుపు మండిపోయింది - పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం గారిది - మీ అందరికీ తెలుసు -  నీళ్ళున్న గంగ చెప్పుకుందాం -

నాలో పూచిన పూల భావనలు
గంగా వాహినీ  మోహినీ లీలా ఖేల భయత్పతంగములు
నారీ స్నిగ్ధ గండస్థలీ క్రీలావణ్య వయత్పురంగములు
మల్లీ వల్లికా హేలా షట్పద రాగ భృంగములో నర్తించున్ సభా వేదికల్
సాహిత్యామృత దివ్య నిర్ఝరుల్లో స్నానంబు గావించి
జ్యోత్స్నాహాసమ్ముల పూర్ణిమా నిశలలో సౌందర్యమున్ జూచి
కాంతా హల్లీసక రాగ భంగిమలలో తారుణ్యమున్ జూచి
నా ఊహా కీరము సాగు గావుత వసంతోద్యాన వీధీస్థలి

ఇప్పటికే ఉపోద్ఘాతం మరీ ఎక్కువ కాకుండా - పృచ్ఛకుల గురించి, పండితులను గురించి సభలో అందరికీ ఒక నివాళి అర్పించి - మళ్ళీ అవధానంలోకి ప్రవేశిద్దాం.

ప్రతిభావంతులు సాహితీ గగన భాస్వంతుల్
సుధావాహినీ ప్రతిభస్వాంతుల్  నిష్కళంక కరుణా స్వచ్ఛ స్రవంతుల్
వినిర్జిత దిగ్దంతులు సత్కవిత్వ రచనా చింతుల్
సభావేదికాగత ధీమంతులు -పండితోత్తములకు కైమోడ్పు కైసేసెదన్

సరే - ఈ సంక్షిప్తమైన ఉపోద్ఘాతము తరువాత - అధ్యక్షులు రామరాజభూషణుడుగారని చెప్పారు - ఆరోజు రామారాయల సభకు భూషణంగా ఉన్నవాడు భట్టుమూర్తి రామరాజభూషణుడు - ఈరోజు రామారెడ్డి అవధానసభకు భూషణంగా కూర్చున్నవాడు ఈ రామరాజభూషణుడు.

వారు చెప్పినట్లుగా నేను 1965వ సంవత్సరంలో తిరుపతిలో ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివేటప్పుడే అవధానం చేయడం ప్రారంభించాను. కొన్ని వందల అవధానాలు చేయడం మీ అందరికీ తెలుసు. ఎన్నో విభిన్నమైనటువంటి రకరకాల అంశాల్లో మమ్మల్ని పరీక్ష చేశారు - చాలా బాధలు పెట్టారు. ఇబ్బందులు పెట్టారు. 

అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా - ఆ సమస్య లేక దత్తపది - అవి రెండూ చమత్కారానికి ప్రతీకలు.

న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. వర్ణన, ఆశువు - కవితా పరీక్ష.

అప్రస్తుతప్రసంగము, తరవాత గంటలుంటే గంటలు - లేకపోతే ప్రబంధ పఠనం - ఏకాగ్రతకు పరీక్ష.

ఇలాగ రకరకాల పరీక్షల్లో - రకరకాల పృచ్ఛకులను మేము ఎదుర్కొంటుంటాము.

పృచ్ఛకులు సమస్య కానీ దత్తపది కానీ ఇచ్చేటప్పుడు విరుద్ధార్థం బాగా స్పష్టంగా ఉండాలి . అప్పుడే సమస్యాపూరణం కూడా అందంగా ఉంటుంది.

అలాగే దత్తపదులు కూడా ఆ భావాలకు ఒదిగేటట్లుగా పదాలు ఇవ్వాలి.

కొంతమంది ఏదో నాలుగు పదాలు ఇవ్వొచ్చు కదా అని - నోటికొచ్చిన నాలుగు ఊళ్ళ పేర్లో - నాలుగు వస్తువుల పేర్లో ఇచ్చి చెప్పమంటారు.

అవి ఒదుగుతాయా లేదా అన్నది విచారణ చేయరు.

కొందరిస్తారు - సమస్య - ఇప్పుడే సరస్వతీచతుర్ముఖులకు వియోగం అన్నాను కదా - ఆ పద్యం ఒకటి చెబుతాను.

ముక్కంటి నలువ చెలువకు ముద్దులు పెట్టెన్

ముక్కంటి - ఈశ్వరుడు - నలువ చెలువ - సరస్వతికి ముద్దులు పెట్టెన్ - ఇది విరుద్ధార్థం - ఇది పూరణ చేయమన్నారు.

బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. మనం కంప్యూటర్లో మునిగిపోయినట్లుగా ఆయన కూడా సృష్టిలో మునిగిపోయాడు. పాపం - సరస్వతీదేవికి ఏవిధమైన ఎంజాయ్మెంట్ లేదు. ఓ షాపింగ్ గానీ, ఓ సినిమాకు పోవడం గానీ - దేనికీ లేదు. ఆమెకు చాలా కోపమొచ్చింది.

ఇలా అంటున్నది:

క్కడి సృష్టిది నాపై
మక్కువ చూపవని వాణి మౌనము పూనన్ ...మూతి ముడుచుకుని అలిగింది
చెక్కిలి నిమురుచూ చిలిపిగ
ముక్కంటి (ముక్కు అంటి ) నలువ (బ్రహ్మ) ... చెలువకు ముద్దులు పెట్టెన్.

అక్కడ ముక్కంటి అనేచోట విరుపులో మెరుపు పుట్టించడమే సమస్యాపూరణం.

ఆ సమస్యలో క్లూ దాచిపెట్టాలి పృచ్ఛకుడు.

ఒక్కొక్కసారి ఏమీ ఉండదు - వేగ్గా (vague గా) ఉంటుంది - మనం దాన్నిఒక సన్నివేశం కల్పించుకుని చెప్పాల్సి వస్తుంది.

అలా చిన్న చిన్న సమస్యలు చెప్పాం - చాలా కష్టమైన సమస్యలూ పూర్తిచేశాం.

ఈ తానా తెలుగుపలుకులో కూడా అవధానంలో సమయస్ఫూర్తి అనే వ్యాసంలో కొన్ని సమస్యలు, దత్తపదులు ఇచ్చాను.

ఆ క్లూ కనుక్కోవడమే చాలా కష్టమన్నమాట.

ఓసారి ఓ సమస్య - కులటం గూడి వసించె రాఘవుడహో కూర్ముల్ పిసాలింపగన్

శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు - అంటువంటి మహానుభావుడు - ఒక కులటను గూడి - వేశ్యను కూడి హాయిగా కోర్కెలు తీర్చుకుని ఆనందిస్తున్నాడని సమస్య.

చాలా విరుద్ధార్థం  కదూ! దాన్ని పూరణ చేయమన్నారు.

అక్కడ ఎక్కడ విరుపులో మెరుపు పుట్టించాలా అని ఆలోచించా.

సరే! రామలక్ష్మణులు అరణ్యవాసం వెళ్ళారు  - సీతతో పాటు. నదీతీరంలో పర్ణశాల కట్టుకున్నారు - అప్పుడు సందర్భం ఒకటి ఇస్తున్నా -

కలతన్ జెందక తండ్రి మాట నిలుపన్ కష్టంబునన్  సైచి కా
నల లోలన్ పదునాలుగేండ్లు గడపన్ సౌమిత్రితో సీతతో
చెలువొప్పారగ పర్ణశాల రచియించెన్ హాయిగూర్పన్ కొలం
గులటం గూడి వసించె రాఘవుడహో కూర్ముల్ పిసాలింపగన్

(హాయి కూర్పన్ - కొలంకులు అటన్ - కొలనులు కొలంకులు అవుతుంది - అంటే లేక్ వ్యూ అన్నమాట).

అలాగే దత్తపదులు ఇచ్చేటప్పుడు కూడా - ఎన్నోరకాల దత్తపదులు చేశాను.

ఇటీవలనే - మే 13వ తేదీ అనుకుంటా - ఆంధ్రజ్యోతిలో వనం జ్వాలానరసింహారావుగారు ఒక వ్యాసం రాశారు - తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంలో కెసిఆర్ ఆదేశాన్ననుసరించి చేస్తున్నామని ఒక వ్యాసం రాశారు.

(ఆ వ్యాసం ఇక్కడ చదువుకోవచ్చు: http://www.andhrajyothy.com/artical?SID=410742)

అందులో 1975 ప్రాంతం నుంచి జరిగిన మహాసభల గురించి అనేక విషయాలు చెప్పుతూ - ప్రత్యేకంగా చెప్పవలసినది ఒకటున్నది - ఎగ్జిబిషన్ గ్రౌండులో పట్టుమని పాతికేళ్ళు నిండని నరాల రామారెడ్డి అవధానం చూశాను - అప్పుడో పృచ్ఛకుడు నాలుగు పదాలిచ్చాడు. ఆ నాలుగు పదాలు - బీరు, బ్రాందీ, విస్కీ, రమ్. ఈ నాలుగు పదాలు తీసుకుని - మధువుల పేర్లు - వధువు మీద - ఒక అందమైన అమ్మాయి మీద పద్యం చెప్పమన్నాడు.

అప్పుడు నాకు గుర్తున్న పద్యం అంటూ జ్యోతిలో ఆ పద్యాన్ని ఉదాహరించారు.

ఆ పద్యం ఏంటంటే... 

అతివా! గుండెల బీరువా తెరచి నీకర్పించు కుంటిన్ గదా!
అతుల ప్రేమ మనోజ్ఞ రత్నమట న భ్రాంధీ కృత శ్యామలా
న్విత మౌ నీ కచ సీమ వెల్గు హృదయా విష్కీర్ణ సౌందర్యమై
రతివో రంభవొ రాధికా రమణివో రావే జగజ్జిన్నుతిన్

(నా గుండెల బీరువా తెరచి ప్రేమ అనే మనోజ్ఞ రత్నం - అంటే డైమండ్ నీకర్పించుకున్నాను -  అదెక్కడవెలుగు? నీ అభ్ర+అంధీకృత - అంటే నీలిమేఘాల్లాగ చీకటైపోయిన - అంటే కురులు అంత నల్లగా వున్నాయి - అభ్రాంధీ కృత శ్యామలా న్విత మౌ నీ కచ సీమ వెల్గు - అంటే శిరోమణిలాగా వెలుగు.
హృదయా విష్కీర్ణ - హృదయ + ఆవిష్కీర్ణ  - ఆవిష్కృత వుంది కానీ - ఆవిష్కీర్ణ  కల్పించాం - విస్కీ కోసం
రంభవొ - రం ; జగజ్జిన్నుతిన్ - జిన్ను కూడా కలిపాం)

నే ఇలా చెప్తే - ఆ పృచ్ఛకుడన్నాడు - ఏమండీ - నేను బ్రాందీ అని ఇస్తే - మీరు బ్రాంధీ అని ఒత్తి చెప్తున్నారు - ఏంటి - అని.

అప్పుడు నేనన్నాను - సెకండ్ రౌండు కదండీ కొంచెం కిక్కెక్కింది - అని.

ఇలా పద్యం చాలా అందంగావచ్చింది.

ఇలాగే ఇంగ్లీషు పదాలిస్తారు - తెలుగు పదాలిస్తారు - రకరకాల పదాలిస్తారు. టీవీల పేర్లిస్తారు - సినిమా యాక్టర్ల పేర్లిస్తారు - ఎన్నో వెరైటీస్ వున్నాయి . 

అవన్నీ చెప్పడం సాధ్యం కాదు కానీ - జగ్గయ్య గారి అధ్యక్షతన 1975లో తిరుత్తణిలో అవధానం చేసినప్పుడు - నాకు నచ్చిన దత్తపది ఇంగ్లీషు పదాలిచ్చారు - రాకెట్లు, జాకెట్లు, పాకెట్లు, లాకెట్లు.

ఇవి శార్దూలంలో నాలుగు పాదాల్లో మొదటొచ్చేటట్లుగా అందమైన అమ్మాయిని వర్ణించమన్నారు.

