17, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 2

ఈ రోజు మధ్యాహ్నం ముందుగా  నేటి సాహిత్యం - తీరు తెన్నుల గురించి సంభాషణ ప్రారంభించిన  ధర్మాగ్రహ-మేఘ గర్జన చందు సుబ్బారావుగారి అధ్యక్షతలో ఇప్పటి వరకూ  కథల కథలు వినిపించినవారు  వాసిరెడ్డి నవీన్‌గారైతే, నవలా ప్రపంచంలో విహరింప జేసినవారు  సాయిబ్రహ్మానందం గొర్తి గారు.

ఆ కబుర్లిక్కడ  చదివేసుకోవచ్చు: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1

ప్రస్తుతపు ప్రసంగం కవి యాకూబ్‌ గారిది.

యాకూబ్‌ గారి - సామాజిక మాధ్యమాల్లో వెల్లివిరుస్తున్న కవిత:

చందు సుబ్బారావుగారి పరిచయ వాక్యాలతో తన కుర్చీలోంచి లేచి పోడియం దగ్గరికి వచ్చిన కవి యాకూబ్‌ గారు మృదువైన కంఠస్వరంతో తన కిష్టమైన కవితాలోకాన్ని సామాజిక మాధ్యమాల తోడ్పాటుతో ఎంతగా విస్తరించగలుగుతున్నారో చాలా ఉత్సాహంగా వివరించారు.

ఆయన మాటలు నా బ్లాగ్నోట ఇలా :

"అమెరికా వచ్చి మూడు రోజులయింది. వేదిక మీదికి వచ్చి పదినిముషాలయింది. ఈ నిరీక్షణ చాలా బావుంది - వేదిక మీదికి రావడానికి చేసినది.

మా చందు సుబ్బారావు గారిది. మాటల జోరు - జలపాతపు హోరు.

నాకిష్టమైన కవిత్వం గురించి ఇంకా ఇష్టమైన విషయాలు ఒక ఐదారు నిముషాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

 తెలుగు బోధిస్తాను నేను.

విద్యార్థిగా వామపక్ష ఉద్యమాల్లో పాల్గొంటూ - పాటలు పాడుకుంటూ వచన కవిత్వం వైపు రావడానికి - ఆరోజుల్లో అందరిలాగే శ్రీశ్రీ నాకాదర్శం. - ఇంకా అజంతా, ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్ అభిమాన కవులు.

పాతిక-ముప్పై ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి  చూస్తే తెలంగాణా ఉద్యమం - సంఘర్షణల మధ్య కవిత్వం ఎలా వుంది అని ప్రశ్నిస్తే - కవిత్వానికి కాలం చెల్లిపోయింది - ఏభై-అరవై ఏళ్ళ వాళ్ళు తప్ప ఎవరూ రాయరు - కవిత్వం ఇంక ఉండదేమో - అని రకరకాల సందేహాలు వెలిబుచ్చేవారు.

అలా కవిత్వానికి కాలం చెల్లిపోకూడదని  - నా ప్రయత్నంగా  - కాలేజ్‌లో ఒక నల్ల బోర్డు మీద ఈవారం కవిత  అని శీర్షిక పెడితే ఎవరో పిల్లాడు సాయంత్రం పూట కొన్ని లైన్లు కవిత రాసేవాడు. ఎవరా అని పిలిపిస్తే అతనొక స్లమ్ ఏరియాలో ఉండేవాడు.

పగలల్లా పనిచేసి సేదతీరడానికి అతనాశ్రయించింది కవితని. 

మానవ పథికుడు చేరుకునే విశ్రాంతి మందిరం కవిత.

అతనొక పబ్‌లో పనిచేసేవాడు. సాయంత్రం కాలేజ్‌కి వచ్చి బోర్డుమీద కవిత రాసి పెట్టి వెళ్ళేవాడు. తన కవితలని వార్త, ఆంధ్రజ్యోతి - పత్రికలకి పంపించేవాడు. కానీ ఎవరూ వేసుకునేవాళ్ళు కాదు. అదలాగే జరిగితే అతనేం చేస్తాడు - తన కవితల