అమ్మాయి రాకెట్లా ఉందని, జాకెట్టు అందమైందని చెప్పకూడదు. ఆ పదాలకి ఆ అర్థాలుండకూడదు.

అప్పుడు నేను చెప్పిన పద్యం - మళ్ళీ అమ్మాయిని ఊహించుకుంటూ భావకవిత ...

రాకెట్లుండునో నీదు రాక వలన్ రాకా శరద్రాత్రి రో
జాకెట్లుండును నీకపోల సుషమా సౌందర్య సౌరభ్యముల్
పాకెట్లున్ననూ పూలమేడ అగు నీ పాదాలు పారాడ రే 
లాకెట్లుండును కోమలాంగి! ప్రణయాహ్లాదంబు పండింపవే

(పాకెట్లుండును - పూరి పాక ఎలా వున్ననూ
రోజా కెట్లుండును - గులాబీ పువ్వుకెలా ఉంటుంది - నీ చెక్కిళ్ళ సౌందర్యం
రేలాకెట్లుండును - రేలు + ఆకెట్లుండును - రేయికి అడ్డం ఎట్లుండును)

ఒక్కోసారి చాలా కష్టమైన పదాలిస్తారు. బళ్లారిలో అవధానం చేస్తున్నపుడు - ఓ దత్తపది ఇచ్చారు- చికెన్, మటన్, పోర్క్, బీఫ్ - వీటితో విశ్వామిత్ర తపోభంగం వర్ణించమని.

విశాఖపట్నంలో ఒక మితృడిచ్చాడు 1985లో - వూరబంది, కోడిపెట్ట, జెల్లచేప, కప్ప  - ఇన్ నాలుగు మాటలతో బ్రాహ్మణుల పెళ్ళి భోజనాన్ని వర్ణించమని.

ఊర బందిరి  వేసి నోరూరునట్లు
వేడి వేడిగ మంచి పకోడి పెట్ట
ఇంపు నింపు పాయసం మోజెల్ల చేప
చెప్పలేని రుచులు మా కప్పగించె

అంతకుముందు నెల్లూరులో రామారావుగారు విశ్వామిత్ర తీస్తుండగా - క్రౌన్, ఒనీడ, వీడియోకాన్, బుష్ - టీవీల పేర్లతో ఒక పద్యం చెప్పా :

ఔరా! మేనక వక్ర మార్గమున శక్రౌన్నత్యమున్ గోరి
స్వర్గ వనీడాంబికశోభ దేహమున పొంగన్ నాట్యమున్ జేసె
పల్లవచిత్తుండై భ్రాంతి చెందె తపమెల్లన్ వీడి యో కాంతా
నా సమిధన్ బుష్కళ సౌఖ్యమిమ్మనుచు విశ్వామిత్రుడర్థించెన్

అదో పధ్ధతి. కానీ చికెన్, మటన్, పోర్క్, బీఫ్ - పదాలతో కష్టం - వాటిని తెలుగు, సంస్కృత పదాలుగా మలచుకోవాలి. దానికిలా చెప్పాను:

రతి రాగమ్ములు వీచికెందలుకులూరన్ నేత్ర  పోణంబులన్
వ్రత భంగమ్ము నేమటంచు ప్రణయ వ్యామోహ లీలాత్ముడై
కుతుకంబొప్పఁగా గాది సూనుడు తపోర్కుండౌరా చిత్తంబునన్
ధృతి క్షీణింపగా ధారపోసె తపంబీ ఫుల్ల పద్మాక్షికి

ఇలా ఎన్నో దత్తపదులు - చెరకును గానుగలో వేసి తిప్పినట్లుగా - అందమైన పద్యాలను రాబట్టారు.

ఇవీ నా అవధాన ప్రస్థానంలో కొన్ని అంశాలు.

తానాలో మొట్టమొదటి అవధానం చేస్తున్నాను కాబట్టి తానా సభ్యుల కోసం నాలుగు పద్యాలిప్పుడు జ్ఞాపకం చేశాను.

ఇప్పుడు అవధాన రంగంలో ప్రవేశించుదాం.

---------------------------------------------------------------------------------------------------------------------

మరొక్కమాట: 
ఎక్కడైనా పై పద్యాల్లో - గణ, యతి, పాద, ప్రాస, అక్షర, శబ్ద - సంబంధిత తప్పులుంటే - అవి నా తెలుగు-తక్కువ-తనం, వినికిడి-దోషమే కానీ మరేమీ కాదు - మన్నించేయండి.
 
అసలెప్పుడూ అష్టావధానం పూర్తిగా చూసి వుండని నేను - నేను చూసిన, పాల్గొన్న మొట్టమొదటి అవధానాన్ని - ఒక యూట్యూబ్ లింక్ పెట్టేసి వదిలేయడానికి మనసొప్పక - ఉన్నది ఉన్నట్లుగా, కన్నది కన్నట్లుగా, విన్నది విన్నట్లుగా - అక్కడక్కడ - వీడియోకి సౌలభ్యమైనా - రాతకి అనువుగాని పునరుక్తి లేకుండా - ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తున్నాను.

అసలు అవధానము తదుపరి పోస్టులో...


8, జులై 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - అసలు కబుర్లు



ఇంతకు ముందు జరిగినదేమిటో తెలియాలంటే ఈ కొసరు కబుర్లు చదవాల్సిందే మరి: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు


వేదిక మీద చేరిన అతిథులని పరిచయం చేస్తూ - మద్దుకూరి చంద్రహాస్‌గారు చర్చా కార్యక్రమం ప్ర-జ (ప్రశ్న-జవాబు) పద్ధతిలో ఉంటుందనిన్నీ, కార్యక్రమాన్ని నడిపించేవారు ప్రశ్నాతూణీరం మ్యూజికాలజిస్ట్ రాజాగారనిన్నీ చెప్పి - రాజాగారి గురించి చెప్పిన కొన్ని పరిచయ వాక్యాలు:

రాజాగారు ఆపాతమధురాలు అనే శీర్షికన పత్రికల్లో పాటలు, వాటి రాగాల గురించి బోల్డన్ని విశేషాలు రాస్తారట. అదే పేరుతొ ఒక పుస్తకం కూడా ప్రచురించారట. రాజాగారిని వి. ఏ. కె. రంగారావుగారి వారసులు అంటారట అందరూ - ఆయనలాగే పాటలు గురించి మాటలు ఇష్టంగా రాస్తారని. ఇంకా - రాజాగారు హాసం అనే పత్రికకి సంపాదకులు కూడానట.

<<<లలిత ఉవాచ: ఆపాతమధురాలు అన్న మాట వినగానే నాకు మంచి మంచి పాత పాటలుండే రాజిగారి ఆపాత మధురాలు బ్లాగ్ గుర్తొచ్చింది.>>>

తర్వాత సీతారామశాస్త్రిగారు, క్రిష్‌గారు - ఇద్దరూ - ఒకరి తర్వాత ఒకరుగా తమ గురించి చిరు-చిరు పరిచయవాక్యాలు మాట్లాడారు.  

మైకు రాజాగారి చేతికి వచ్చింది.

రాజాగారప్పుడేమన్నారంటే:

"జగమెరిగిన సీతారామశాస్త్రిగారిని సగమెరిగిన నేనడిగే ప్రశ్నలు మొదలు పెడతాను.

మొదటి ప్రశ్న: మీ సాహిత్య మథనం వెనక కథ వినాలని వుంది. మీరు రాసే పాటలు యువతకి స్ఫూర్తి కలిగించేలా universal అప్పీల్ తో ఉంటాయి.

ఉదాహరణకి -


కన్నీరై కురవాలా?
మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరాలా?
నిను చుడాలంటే అద్దం జడిసేలా.
(సినిమా: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

అలాగే ముగ్గురు గొప్పవాళ్ళు ఒకే విషయాన్ని వారి వారి దృక్పథం నుంచి వ్యక్తం చేసిన తీరులో వున్న సామ్యం  ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆత్రేయగారు జయభేరి సినిమాలో సామాన్యుడికి అందుబాటులో లేనిది కళే కాదని చెప్పిస్తారు కథానాయకుడితో. 

క్రిష్‌గారు తన సినిమాలో అది కళ - ఇది కల అనిపిస్తారు. 

<<<లలిత ఉవాచ: ఏం సినిమానో అది - నేను గమ్యం, వేదం తప్ప క్రిష్ సినిమాలు ఏవీ పూర్తిగా చూడలేదు>>>

సీతారామశాస్త్రిగారేమో


ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం 
(సినిమా: రుద్రవీణ -  తరలి రాదా తనే వసంతం పాటలో) - 
అంటారు.


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా 
(సినిమా: పట్టుదల )

ఈ పాట వింటే ఎంతైనా నేర్చుకోవచ్చు - అసలిలాంటి పాటలు సైకియాట్రిస్ట్ అవసరం రాకుండా చేస్తాయి.

పాటలని అంత విహంగవీక్షణంతో రాయగలగడం మీకెలా సాధ్యపడింది?  - అని అడుగుతూ మైకుని సీతారామశాస్త్రిగారికి అందించారు.

సీతారామశాస్త్రిగారు - సభకి నమస్కారం చేసి : 

"రాజాగారు  మీరడిగిన ప్రశ్న - సముద్రమంత సబ్జెక్టు. మూడు పురిషెళ్ళలో పట్టాలంటే అగస్త్యుడి శరీరానికి ఇక్కడ చాలా మందే వున్నా - శక్తికి చాలం. అయినా ప్రయత్నిస్తాను. 

సినీకవి - నేతిబీరకాయ పోలిక నాకు చాలా చికాకు కలిగిస్తుంది.

సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం
ఏక మాపాత మధురం అన్యదాలోచనామృతం

సాహిత్యం ఆలోచనామృతం - సంగీతం ఆపాత మధురం. రెంటినీ విడివిడిగా ఊహించలేం.

<<<లలిత ఉవాచ: ఇక్కడ నాకు స్వాతికిరణం సినిమాలో వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే అన్న పాటలో -  ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ... ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము అన్న లైన్లు గుర్తుకొచ్చాయి.>>>

సాహిత్యానిది విస్తృత పరిధి - కథ, వచనం, వ్యాసం, నాటకం, నాటిక, గల్పిక, కవిత. కవితకి మళ్ళీ చాలా విశేషణాలు చేరాయి - స్త్రీ వాద, దళిత, వచన - ఇత్యాది.

వీటన్నిటితో ఎదిగిన వికాసం కళ.

నేను మొదట్లో RSS మెంబర్‌ని. విశ్వనాథ్‌గారి సిరివెన్నెల సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను. 

ఆ సినిమా తర్వాత కలిసిన దర్శకులు, నిర్మాతలు విధాత తలపున - లాంటి డ్యూయెట్ రాయమనేవారు. 

పొదల్లో దొర్లే సన్నివేశాలకి "నీ రాజసానికి నీరాజనం" లాంటి పాటలు రాశాను. 

భయపడి మారు మాట లేకుండా "పాట బావుందండి" అని ఓ దండం పెట్టేవారు - మళ్ళీ కనిపించేవారు కాదు.

ఓ నిర్మాత ఏదో ఒక సినిమాలో చెప్పిన సన్నివేశానికి "ఓ బాబూ - నీ మమతల కోవెల కూలే" అనే పాటేదో రాశాను. 

27 సంవత్సరాలు నా మొహం చూడలేదు. 

తర్వాత అదే పాటని "ఓ బాబూ - నువ్వు జైలుకి వెళ్ళిపోయావు" అని తిప్పి రాయించుకున్నట్టు తెలిసింది.

వేటూరిగారికి, నాకు సినిమా తెరే వేదిక - పుస్తకాలు రాసి అచ్చు వేయించుకునే వీలు లేదు -  అందుకే మా పాటల్లో కవిత్వం ఉంటుంది. మిగిలిన సినీకవులు - ఆత్రేయగారిని మినహాయించి - "నా సరి నీవు, నీ గురి నేను , నీ మీద ఆ నాకు ప్రేమ - నాకు నువ్వే భామ" ఇలాంటి సాదా సీదా పాటలు రాశారు తప్పితే కవిత్వం ఉండదు ఆ పాటల్లో .

<<<లలిత ఉవాచ: ఇది వినగానే నాకు చెయ్యెత్తి - ఒక ఐదు నిముషాలు మాట్లాడే అవకాశం అడిగి - ముందుగా కవులుగా ప్రసిద్ధి చెంది అందమైన పాటలు రాసి మెప్పించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని, సముద్రాల వారిని, పింగళి గారిని, దేవులపల్లి వారిని, శ్రీశ్రీ గారిని, దాశరథిగారిని, సినారె గారిని, జాలాది గారిని - ఇంకా నేను ఇక్కడ లిస్ట్ చేయకపోయినా - ఎందరో అద్భుతమైన కవితా-హృదయమున్న పాటలు రాసిన ఎందరో సినీకవులని - గుర్తు చేద్దామా అనిపించి - మళ్ళీ నాకు నేనే - అంతవసరమా - అనేసుకుని  - నోరు గా...ఠిగా మూసుకుని కూర్చున్నాను. నా వరకు నాకు - ఎవరి గొప్ప వారు చెప్పుకున్నంతసేపు పర్వాలేదనిపిస్తుంది - ఎదుటి వారి ప్రసక్తి తెచ్చి పోల్చుకోనంతసేపు. >>>

సినిమా పాటకి ఓ భాషుంది.  నేను ఇతిహాద్ విమానంలో వచ్చాను. అందులో ఎయిర్ హోస్టెస్ వచ్చి "ఖ్ ఖ్ ఖ్ ... ఖ్ ఖ్ ఖ్ " అంటే బెల్ట్ పెట్టుకోమని ఆవిడ భావం.

నా పాటలు విని వాటి భావంతో resonate అయ్యేవారున్నారు - దాన్నే స్ఫూర్తి అంటున్నారు.

సిరివెన్నెల సినిమా తర్వాత రుద్రవీణ దాకా నాకు మంచి పాటలు రాసే అవకాశం రాలేదు. ఆ మధ్యకాలంలో నాకు దక్కినవి - ఓ నమస్కారం, తాంబూలం.

సినీపరిశ్రమ ఎవరికీ రెండో చాన్సు ఇవ్వదు. నాకు మాత్రం పదిహేను అవకాశాలు ఇచ్చింది. ఒకసారి ఇలాగే - ఎందుకు నన్నందరూ ఇలా పాటలు ఒక సినిమాకి మించి పాటలు రాయించుకోవట్లేదు? - అని ఆలోచించి ఒక పదిహేను సినిమాల కాసెట్లు కొనుక్కుని (వేరేవాళ్ళవి) విని సినిమా పాట రాయడం నేర్చుకున్నాను. 

లేడీస్ టైలర్ సినిమాలో చూడకూడని చోట - ఉండకూడని మచ్చ. దాని గురించి పాట రాయాలి.

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క -

అనే పాటలో - శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా - అంటూ శ్రీదేవి, వాణి, పశుపతిరాణిని గురించి రాసిన నన్ను ఒప్పిన దర్శక నిర్మాతలకి నా నమస్కారం.

- అంటూ తన పాటల-ప్రస్థానం గురించి ఎన్నో విశేషాలు చెప్తూ సీతారామశాస్త్రిగారు క్రిష్ గురించి కూడా కొన్ని కబుర్లు చెప్పారు.

"సినిమా ప్రపంచంలో సాధారణంగా సినిమా తీయడం మొదలు పెట్టాక ఆగడం అరుదు. ఆగదు. ఈ క్రిష్ గమ్యం తీసే టైములో ఎనిమిది నెలలు ఆపాడు. తెలిసిన కుర్రాడు - నాకప్పజెప్పారని సలహాలు ఇచ్చేవాణ్ణి - వినేవాడు - విన్నట్టు నటించేవాడని గమ్యం మొదటిసారి చూసినప్పుడు తెలిసింది.

గమ్యం చూడగానే చెప్పాను - క్రిష్ ! ఇప్పటికే నేను నీ సినిమాకి behind-the-scenes దర్శకుణ్ణి అంటున్నారందరూ. కానీ అసలేం జరిగిందో ఈ గదిలో వున్న నాకు తెలుసు, నీకు తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు - Go after your dream! గమ్యం డైరెక్టుగా రిలీజ్ చెయ్యి అని చెప్పాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు."

- అని గమ్యం సినిమా గురించి మాట్లాడిన తర్వాత

"సినిమా నాకొక పోస్టుబాక్సు లాంటిది. అందులో నా పాటలనే ఉత్తరాలు వేస్తుంటాను. అవి అందుకున్నవాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అర్థం చేసుకుంటారు"

- అంటూ తననడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ముగించారు.


ఈలోగా క్రిష్ అందుకుని - మైకందుకుని...

"మనసులోని నీవైన భావాలే - బయట కనిపిస్తాయి దృశ్యాలై. నాకు సినిమా అలాంటి ఒక మీడియం.

గంధం నాగరాజు, బుర్రా సాయిమాధవ్, వాసిరెడ్డి నవీన్‌గారు - ఇలాంటివారు కథని చేరవేస్తారు."

- అని తన  మొదటి సినిమా గమ్యం గురించి కొన్ని మాటలు చెప్పాక

"నన్ను క్లుప్తంగా చెప్పమన్నారు కానీ నేను మా గురువుగారికి  <<<సిరివెన్నెల గారిని చూసి నవ్వుతూ>>> శిష్యుళ్ళా  బిహేవ్ చేస్తున్నాను' అంటూ

"శాతకర్ణిలో ఎకిమీడా పాట పల్లవి చదివినప్పుడు - గురువుగారు... ఈ పాట ఎంతమందికి అర్థం అవుతుందండి - ఇంకోలా ప్రయత్నిద్దామా - అంటే నన్ను చూసి ఒక నవ్వు నవ్వారంతే. సరే - కానిమ్మని అలానే ఉంచేశాం - ఆ పాట ఈనాడు ఎంత పెద్ద హిట్టో మీకందరికీ తెలిసిందే!"

<<< లలిత ఉవాచ: మళ్ళీ ఇక్కడ నా మైండ్ కోతికొమ్మచ్చి ఆడేసింది - నిజమా - వూరికే ఆన్లైన్లో దొరికిన శాతకర్ణి సినిమా ఇదే పాట దగ్గర - అబ్బా - చాలింక - అని ఆపేసిన నా కళా-intoleance ని తల్చుకుని - నీకెలా అయినా కళాపోషణ, కలాపోశన (మహాదుష్ట సంధి, అతిమహాదుష్ట సమాసం కల+ఆపోశన - అంటే వేరేవాళ్ళ కలలని నా కళ్ళతో అలాగే చూడగలగడం) తగ్గి కళా-క్రోశం ఎక్కువైపోయింది - అని నన్ను నేనే హన్నా! - అనేసుకున్నాను. >>>

సినిమా మొదలుపెట్టాక గురువుగారు చుట్టుపక్కల అన్నీ మర్చిపోయి తనలో తనే మునిగిపోతారు." అంటూ సీతారామశాస్త్రిగారి గురించి చా ...లా అభిమానంతో, ఆత్మీయతతో మాట్లాడారు - ఆయన ప్రియ-శిష్య్ క్రిష్.

<<<లలిత ఉవాచ: ఇది వినగానే నాలో నేనే - Oh - perhaps he becomes a sole-soul అని అనుకుని - నా sole-soul ప్రయోగం నాకు నాకే తెగ నచ్చేసి - ఎప్పటికైనా Sole-Soul అనే ఒక Terzanelle రాయాలి అని ప్రస్తుత కార్యక్రమానికి ఒక అస్సలేమీ సంబంధం లేని గుర్తు పెట్టేసుకున్నాను. >>>

<<<ఇంకో లలిత ఉవాచ: ఇంతలో అప్పటివరకు నా పక్క కుర్చీలో కూర్చునివున్న మిణుగురులు సినిమా దర్శకుడు అయోధ్యకుమార్ లేచి - నేనింక వెళ్తానండి - వేరే పనుంది - అనగానే తలూపాను. తీరా అతనెళ్ళిపోయాక - అయ్యో ఏదో పార్టిసిపేట్ చేద్దామని వచ్చినట్టున్నారు - వసుధ అసలు రవిగారికి ఏం చెప్పిందో - పాపం ఇతనికి అసలు వేదిక మీదకి వెళ్ళే అవకాశమే రాలేదు - అని కాసేపు అనుకున్నాను కానీ - అంతకన్నా ఏం చేయలేకపోయానని ఇప్పటికీ ఏదో చిన్న బాధ.  >>>

ఎకిమీడా పాట ప్రసక్తి రాగానే మళ్ళీ మద్దుకూరి వారందించిన మైకందుకుని రాజాగారేమన్నారంటే -

"ఈ  ఎకిమీడా అన్న పదం రాజకోటరహస్యం సినిమాలో పింగళిగారు వాడారు - ఓ జ్యోతిలక్ష్మి పాటలో - మళ్ళీ ఇప్పుడు సీతారామశాస్త్రిగారు శాతకర్ణిలో రాశారు" - అని.

<<< లలిత ఉవాచ: రాజాగారు ఆ పాటేంటో చెప్పలేదు కానీ - అసలే పాటల-భైరవి-నామాంకిత-అపరాగ-పరిశోధనాసక్తను కదా - అది ఈ రోజు ఈ పోస్ట్ రాస్తూ ఆ పాటేంటబ్బా అని వెతికితే యూట్యూబులో - ఘన నాట్యము ఆడే ఎడ తూలేవో ఎకిమీడా - అంటూ జోతిర్లక్ష్మి భలేగా డాన్సాడేస్తున్న పాటొకటి కనిపించింది. >>>

రాజాగారు ఆత్రేయగారి గురించి ఆయనకి గుర్తొచ్చిన ఒక తమాషా విషయం  కూడా పంచుకున్నారు - ఎవరో ఆత్రేయగారిని అడిగారట - నాటకరంగం మా తల్లి అంటారు, సినిమారంగానికి వచ్చిన తర్వాత నాటకరంగానికి మీరేం చేశారు - అని. దానికి ఆత్రేయగారి సమాధానం - ఏం చేయను నాయనా! నాటకరంగాన్ని ప్రేమించాను - సినిమారంగాన్ని పెళ్ళాడాను. పెళ్ళాడినదాన్ని వదల్లేను - ప్రేమించిన దాన్ని మరువలేను- అంటూ.

ఇంక - రాజాగారి - రెండో ప్రశ్న - సీతారామశాస్త్రిగారికి: పాటల్లో శృంగారం గురించి మాట్లాడితే - మీరు మడి కట్టుకుని రాస్తున్నారు అంటారు - అలా ఎందుకు?

సీతారామశాస్త్రిగారి సమాధానం: 

భాష రెండు రకాలు - ప్రయివేటు, పబ్లిక్. 

సినిమా భాషా ప్రదర్శనకి ఒక వేదిక. దాంట్లో వాడేది సగటు భాష. 

ఇకపోతే శృంగారం రసరాజం. 

కావ్యం కాంతా సమ్మతం అంటారు. శృంగారం గురించి చెప్పాల్సిందే. కానీ చెప్పే పధ్ధతి మనసుకి హాయిగా ఉండాలి. బూతు మనసుకి వెగటు కలిగిస్తుంది కానీ -   చిలిపి నవ్వు మొలిపించదు. 

ఆడపిల్లని అల్లరి చేసి ఏడిపించాలి - బావుంటుంది - కానీ అది - సరదాగా - ఆ అమ్మాయి కూడా - తర్వాత నవ్వుకునేలా సాగాలి. 

నేను సినిమా రచయిత కన్నా ముందు కొడుకుని, అన్నని, భర్తని, తండ్రిని. 

గమ్యం సినిమాలో ఒక రికార్డింగ్ డాన్సుకి పాట రాయాల్సొచ్చినప్పుడు కూడా - హద్దు మీరకుండా రాసిన చింతామణి పాటలో - ఆ అమ్మాయి చేత పలికించిన మాటలివి: 

నిందలో నిజమో కానీ ఎందుకా కథలన్నీ
మందిలో దొరలే కానీ దొంగలసరెవ్వరని
గుండెలలోని గూడుపుఠాణి అడిగేదెవ్వరనీ... 

రాజాగారి మూడో ప్రశ్న:

ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా.. అటో ఇటో ఎటో వైపు..
(సినిమా: అంకురం)

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవఛ్ఛవాన్ని 
(సినిమా: గాయం )

ఇంత మంచి సాహిత్యం రాసిన మీకు జాతీయ స్థాయిలో ఎవార్డు రావట్లేదేంటి? జాతీయ స్థాయి కొలతలు ఏంటి - ఉదాహరణకి సుబ్బిరామిరెడ్డిగారి లాబీయింగ్? 

దీనికి ముందుగా క్రిష్ దగ్గర్నుంచి వచ్చింది సమాధానం - మాటలు తడబడేంత ఆవేశంతో:


ఎన్టీఆర్ గారికి భారతరత్న, గురువుగారికి జాతీయస్థాయి ఎవార్డు రాకపోవడం - జాతీయ ఎవార్డులు చేసుకున్న దౌర్భాగ్యం. 

సూర్యుడి పక్క దివిటీల్లాంటివి వీరికి జాతీయ ఎవార్డులు. 

నా మణికర్ణిక సినిమాకి మాటలు, పాటలు రాస్తున్న ప్రసూన్ జోషి - సీతారామశాస్త్రిగారి పాటల్నే ట్రాన్స్‌లేట్ చేస్తూ ఈయన తెలుగుకే పరిమితమవడం దురదృష్టకరమైన విషయం అని అన్నారు

- అంటూ మాట్లాడారు.

వెనువెంటనే మైకందిన సీతారామశాస్త్రిగారు: "గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం" అని గట్టిగా నవ్వి - ఇంకా ఇలా అన్నారు: జాతీయ స్థాయిలో గుర్తింపు కలగలేదని ఏనాడూ కించ పడలేదు. నా అభిమానుల నుంచి ఇన్ని వందల వేల జాతీయ ఎవార్డులు లభిస్తుంటే ఆ నిర్జీవమైన జాతీయ ఎవార్డ్ ఎందుకు నాకు? 

ఇక్కడికొచ్చి అందరూ పద్మశ్రీలు తెచ్చుకుంటారు. 

నేను మాత్రం పద్మశ్రీని తెచ్చుకుని ఇక్కడికి వచ్చాను - మా ఆవిడ పేరు పద్మశ్రీ. అన్నట్టు ఈరోజు - అంటే మే 28 - మా పెళ్ళిరోజు - అని చెప్పారు.

వెంటనే అందరం చప్పట్లతో వేదిక మీద కూర్చున్నసీతారామశాస్త్రిగారికి, వేదిక ముందు కూర్చున్న వారి శ్రీమతి పద్మశ్రీ గారికి వివాహవార్షికోత్సవ శుభకామనలు అందజేశాము.

రాజాగారి నాలుగో ప్రశ్న: మీర్రాసిన పాటల్లో పదాల అర్థాలు దర్శకునికి వివరించాల్సిన అవసరం వచ్చిందంటారు. ఆ సంగతేంటో చెప్తారా?

సిరివెన్నెలగారి బదులిది: 

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ (సినిమా: అష్టా చమ్మా) పాటలో -

చూశాక నిన్ను వేశాక కన్ను - అనే లైనులో వేశాక కన్ను లో అది అష్టాచమ్మా ఆటలో వేసే గవ్వ కన్ను 

అలాగే - నీ పంట పండిందె ప్రేమ - అన్న చోట - పంట పండడం అష్టా చమ్మా ఆటలో పంట పండడం. 

ఆ రెఫరెన్సెస్ అన్నీ అష్టాచమ్మా ఆటలో గవ్వల నుద్దేశించినవి. ఆ ఆట తెలియందే పాటలో వున్న పదాల సొగసు అర్థం కాదు. 

Idiom వల్ల భాష అందగిస్తుంది. తెలుగు నాకు అన్నం పెట్టింది. అనకాపల్లి నుంచి అమెరికా రప్పించింది. 

ఒకసారి ఇలాగే ఎస్పీబాలుగారిని సరదాగా సితార కోసం ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. అది తెలియగానే బాలుగారు - అమ్మో - ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి- అంటే నేనన్నాను - తొందరగా పెట్టుకోండి - ఇప్పటికే సోఫాలో బాగా జరిగిపోయింది - అని. అది వినగానే బాలుగారు పెద్దగా నవ్వేశారు. 

ఇలా చెప్తూ సీతారామశాస్త్రిగారు - అందమైన పదాలతో తాను అల్లుకున్న గాయం సినిమాలోని ఈ కింది పాటను గుర్తు చేసుకున్నారు.

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,
సుఖాన మనలేని వికాసమెందుకని,
సుమాల బలికోరే సమాజమెందుకని,
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం 
(సినిమా: గాయం) 

ఇంతలో మద్దుకూరి చంద్రహాస్‌గారు క్రిష్‌గారిని సాహిత్యంతో మీ పరిచయం గురించి చెప్పండి అని అడగ్గానే - క్రిష్‌గారు చిన్నప్పటినుంచి ఉమ్మడి కుటుంబంలో, తాతగారి దగ్గర పెరిగిన తనకి - పుస్తకాలు ఎక్కువగా చదివే అవకాశం ఇటీవలే కలుగుతోంది అని చెప్పారు. తనకి రావిశాస్త్రిగారి కథలు ఇష్టమనీ, వారి న్యాయం కథలోని వేశ్య పాత్ర తన వేదం సినిమాలో ఒక పాత్రకి స్ఫూర్తి అని కూడా చెప్పారు.

ఈలోగా సీతారామశాస్త్రిగారు అందుకుని - క్రిష్ ఎప్పుడూ అనవసర వినయాలకి పోలేదు. దర్శకుడు సినిమాని మనందరికన్నా ముందు చూసేవాడు. ఆ చూపు బాగా తెలిసినవాడు క్రిష్ - అన్నారు.

దానికి ముక్తాయింపుగా క్రిష్‌గారు అన్నది - నాకు తెలియనిది ఒక్కటే - నాకు బాగా తెలుసు అనుకోవడం.


రాజాగారి ఐదో మరియు ఆఖరి ప్రశ్న: పరభాషా గాయకులు పాడడం వల్ల ఒక్కోసారి పాట అర్థం మారిపోతోంది. ఉదాహరణకి - నా మనసాగేదెలా అని రాస్తే నా మనసా గేదెలా అని పాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?

సీతారామశాస్త్రిగారు నవ్వి: ఒకసారి ఇలాగే బాబా అణుకేంద్రం లో పనిచేసే యువ సైంటిస్టులు కొందరు - నా అభిమానులు అంటూ వచ్చి నన్నడిగారు: రికార్డింగ్ టైంలో నేను లేందే చేయకూడదని కండిషన్ పెట్టలేరా అంటూ. 

వాళ్ళనడిగాను నేను వెంటనే: మీరు నా మీద జాలి చూపిస్తున్నారా? లేకపోతే మీ తెలివితేటలు చూపిస్తున్నారా - అని. 

A song is a lyric told musically. 

రాజాధిరాజా వంశభుజబీజా - అని పాడతారు. అది వంశభూజబీజ - భూజ అంటే చెట్టు - వంశమనే చెట్టు అని అర్థం. 

గాయకులెప్పుడూ అర్థం చర్చించి పాడాలి. 

- అంటూ క్లుప్తంగా జవాబిచ్చారు - అప్పటికే సమయం మించి పోతుండడంతో - తర్వాతి కార్యక్రమానికి వేళవుతోంది మరి.

అలా మాటలతో, పాటలతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో మ్యూజికాలజిస్ట్ రాజాగారి ప్ర-జ కార్యక్రమం చాలా entertaining గా, informative గా జరిగింది - ఎంతైనా సినిమా కబుర్లు కదా!

ఇంకో విషయం - ఇంతకుముందు జరిగిన సాహిత్య ప్రసంగాలు, అష్టావధానం అయిన తర్వాత మా సాహిత్య కమిటీలోని అందరితో కలిసి ఫోటో తీయించుకున్న మా కమిటీ-చెయిర్ రవిగారు ఈ పాటల-మాటల కార్యక్రమం తర్వాత మేము లేకుండానే క్రిష్ పక్కన నిలబడి ఫోటో తీయించేసుకున్నారు - అబ్బే - అలా అని నేనేదో బాధపడిపోతున్నానని కాదు - జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే :)

కొసమెరుపుగా - మైమరపుగా - ఇదిగో సిరివెన్నెలగారు తానా-2017 లో పాడిన పాట (ఈ పాట రికార్డ్ చేసి అందించిన నాణెమైన-నానీల విజయశ్రీ గారికి బో...ల్డన్ని ధన్యవాదాలు!!!)





ముందే చెప్పానుగా - ఈ తానా-సిరీస్ ఒక మెమెంటో-టైప్ సిరీస్ అని - అందుకని ఈ "క్రిష్"పక్షపు-సిరివెన్నెల కురిసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడికెళ్ళి చదివేసుకోండి మరి: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1 

ఇంకా తానా-కబుర్లు అయిపోలేదండోయ్ - తదుపరి పోస్టుల్లో మరి కొన్ని విశేషాలు - Stay Tuned!

4, జులై 2017, మంగళవారం

మనసే జతగా పాడిందిలే - 4 - కవలపాటలు - పాడుకున్నా... పాడుకున్నా - పాట ఏదో ... పట్టుకున్నా

ఇంచుమించు ఏడాది క్రితం - ఎక్కడికో వెళ్తున్నాం.

ఎక్కడికంటే - అక్కడికి ఇక్కడికి అనేమీ లేదు - ఊరికే ...అలా అలా  - ఏ ఊరికీ కాక - మా ఊరనే మా కారులో షికారు తిరుగుతున్నాం.

మరి - కారులో ఊరికే వెళ్తామేంటి ? మాటో  పాటో  తోడుండాలి కదా!

ఆ మాటా ఈ మాటా - మాట మీద మాట - శృతి మించింది.  మరిప్పుడు రాగాన పడాలి కదా! అదీ అయింది.

రాగాన పడ్డ మాట పాటయ్యింది. నాన్న చెవికి పోటయ్యింది.

నాన్న చెయ్యి గబగబా ఐఫోన్ మీటలు నొక్కింది - ఘల్లుఘల్లున ఓ పాట మొదలయ్యింది.

మాట మీద పాట పాడుతూ - పాట మీద మాట ఆడుతూ
అవిరామంగా - ఆడుతున్న అమ్మ నోరు
మీట మీద మొదలైన - పాట చెవిన పడగానే
అనుకోకుండా - ఆట కట్టింది
కనురెప్పల మూసి - చెవులప్పగించింది
అప్పటివరకు వంకలే లేని రోడ్డున
మాటల-పాటల  గందరగోళంతోపుట్టిన
ఆందోళన-రాగానికి తాళం వేస్తున్నట్టు
దిక్కు తోచక మెలికలు తిరిగిన కారు
నిమ్మళించి - సాఫీగా పరుగులు తీసింది. 
నెమ్మదించి - తాపీగా నడకలు సాగింది

అదీ ఆనాటి సన్నివేశం. అప్పుడువిన్నదీ పాట.
వినగానే - అరె! ఇది అచ్చు ఆ పాటలానే వుందే - అనిపిస్తోంది.
కానీ - ఆ పాటేదో ఎంత పాటు పడ్డా పట్టుబడట్లేదు
లీలగా గుర్తొస్తుంది - అంతలోనే నూనె రాసిన పనసపండు గింజలా జారిపోతుంది
ఒకటికి రెండు సార్లు కళ్ళూ-నోరూ గా...ఠిగా మూసుకుని వినగా...వినగా - తెల్సిపోయింది - ఆ ఇంకో పాట
బా...గా...  గుర్తుంచేసుకోవాలి అనుకున్నాను.
గుర్తు పెట్టుకున్నాననే అనేసుకున్నాను.
ఆ గుర్తుతో మొదలెట్టాలి నా అప"రాగ"పరిశోధన -
ఎవరు రాగ-కర్తలో, ఇంకెవరో కాపీ-రక్తులో పట్టెయ్యాలి - అంటూ

కానీ చివరికి గుర్తున్నవి రెండే మాటలు "అమ్మతోడు, అమ్మతోడు" అంటూ.

ఇంకేది దారి? - మళ్ళీ  గూగుల్ శరణం మమ
వెతగ్గానే - తీగ సాగిన రాగంతో ఆ పాట - టైపిన వేలికి దొరికింది.
అది చూస్తూ వింటుండగా - ఈలోగా అసలు పాటా గుర్తొచ్చింది. 

హాచ్చెర్యం - ఇవి రెండూ కీరవాణి  స్వరబద్ధ-కవలలు.

ముందొక తమిళ డబ్బింగ్ సినిమాలో వాడేసిన ఈ ట్యూను తర్వాత్తర్వాత - భీమవరం రాజుల వంశాంకురం - గవ్వో, శంఖమో ఒకటి - మెళ్ళో షోగ్గా వేసుకున్న - సినిమాలో మళ్ళీ వాడారు.

ఆ పాటేదో నాకన్నా అందరికీ బాగా తెలిసే వుంటుంది - అందుకే అదివ్వట్లేదు ఇక్కడ - ఎందుకంటే...  పాటలంటే ఇష్టమున్న - ఎవరో ఒకరు ఎపుడో అపుడు చెప్పరా ముందుగా అదేమిటో ఆ పాటేమిటో - అనేసుకున్నాను కాబట్టి.

అమ్మతోడు పాట వున్నతమిళ డబ్బింగ్ సినిమా అక్టోబర్ 2.

ఇంకో హాచ్చెర్యకరమైన విషయం - ఈ సినిమా బాలచందర్‌గారిది.

ఇదే - ఇది వరకైతే - ఎలాగోలా వీలుచేసేసుకుని చూసేసేదాన్ని - బదరి-ప్రేక్షకత్వాన్ని వాలంటీర్ చేసేసేదాన్ని.

కానీ - నిన్న రాత్రి - ముందొక పది నిముషాలు వంశీ-సినిమా అని ఆశపడి పెట్టుకుని పదంటే పది నిముషాలు కూడా చూడలేకపోయిన వెన్నెల్లో హాయ్ హాయ్ - ఆ తర్వాత - 1949 లో వచ్చిన రాజ్‌కపూర్-నర్గీస్ సినిమా అని సరదా పడి చూసిన బర్సాత్ - తెగ సాగుతూ చేసిన సినీ-గాయం ఇంకా మానలేదు.

ఇంక దర్శకుల పేర్లు చూసి సినిమా చూడడం అనే సినీ-కాలం చెల్లిపోయింది - నా వరకు నాకు.

అందుకని పాట మాత్రం యూట్యూబులో చూసి సరి పెట్టేసుకున్నాను. 

పల్లెటూరి వాతావరణంలో సజ్జకంకులు, పొద్దుతిరుగుడు పూలు, సెలయేళ్ళు, పచ్చని చేల మధ్య  - పృథ్వీ,  తమిళ-పల్లె-చీరకట్టుతో ముద్దబంతి పూవులాంటి హీరోయిన్-పొణ్ణు (పేరు తెలీదు మరి! సినిమా టైటిల్సులో రమ్యకృష్ణ, మధుబాల పేర్లు కనిపించాయి కానీ - మరి నేనైతే ఈ హీరోయిన్‌లో వాళ్ళిద్దరి పోలికలు పట్టలేకపోయాను.) - హుషారుగా ఆడుతూ పాడుతూ కనిపిస్తారు ఈ పాటలో.

ఈ పాట 0:28 సెకండ్ల దగ్గర కనిపించిన ఆ చెట్టూ-కాయలు ఏంటో తెలుసుకోవాలి - ఎవరికైనా తెలుసేమో.

పాట - చిత్ర, మనో పాడినట్లనిపించింది. సంగీతం - కీరవాణి.

పాటలో పదాలు - ఆ పెదవుల కదలిక ఈయన పాటదేనేమో అనిపించేలా రాసే అనువాద-"రాజ"శ్రీ గారివి.

పాటలో మాటలు, పాటకి ఆటలు - అన్నీ బావున్నాయి.

అన్నిటినీ మించి ఒకరోజు సెలవు దొరికింది - అమెరికా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా.

సెలవు-బోనస్ పోస్టు అన్నమాట ఇది :)

ఈ కింది పాట వింటూ-చూసెయ్యండి మరి!




అమ్మతోడూ...   అమ్మతోడూ - ఆడుకోనీ...  మన ఈడూ 
ఊరించెనే...  నీ వాడు - వేసేనులే...  వల  నేడు 

సందకాడా...  అందగాడు - నాకు కాడా...  ఈడు జోడు 
నాతో నేడు...  వంత పాడు - ఊసులాడే...  కన్నె ఈడు 

తన్ననానా...  తన్ననానా... 
తందననన...   తందననన...  తందననన...

కన్ను కన్ను కలిపేవే - కథలు నాకే  తెలిపేవే
ఆశలన్నీ రేపేవే - రాసలీలలు చూపేవే
నీతోడు మాపటేల నే  చేరేను  - ఊసులు ఆడుకోనీ 
నీ నీడలోన నేను తేనెజల్లు కానీ -  ముచ్చటలాడుకోనీ 
అందమే...  ఆనందమే...  నీ చెంగు చాటు నన్ను ముడి వెయ్యవే 
పచ్చనీ...  పచ్చికలా...  మారాల తోటి వేడి తడి చెయ్యవే 
అందించనీ...  ఒక  మాట - కట్టించనీ...  నీ ఆట 

సందకాడా...  అందగాడు - నాకు కాడా...  ఈడు జోడు 
నాతో నేడు...  వంత పాడు - ఊసులాడే...  కన్నె ఈడు

వలపు వన్నెలు చిలికించీ - వయసు నన్నే మరిపించీ 
కులుకు పిలిచెను ఈ పూట - గురుతు తెలిపెను మన బాట 
గారాలు గంతులేసే తపనల తలపు - ఎప్పుడు నీ పిలుపు 
మందార పెదవుల పండెను ఎరుపు - నా కంటి కది మెరుపు 
ఏమిటో...  అదేమిటో...  ఇన్నాళ్ళు లేని ఆశ కదిలేనే 
అమ్మమ్మో...  నీ స్నేహమో...  ముత్యాల వాన నేడు చిలికేనే 
మావా మావా...  ఒక మాట -  నన్నందుకో...  ఈ చోట 

అమ్మతోడూ...   అమ్మతోడూ - ఆడుకోనీ...  మన ఈడూ 
 ఊరించెనే...  నీ వాడు - వేసేనులే...  వల  నేడు 

సందకాడా...  అందగాడు - నాకు కాడా...  ఈడు జోడు 
నాతో నేడు...  వంత పాడు - ఊసులాడే...  కన్నె ఈడు 

**** **** **** *****
  
అసలు పాట అయ్యిందిగా - ఇప్పుడు నా సిసలు పాట 

పాడుకున్నా...  పాడుకున్నా - పాట ఏదో ... పట్టుకున్నా
రాసెయ్యనా ... ఆ  పాట - వినిపించనా ... ఈ పూట

పాడుకోండి ... పాడుకోండి - కవల ఏదో ... చెప్పుకోండి
పట్టెయ్యండి ... ఆ పాట - చెప్పెయ్యండి ... ఈ చోట

~పాటల భైరవి


2, జులై 2017, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 2 - ఇంటూ-ఫస్టుఫారం టూ ఫోర్తుఫారం

గత నెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి

ఊఁ - సరే. పెద్దొకటి అయిపోయింది.

అయిపోయింతర్వాతేమో -  నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూలు కెళ్ళాను.

వెళ్తే - పాపం - మా రాజుమేష్టారు "ఒరే  నువ్వెళ్ళి రెండో క్లాసులో కూర్చోరా - నా ఒకటి పాసైపోయావు" అన్నాడీయన .

అంటే - సరే వెళ్లి రెండో క్లాసు  - రెండో క్లాసు మూడో క్లాసు అంటే  ఏంటంటే - ఓరుగంటి అప్పారావుగారని మన కాలిఫోర్నియాలో వుంటాడు - రమేషు  - వాళ్ళ తాతగారు - ఆయన్ని చిన్నమేష్టారు అనేవాళ్ళం - ఆయన దానికి టీచరు.

రెండో క్లాసుకేమో ఒక వరస బెంచీలు. వాళ్లెదురుగానే మూడో క్లాసు వాళ్ళు ఒక వరస బెంచీలు.

ఈ మూడో క్లాసు వాళ్ళెవరంటే - నాతో పాటు  ఒకటో క్లాసు చేరిన వాళ్ళే!

వాళ్ళు నా కన్నా ముందెళ్ళిపోయారు కదా! - అందుకే ఆ వరసలో వాళ్ళు కూర్చున్నారు.

వాళ్ళెదురు వరసలో మేము కూర్చునేవాళ్ళం - నేను, నారాయణరాజుగారి సూరి గాడు.

మేమేమిద్దరమే పెద్దొకటి చదువుతా.

సరే - ఇదయింతర్వాత - మొత్తం రెండో క్లాసు ఐపోయింది. మళ్ళి ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్కి.

మూడో క్లాసు - ఇట్నించి వెళ్ళి ఆ బెంచీల్లో కూర్చున్నాం.

అప్పుడేదో - మా చిన్నమేష్టారు - ఏవో చిన్నచిన్న వేమన పద్యాలు, సుమతీ శతకాలు చెప్తుండేవారు.

అవన్నీ వల్లె వేసుకుంటూ నేర్చునేవాళ్ళం.

కాపోతే మనసులో బాధేంటంటే - నాలుగైదు క్లాసులకి పెద్ద బెంచీలుండేవి.

ఒకటి, రెండు, మూడు క్లాసులు నేల బెంచీలు - అవేమో పెద్ద బెంచీలు.

నాతోటి చేరిన వాళ్ళు - నాకన్నా ముందు ఒకటో క్లాసు పాసైపోయినవాళ్ళు ముందు వున్నారు కదా - వాళ్ళెళ్ళి పెద్ద బెంచీల మీద  కూర్చుని - నేనేమో ఇక్కడ నేల బెంచీ మీద కూర్చునేవాణ్ణి.

నన్ను వెక్కరించే వారాళ్ళు.

సరే - మొత్తానికి - ఎలా అయితేనేం ఆ సంవత్సరం కూడా చిన్నంగా ఏదో ఇబ్బంది పడుతూ లాగించేశాం .

నాలుగో క్లాసు జాయిన్ అయ్యాం.

దానికేంటంటే - మరువాడ అప్పారావుగారని ఆయన హెడ్మాస్టరుండేవారు - పెద్దమేష్టారు అనేవాళ్ళమాయన్ని.

ఆయనేమో రిటైరయిపోయి - ఆయన కొడుకు మరువాడ శంకరం గారని చెప్పేసి - ఆయన హెడ్మాస్టరక్కడ. నేనంటే మంచి అభిమానం అదీనూ.

ఆ పెద్ద బెంచీలు రెండు వరసల్లో ఉండేవి -ఒక వరస ఐదో క్లాసు, ఒక వరస నాలుగో క్లాసు. ఈ రెండు క్లాసులు కూడా శంకరంగారే చూసేవారు.

సరే - ఓ మూణ్ణాలుగునెల్లు గడిచిపోయింది. ఈలోగా శంకరంగారు - పాపం - ఆరోగ్యం బావులేక - ఆయన పరమపదించారు.

ఒక పదిహేను రోజులు, నెల్లాళ్ళపాటనుకుంటా - ఎవరూ టీచర్ లేరు మాకు.

చిన్నమేష్టారే వచ్చి ఆ క్లాసులకీ చెప్తుండేవారన్నమాట.

ఒక నెలతర్వాత ఒక కొత్తయనొచ్చారు టీచరు - సూర్యనారాయణగారని చెప్పేసి.

ఇంత లావుగా ఉండేవారు - కుర్చీ నిండా ఉండేవారు ఏనుగులాగా.  ఎందుకో ఆయన నాకు నచ్చలేదు - ఫస్టు నించీ కూడా.

దానికి తోడేమో నా ఎదురు బెంచీల్లో కూర్చునేవాళ్ళు - ఐదో క్లాసు కదా! వీళ్ళందరూ అప్పుడప్పుడు మమ్మల్ని వెక్కిరిస్తూ ఉండడం - ఇవన్నీ జరుగుతూ వుండేవన్నమాట.

ఈలోపులో నాలుగో క్లాసుకొచ్చేటప్పటికే కొంచెం నాకు - ఈ తెలుగులో భాషాప్రవీణ్ణుడయ్యాను- కొద్ది తెలివితేటలబ్బుతున్నాయన్నమాటప్పుడే.

మా ఎలిమెంట్రీ స్కూల్లో సిమెంటు స్తంభాలుండేవి. ఆ స్తంభాలమీద సూక్తులు రాసేవారు - విద్య లేని వాడు వింత పశువు, విద్య యొసఁగు వినయంబు - అటువంటి సూక్తులుండేవి.

ఓ రోజేం చేశానంటే - చాక్పీసు తీసుకుని ఆ విద్య లేని వాడు వింత పశువు అనే దగ్గర - ఆ లేని కింద ఇంటూమార్కు పెట్టి - పైనేమో - విద్య నేర్పినవాడు వింతపశువు - అని పెట్టా.

మర్నాడు మా సూర్నారాయణ మేష్టారు చూశాడు. చూసి "ఎవడ్రా - ఈ భాషాపండితుడెవరు తెలుగు లోనూ ?" అనేటప్పటికి  - మా ఎదురు బెంచీ వాళ్ళు - నా మీద కోపం కదా వాళ్ళకీ - "ఇదో ఈ బాబే రాసేశాడండీ - బాబోయ్ - బుల్నారాయణగారి బాబీ రాసేశాడండీ - అంటూ గోలగోల చేసేశారు.

ఆయన దెగ్గరికి పిలిచి - "బానే నేర్చుకున్నావురా తెలుగు నువ్వూ - ఏది - ఏ చేత్తోటి రాశావ్? - చూపెట్టు - ఆ చెయ్ చూపెట్టూ!" - అన్నాడు.

అన్నాక ఆ చెయ్యి తిప్పి తీసుకుని డ్రాయరు సొరుగులో పెట్టి నొక్కేశాడు.

ఇంకల్లాడి పోయానన్నమాట. "అయ్‌బాబోయ్" - డాన్సు కట్టేహానక్కడ.

సరే - అలా - ఇంకలాగైపోయింది - ఏడ్చుకుంటూ వచ్చి కూర్చున్నాను. 

ఇంకసలిక్కడ చదవకూడదు - ఈయనదగ్గర అసలు చదవకూడదు - అంజెప్పి - రెండు బాధలు - ఒకటి ఆయన కొట్టాడు - ఆయన దగ్గర చదవకూడదు అనేదొకటి - రెండు ఒకటో క్లాసు నాతొ జాయినైనవాళ్లు నాకన్నా ముందు హైస్కూలుకెళ్ళిపోతారనే బాధ ఇంకొకటి.

ఈ రెండు దృష్టిలో పెట్టుకుని - అసలింక - ఇంటికెళ్ళిపోయి మా నాన్న దగ్గర చెప్పేవాణ్ణి కాదు - మా అమ్మ దగ్గరే - వెళ్ళి - "నేం చదవనింక  ఈ స్కూల్లో - నేను పొలమెళ్ళిపోతాను - లేదంటే నన్ను హైస్కూల్లో జేర్చేయండి" - అంటే సరే మా అమ్మ మా నాన్నతో - "వీడు హైస్కూల్లో జేరిపోతానంటున్నాడు" - అంటే - "అప్పుడే అన్ని తెలివి తేటలొచ్చేశాయా వీడికి - ఐదవ క్లాసు చదవకుండానూ?"  - అన్నారు మా నాన్న.

అప్పుడు - ఇంటూ ఫస్ట్ ఫారం అని ఉండేది. ఫోర్త్ క్లాసులో  ఇంటూ-ఫస్ట్ ఫారం పరీక్షలు రాస్తే - మనం పాసైతే డైరెక్టుగా ఫస్టు ఫారంలో జాయినైపోవచ్చు.

"సరే - చూద్దాం అప్పటి సంగతి  - ముందు ఈ నాలుగో క్లాసు పూర్తవనీ" - అన్నారు.

నాలుగోక్లాసు పూర్తయింది.

ఈ లోపులో - ఈ మధ్యకాలంలో ఏంటి - నాకు సూర్నారాయణ మేష్టారి మీద కోపం వుంది కదా నాకు ?

నాలుగో క్లాసులో ఉండగానే అట్లతద్దొచ్చింది.

అట్లతద్దికేంటంటే - ఊళ్ళో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ తెల్లవారుఝామున లేచి గోంగూరపచ్చడి, ఉల్లిపాయపులుసు వేసుకుని అన్నం తినేసి - తెల్లవారుఝామున నాలుగింటికి - తాంబూలాలేసేసుకుని - ఇంక బయటపడి ఆ వెన్నెల్లో చక్కగా -ఉప్పట్లు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం.

ఈ మేష్టారు అద్దెకున్న ఇంటి ముందు ఆట మొదలు పెట్టాం.

అంతకు ముందు రోజు ఏం చేహానంటే - ఈ సంగత్తెల్సు - ఇక్కడే ఆడతామని చెప్పి. పొలమెళ్ళి పచ్చి ఆవుపేడ బంతులు తయారు చేశాను. వాటినేమో ఇసుకలో పొర్లించి నీటుగా తయారుచేసి ఓ సంచిలో పెట్టుకున్నాను.

పెట్టుకుని తెలవారుఝామున ఈ ఆటలకొచ్చాం. మా మేష్టారు తెల్లవారుఝామున లేచి బాత్రూంకని బయటికి వచ్చాడు. ఆ చీకట్లో వెనకనించి ఆ బంతులు పెట్టి ఆయన్ని కొట్టేహాను. ఆయన ఒళ్ళంతా పేడైపోయింది. పారిపోయాను.

పారిపోయింతర్వాత - ఇదెవరు చేశారో ఎవరికీ తెలీదు. నా మీద డౌటే ఆయనకి - వీడే చేసుంటాడని. ఎందుకంటే - ఆ ఊళ్ళో అవతారంగారి నారాయణగారంటే - ఆయన ఓల్డ్ BA - పైగా దివాణం. ఆయన మీదేంటంటే ప్రేమతో కూడిన అభిమానంతో కూడిన గౌరవం ఉండేది. నారాయణగారి బాబిగాడంటే భయంతో కూడిన ప్రేమతో కూడిన అభిమానముండేది. ఎందుకంటే - వీడో అల్లరి వెధవ ఎక్కడ రాళ్ళేస్తాడో మీదని చెప్పేసి. ఆయనకి డౌటుండేది - ఆ డౌటు బయట పెట్టకుండా - పాఠం రాలేదని  వేరే వంకేదో పెట్టి కొట్టేహాడు.

సరే - ఇంకీయన దగ్గర చదవకూడదని చెప్పేసి - నాలుగో క్లాసు అవగానే ఇంటూ-ఫస్టుఫారం పరీక్షలు రాసేశాను.

నాతో మొట్ట మొదట చదివిన వాళ్ళతో కలిసి హైస్కూలుకి వెళ్ళిపోయాను - భీమనపల్లి హైస్కూల్ - సిరంగు రంగనాయకమ్మ హైస్కూల్. తర్వాత జిల్లా పరిషత్తు అయ్యింది. అందులో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని చెప్పేసి ఆయనేమో హెడ్మాస్టరు.

తర్వాత మన ఊళ్ళో అనాతవరంలో తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు - ఆకెళ్ళ సుబ్బారావుగారు, చంద్రశేఖరశాస్త్రిగారు - వీళ్ళందరూ అనాతవరం నించే రోజూ వెళ్తుండేవారు. చంద్రశేఖరశాస్త్రిగారు వాళ్ళు మనకు చుట్టాలే. ఆయన కూడా - జాయిన్ చేసేయండి నారాయణగారూ - అంటే నన్ను హైస్కూల్లో చేర్చేశారు. ఫస్టుఫారం , సెకండుఫారం, థర్డుఫారం - చెప్పుకోదగ్గవేమీ లేవు. ఏదో సరదాగా బడికెళ్ళడం, రావడం గడిచిపోతూ ఉండేది.

ఇంటి దగ్గర అల్లర్లవీ మామూలే.

ఒకసారి సెలవులకి అమ్మ, నాన్న , నేను శివకోడు వెళ్ళాం - మా మేనమామగారి ఊరు. మాతామహుల ఊరు. మా తాతగారు, అమ్మమ్మ అందరూ ఉండేవారు.

ఆ శివకోడు వెళ్ళినప్పుడు అంతకు ముందు రోజు రాత్రే నేను సినిమాకు వెళ్తానని గొడవ చేశాను. పంపించలా. పంపించకుండా - "అస్తమాను సినిమాలేంటి - ఆడుకోండి" - అని కసిరేసింది మా అమ్మ.

మర్నాడు సాయంత్రం నాలుగింటికి అందరూ శివాలయానికి బయల్దేరారు - మా అమ్మ, మా అత్తయ్య, మా అమ్మమ్మ, ఆడపిల్లలు - వీళ్ళందరూ కూడా.

నేను సినిమాకి పంపలేదని కోపం ఆపుకోలేక దోసిళ్ళతో ఇసక తీసుకెళ్ళి వాళ్ళ తలల మీద పోసేసి పారిపోయాను.
ఇంక వాళ్ళు గుడి కెళ్ళడం  మానేసి ఇంట్లో కొచ్చి - తలంతా ఇసక కదా - తలంట్లు అవీ పోసుకుని వాళ్ళ బాధలేవో వాళ్ళు పడ్డారు.

నేను దొరకలేదు వాళ్ళకి. మహా కోపంగా వుంది.

మా నాన్న కూడా వీధరుగు మీదే కూర్చున్నారు కానీ ఆయనా చూళ్ళేదు నన్ను.

వెనకనుంచి పెరట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయి - మా మావయ్య గారింట్లో చాకలికి వేసే బట్టల కోసం పెద్ద పెట్టి ఉండేది. దానికి జాలీలవీ గాలి పోవడానికి ఉండేవి. దాన్నిండా ఉతకాల్సిన బట్టలున్నాయి.

నేను వెళ్ళిపోయి - సగం బట్టలు తీసేసి అందులోకి దిగిపోయి ఆ బట్టలు నా నెత్తిమీద కప్పేసుకున్నాను. ఆ బట్టల పెట్టిలో అలా ఉండిపోయాను. కాసేపటికి నిద్రొచ్చేసింది నాకు - నిద్ర పోయాను లోపలే.

చాకళ్ళు సాయంత్రం వచ్చి బట్టలు పట్టికెళ్ళేవాళ్ళు. సాయంత్రం ఆరింటికో ఎప్పుడో చాకలి మనిషి వచ్చింది. వచ్చి ఆ బట్టలు తీసినప్పుడు - అప్పుడే మునిమాపు చీకటి పడుతోంది - లోపలేదో ఆకారం కనపడి "అయ్యబాబోయ్" అని పెద్దగా అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మండువాలో పడిపోయింది.

ఏంటేంటి అని అందరూ అడుగుతుంటే - "బాబోయ్ - ఆ బట్టల పెట్టిలో ఎవరో వున్నారండి బాబూ" - అని గొడవ గొడవ చేసేసింది.

గబగబా వచ్చి చూస్తే నేనున్నాను లోపల - నిద్ర పోతూ. నన్ను తట్టిలేపి మా అమ్మ పైకి తీసుకొచ్చింది.

మా అమ్మమ్మ - ఆవిడకి నేనంటే పాపం మహా జాలి. ప్రేమెక్కువ - "వాణ్ణి ఏమనకే పాపం ఏదో సినిమా అని అడిగాడు"  అంటే మా అమ్మ - "అబ్బెబ్బే ! నేను వాణ్ణేమంటానూ !? రేప్పంపిస్తాను సినిమాకీ. రేపెళ్దువుగానీ సినిమాకి రా నాయనా " - అని చక్కగా గాదె సావిట్లోకి తీసుకెళ్ళి పిక్కపాశాలు పెట్టేసింది.

గట్టిగా కేకలు పెట్టాననుకో మళ్ళీ మా నాన్నొచ్చి మళ్ళీ ఇంకో నాలుగు పీకుతారు నన్ను - అందుకని  గట్టిగా నా నోరు మూసేసింది.

ఆ రోజలా గడిచింది కానీ మర్నాడు నన్ను సినిమాకి పంపించారు.

అదుగో - అదొక్కసారే మా అమ్మ నన్ను కొట్టింది. మళ్ళి ఎప్పుడూ కూడా నన్ను కొట్టలేదు. అదే ఫస్టు అదే లాస్టు.

శివకోడు వెళ్ళినా కూడా అక్కడ అందరూ నా ఫ్రెండ్సే. బాబొచ్చాడు - బాబొచ్చాడు అనేటప్పటికి హడావిడిగా వుండేవాళ్ళు అన్నమాట. చెడుగుళ్ళు ఆడడం - ఎక్కడికెళ్ళినా సందడే.

కాకపోతే ఫస్టుఫారం నుంచి  థర్డుఫారం వరకు నేను ప్రాక్టీసు చేసిందేంటంటే - చెట్లు చేమలు ఎక్కడం, చెరువులు, కాల్వలు ఈదడం.

అసలు చెట్ల మీదే ఉండేవాణ్ణి నేను. జీడిమావిడి చెట్లు, నేరేడు చెట్లు, జామచెట్లు - కొబ్బరి చెట్లు కూడా ఎక్కేసేవాణ్ణి - బొండాలకి. ఈత చెట్లెక్కి గెలలు కొట్టుకొచ్చేసేవాణ్ణి.

చెరువు వార్న నేరేడు చెట్లు, మావిడి చెట్లు ఉండేవి. అవెక్కి ఆ కొమ్మలమీంచి చెర్లోకి దూకేసేవాణ్ని. దూకేసి అక్కడ ఈత కొట్టేవాణ్ణన్నమాట. ఆ మూడు సంవత్సరాలూ - ఈ ప్రాక్టీసు సరిపోయింది నాకు.


భీమనపల్లి హైస్కూల్ రెండు కిలోమీటర్లు అనాతవరానికి.  నడిచి వెళ్ళాల్సివచ్చేది. అందుకని మా నాన్నేం చేశారంటే - గొల్ల నారాయడని మాకు పాలు అవీ పోస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. మన పొలం లోనే గేదెలు అవీ మేపుకుంటూ ఉండేవాడు. ఆ గొల్ల నారాయడు అద్దె సైకిళ్ళు పెట్టాడు.

మా నాన్న - ఆ గొల్ల నారాయడికి పురమాయించారు  - "నారాయుడూ! పొద్దున్నే స్కూలుకి తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తీసుకురా" - అని.

రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నరకి వచ్చి తీసుకెళ్ళి సాయంత్రం ఐదింటికి తీసుకొస్తూ ఉండేవాడు. ఈ అద్దె సైకిలు వ్యవహారం థర్డుఫారం వరకు నడిచింది. థర్డుఫారం వచ్చేసరికి ఎగ్గొట్టడం ఎక్కువయ్యింది కదా - గొల్ల నారాయడికి హాండిచ్చేసి వెళ్ళిపోయి కోతుల మామ్మగారని ఇద్దరు మామ్మలుండేవారు. ఓ తాటాకిల్లు అదీనూ. వాళ్ళింట్లో చద్దన్నం ఉండేది. నేను, సూరిగాడు స్కూలెగ్గొట్టేసి, ఆ చద్దన్నం తినేసి అక్కడే ఆట్లాడుకుంటూ ఉండేవాళ్ళం.

ఫస్టుఫారం నుంచి థర్డుఫారం దాకా సైకిల్లేదు కదా నాకు. మరి సినిమాకి వెళ్ళాలి ఎలా? సినిమాకెళ్ళాలంటే ఓ రోజంతా పేచీ పెట్టాలి.

పేచీ పెట్టింతర్వాత మా నాన్నేమో నాలుగు తగిలించి - నాలుగు వాయించేసేవారు ముందు - తర్వాత మళ్ళీ జాలి కదా  - మా పొలంలో బొక్కా పళ్ళయ్య అని చెప్పేసి ఉండేవాడు.

ఆ బొక్కా పళ్ళయ్య నిచ్చి - "ఇదిగో పళ్ళయ్యా - వీణ్ణి తీసుకుని సినిమాకి తీసుకెళ్ళు" - అని బెంచీకి టిక్కెట్టిచ్చేవారు. అంటే పెద్ద బెంచీలు.

ఈ బొక్కా పళ్ళయ్య వెళ్ళేటప్పుడు నన్నెక్కించుకుని సినిమాకి తీసుకు వెళ్ళేవాడు.

వస్తూ వస్తూ ఇంటి దగ్గర పురమాయించుకురావడం అనుకుంటాను బొక్కా పళ్ళయ్య పెళ్ళాం, ఓ ముగ్గురు పిల్లలు - వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చేసేవారు అమలాపురం సినిమాకి.

సినిమాలో బెంచి టిక్కెట్టు తీసేవాడు కాదు - నేల టిక్కెట్లు తీసేవాడు - నేల బెంచీలు.

సరే - మనకి సినిమా ముఖ్యం కానీ బెంచీ ముఖ్యం కాదు కదా - చగ్గా సినిమా చూసేసేవాణ్ణి.

సినిమా అయిపోయింతర్వాత ఈ పళ్ళయ్య ఏం చేసేవాడంటే - నన్నేమో వెనకాల సైకిలు కారేజ్ మీద కూర్చోపెట్టేవాడు. సీటు మీద ఆయన కొడుకొకడు. ముందు కడ్డీ మీద ఇద్దరు కొడుకుల్ని కూర్చోపెట్టి - సైకిలు నడిపించుకుంటూ పళ్ళయ్య, పెళ్ళాం  - అమలాపురం నుంచి అనాతవరం ఎనిమిది కిలోమీటర్లు -  నడుచుకుంటూ వచ్చేవారు -  రాత్రి పదకొండు అయిపోయేది ఇంటికొచ్చేటప్పటికి.

మా నాన్న - "ఏంటి ఇంత  లేట్ అయింది పళ్ళయ్యా?"  - అనడిగితే - పళ్ళయ్య - "సైకిలు దారిలో పంచరైపోయిందండి, పంచరేయించుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయిందండి" - అని ఏదో మాయ చేసేవాడు.

నేనూ ఏమీ చెప్పేవాణ్ణి కాదు - సరే - పోనియ్ మన్ని తీస్కెళ్తున్నాడు కదా సినిమాకి అంజెప్పేసి నేనూ మాట్లాడేవాణ్ణి కాదు.  అదీ సినిమాల సంగతి.

అనాతారంలో సుబ్బన్న, వెంకటరెడ్డి అని ఇద్దరుండేవారు. వాళ్ళు పెసర పుణుకులు, బొంబాయి చట్నీ చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర చిన్నంగా చేరి మధ్యాహ్నంపూట ఒకటీ అరా తినేసి  అప్పు పెట్టేవాణ్ణి.

వాళ్ళు ఓ వారం పది రోజులయ్యాక ఇంటికొచ్చి మా నాన్న దగ్గరకొచ్చి - "బాబుగారు పెసర పుణుకులు అవీ తిన్నారండి - ఇంతయ్యింది" - అంటే పాపం - తినడానికే కదా అని వీళ్ళు కూడా ఇచ్చేసేవారు. ఆ రకంగా వాళ్ళకి అరువు పెట్టడానికి అలవాటు పడ్డాను నేను.

వీళ్ళు కాకుండా - భీమనపల్లిలో - నారాయణమూర్తి, తాతయ్య అని రెండు హోటల్స్ ఉండేవి. ఆ రెండు హోటల్సులో తీపిగారెలు వేసే వారన్నమాట మధ్యాహ్నం. అక్కడ కూడా అప్పు పెట్టడం మొదలుపెట్టా. మొదలుపెడితే వాళ్ళు కూడా వచ్చినప్పుడు - సరే ఏదో పాపం మధ్యాహ్నం పూట తింటున్నాడు పోనీ  - అంజెప్పేసి ఇంట్లోవాళ్ళు పట్టించుకునేవారు కాదు నన్ను. అలాగే వాళ్ళకీ డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవారు. థర్డుఫారం దాకా అలాగే ఆడుతూ పాడుతూ గడిచిపోయింది.

థర్డుఫారంలో స్కూల్ ఎక్కువ ఎగ్గొట్టాను కదా - అందుకే ఫోర్త్ ఫారంలోకి వెళ్ళాక - పరీక్ష పాసయ్యి ఫోర్తుఫారంలోకి వెళ్ళాను కానీ విత్-హెల్డ్ అని రాశారక్కడ. ఎందుకు రాశారంటే అటెండెన్స్ తక్కువయ్యింది. థర్డుఫారం క్లాసులోనేమో అటెండెన్స్ వేయించుకోవాలి. పాఠాలు వినడానికి ఫోర్తుఫారం క్లాసుకెళ్ళాలి.

ఫోర్తుఫారంలో ఎప్పుడైతే విత్-హెల్డులోకి వచ్చానో  - అప్పుడు మా నాన్న కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు, ఆకెళ్ళ సుబ్బారావుగారు ఉండేవారు కదా మేష్టర్లు - వాళ్ళని అడిగారు - ఏంటి వీడు విత్-హెల్దేమిటి మళ్ళీ- అంటే - "లేదండి వీడు కూర్చోడం ఫోర్తుఫారంలోను - వెధవకి అటెండెన్స్ తక్కువయ్యింది - ఎక్కడ ఎగ్గొట్టాడో వీడు - అంచేత అటెండెన్సేమో థర్డుఫారంలోను" - అని వాళ్ళు చెప్పేటప్పటికీ - నాకేం చేశారంటే ఇంక ఆ సైకిలు కట్ చేసేశారు గొల్ల నారాయుడిది. పనిష్మెంటన్నమాట. "ఇంక నీకు సైకిల్లేదు - రోజూ నడిచి పోయి నడిచిరా"- అన్నారు. అలా ఫోర్తుఫారం అంటా నడక. పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళడం - సాయంత్రం నడుచుకుంటూ రావడం.  ఈలోగా దారిలో సైకిళ్ళ వాళ్ళెవరైనా కనబడితే - ఓరి బాబ్బాబ్బాబూ - కాస్త అనాతారం తీసుకెళ్ళండ్రా అంటే - వాడు మంచివాడైతే వెనకాల ఎక్కమనేవాడు - లేపోతే నువ్వు తొక్కు, నే కూర్చుంటా - అనేవాడు. నేను సైకిలు తొక్కడం వాడు వెనకాల కూర్చోవడం.

అలా ఫోర్తుఫారం గడుస్తూ వుంది.

<వచ్చేనెల తరువాయి కథ>

1, జులై 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు



మే 28 - ఆదివారం - అపరాహ్ణ వేళ - అంతకు ముందు జరిగిన అష్టా(నా కష్టా)వధానం అయిపోగానే - పెద్దలైన - ఒజ్జ ఇనాక్‌గారు, వెజ్జులు రామరాజ భూషణుడు గారు, బాబ్జీగారు - వీరి సహపంక్తిన కూర్చుని బల్-పసందైన వారి చిన్ననాటి కబుర్లు వింటూ తానా-వారి మధ్యాహ్నపు విందు చేయడం అచ్చంగా నాకే దక్కిన ఒక వీనుల-విందానుభవం.

వారి మాటల మధ్యలో మా ఏసీ కాలేజ్‌లో నానా-రకాల కెమిస్ట్రీల్లో నాకెంతో ఇష్టమైన ఆర్గానిక్ కెమిస్ట్రీ బోధించిన భవభూతిశర్మగారి తండ్రిగారైన జమ్మలమడక మాధవరాయశర్మగారి ప్రసక్తి రావడం - ఇంకా అదే మాటల్లో వాళ్ళందరూ కూడా ఏసీ కాలేజ్‌ పూర్వ విద్యార్థులని తెలియడం -మనందరం ఒకే కాలేజ్ అని నే మురిసిపోవడం - అంత పెద్దవారూ  దశాబ్దాల-జూనియర్ నైన నన్ను - వాళ్ళతో సమానంగా మాట్లాడనివ్వడం - అమ్మో - తానాకి వెళ్ళకపోతే ఎంతో మిస్ అయిపోయేదాన్ని!

భోజనం అయింది - అవగానేఅందరితో కలిసి మళ్ళీ మా 132కి వెళ్దామని బయలుదేరాను  - కాకపోతే ఒక అడుగు ముందుగా వెళ్లాల్సి వచ్చింది - ఎందుకంటే తర్వాతి కార్యక్రమానికి వచ్చే అతిథుల కంటే ముందుండాలి కదా!

132కి వెళ్ళే దారిలో ఒక పక్కగా గోడ వారగా పెట్టి వున్న వాటర్ బాటిల్స్ ఒక ఎనిమిది పట్టుకుని  - గబగబా వెళ్ళానా! - అక్కడ ఎవరూ లేరు.

వెనకాల వరసలో స. వెం. రమేష్‌గారు, సంజనా పద్మం, కవిత, వసంత్ నాయుడుగార్లు కూర్చుని వున్నారు.

ఒక పక్కగా ఒకాయన - చేతిలో పుస్తకంతో - ఒక్కరే కూర్చుని వున్నారు.

ఎందుకో ఆయన్ని చూడగానే ఆయనే మ్యూజికాలజిస్ట్ రాజాగారేమో అనిపించింది.

ఇంతలో ఆయనే నన్ను చూడగానే - ఏమ్మా! మీరిక్కడి వారేనా? ఇక్కడ ఒక్క మైకే వుంది. మేము నలుగురం ఉంటాం స్టేజ్ మీద. నలుగురం ఒకరితో ఒకరు సంభాషిస్తున్నట్టు ఉంటుంది కార్యక్రమం. ఒక్క మైకు సరిపోదు. ఇంకో మూడు మైకులకి ఏర్పాటు చెయ్యండి - అన్నారు.

నాకొక్క నిముషం ఏం చెప్పాలో అర్థం కాలేదు.

ఆయనకి నమస్కారం చేసి - అలాగేనండి - అనేసి బయటికి వస్తున్న నాకు - వసుధ ఎదురొచ్చింది. పక్కనే ఒకతను వున్నారు.

అప్పటికే ముందు రోజు వసుధ కలిసినప్పుడు చెప్పింది - అయోధ్య కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఒకతను సిరివెన్నెలగారు, దర్శకుడు క్రిష్‌లతో కలిసి ప్రస్తుత కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు - రవి పసుపులేటిగారికి చెప్పి ఉంచమని.

ఇప్పుడు తన పక్కన వున్నది ఆ అయోధ్య కుమారే.

వాళ్ళిద్దరినీ పలకరించి "మీరు 132 లోకి వెళ్ళండి ఇప్పుడే వస్తాను"  అని కొంచెం ఎడంగా వెళ్లి మా తానా-సాహిత్య కమిటీ వాట్సాప్ గ్రూపులో రవిగారికి టెక్స్ట్ చేశాను - "రవిగారు! 132లో నాలుగు మైకులు కావాలని మ్యూజికాలజిస్ట్ రాజాగారు చెప్పారు. అంతే కాకుండా అయోధ్య కుమార్ కూడా వచ్చారు. ఎవరైనా 132 కి వచ్చి ఆ మైకుల ఏర్పాటు చూడండి" అంటూ.

బదుల్లేదు.

సరే - ఏం  చేస్తాను?  ఏం చేయగలను?  లోపలికి వెళ్తే రాజాగారు మళ్ళీ మైకులడుగుతారు.

అందుకని బయటే కాసేపు నించుని మా కమిటీలో వాళ్ళెవరైనా కనిపిస్తారా అని అటూ-ఇటూ చూడడం మొదలు పెట్టాను.

ఎవరూ కనిపించనే  లేదు. ఈలోగా సతీసమేత-నారాయణ స్వామిగారు కనిపించారు. వారి దగ్గరికి వెళ్లి చెప్పాను - 132లో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కార్యక్రమం వుంది- అని. సావిత్రిగారికి పొలిటికల్ ఫోరమ్ అంటే ఆసక్తి అని - ఆ దంపతులిరువురూ - చెట్టా పట్టగా చేతులు పట్టి తానా-నీడన నడిచెళుతుంటే  - చెప్పలేని హాయితో ముందుకి సాగారు.

సరే - ఇంక నేను - మనసులో - ఇదిగో - ఈ కింది పాట  -  (నా ఈ కొసరు పాటకి అసలు పాట గుర్తు పట్టగలరా - ఇది చదువుతున్న మీరు? ఊరికే సరదాకి ...)

నేనూ వసుధా ఎదురెదురు
రాజా మైకడుగునని  ఎంతో బెదురు
దొరకని బదులులు దొరకవని
తెలిసి టెక్స్టులు చేయటమెందుకని 
నా టెక్స్టుకి బదులేది - ఈ రూముకి మైకేది 

పాడుకుంటూ - 132కి వెళ్ళాను. 

132లో అడుగు పెట్టగానే - ఒక్కనిముషం అది - అంతకు ముందు కార్యక్రమాల్లో - ఇదెప్పటికైనా నిండేనా అని అనిపించిన మా నూటముప్ఫైరెండేనా - అన్న అనుమానం వచ్చింది. 

ఇసక వేస్తే రాలనంత మంది కాకపోయినా వెయ్యి పిన్నులు పడేసినా ఆ శబ్దం వినిపించనంత సందడిగా వుంది.




ఇంతకు ముందు వరకూ - అసలుందని అందరికీ తెలుసో లేదో అనిపించిన - మా 132కి రావాలని వీళ్ళందరికీ ఇవాళే ఎందుకనిపించిందబ్బా - వీళ్ళకెవరైనా పేరుపేరునా చెప్పి పిలుచుకొచ్చారా - అనాలోచిస్తే - అప్పుడు గుర్తొచ్చింది - తానా ప్రోగామ్ గైడ్‌లో చూసిన - సినిమా సాహిత్యము, పాటలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి - అన్న మా 132 కార్యక్రమ పట్టిక.

సినిమా-సిరివెన్నెల అన్న జంటపదాలు మా 132-పంట పండించాయి.

అసలు ఈ కార్యక్రమం వివరాలు - గీత సాహిత్యంలో కవిత్వమెంత? - చేంబోలు సీతారామశాస్త్రి - అని ప్రచురించుంటే ఎంత మంది వచ్చేవాళ్ళో ?

వెంటనే - మా సాహిత్య కమిటీలో విజిటింగ్-మెంబరైన నానీలు రాసే విజయశ్రీ కుప్పాగారిని తల్చుకుని - జై-విజయశ్రీ గారూ - అనేసుకుని ఒక నానీననేసుకున్నా-

ఔరా సినీమాతా!
 తెలుగు తల్లి చుట్టమా!
కట్టిరి  ఎల్లరు 
నీకే పట్టమా ! 

- అంటూ.

అంత మందిని చూసేటప్పటికి ఆనందం ప్లస్ రాజాగారు మైకులడగరని సంతోషం ప్లస్ మా కమిటీ అధ్యక్షులు, నాతోటి మెంబర్లను చూసిన సంబరం - గాల్లో తేలుకుంటూ వెళ్లి రెండో వరసలో సుగుణగారి పక్కన కూర్చున్నాను. 

నా పక్క సీట్లో కూర్చుని వున్న అయోధ్య కుమార్‌గార్ని పలకరించాను. ఐదు నంది అవార్డులు గెలుచుకున్న  తను దర్శకత్వం వహించిన మిణుగురులు సినిమా గురించి ఉత్సాహంగా చెప్తుంటే విన్నాను. తను అంతకుముందు ఫ్లోరిడాలో వుండేవాణ్ణని, సినిమా మీద ఇష్టంతో ఇప్పుడు హైదరాబాదులో వుంటున్నానని చెప్పారు.

ప్రతి వీకెండ్ సినిమాలు చూసేటప్పుడు బదరి ఎప్పుడూ అంటుంటారు - ఆర్పీ పట్నాయక్ తన సినిమా బ్రోకర్ యూట్యూబులో రెండు డాలర్లకి చూపించినట్టు మంచి సినిమాలని ఆ నిర్మాతలో, దర్శకులో పూనుకుని ఇంటర్నెట్లో వచ్చేలా చేస్తే - పైరేటెడ్ కాపీస్ అంతగా ప్రోత్సహించబడవని. 

అదే మాట అయోధ్య కుమార్‌గారికి చెప్పాను - "మాకేమీ సినిమా ఊరికే వచ్చేస్తే చూడాలని ఉండదండి. మేము డబ్బులిచ్చి చూస్తేనే మీరు ఇంకొన్ని మంచి సినిమాలు తీయగలరు కదా! ఇంటర్నెట్లో ఐదు డాలర్లకి సినిమా  పెట్టినా మా ఇంటి లివింగ్‌రూం సోఫాలో కూర్చుని ఇంటిల్లిపాదీ చూడడానికి - ఆమాత్రం పెట్టొచ్చు అనుకుంటాం కదా మేము?!. మీలాంటి కొత్త దర్శకులు అలాంటి ఐడియాలేవో చేస్తే బావుంటుంది" - అని. 

తనప్పుడు చెప్పారు మిణుగురులు అలా అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఆ తర్వాత తన విజిటింగ్ కార్డు తీసి నాకు ఇచ్చారు. తప్పకుండా మిణుగురులు చూసి నా అభిప్రాయం చెప్తానని చెప్పాను. ఆ సినిమా దొరికితే చూడాలి అనేసుకున్నాను. 

ఇంతలో కలకలం - చుట్టూఅందరూ నించుంటున్నారు. ఏంటా అని నేనూ నించుని చూస్తే - సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు, క్రిష్‌గారు విచ్చేశారు. 

వేదిక మీద క్రిష్‌గారు, పక్కనే సీతారామశాస్త్రిగారు, అటు పక్క కార్యక్రమ సంధానకర్త మద్దుకూరి చంద్రహాస్‌గారు, చివరగా మ్యూజికాలజిస్ట్ రాజాగారు - నాలుగు కుర్చీల్లో - కూర్చున్నారు. 

వాళ్ళ ముందు ఒకటే మైకు. 

అప్పుడింక అసలు కార్యక్రమం మొదలయింది. 

ఇప్పటికీ కొసరు కబుర్లు చాలంట
అప్పటి అసలు కబుర్లు బహు మేలంట 
వాటికి ఇంకొక వారం ఆగాలంట 
ఎదురుచూపులో అతిశయిల్లు రాగాలంట 
మీరు స్టే-ట్యూన్‌డంట 
నేనొస్తా నెక్స్ట్ వీకెండంట!!!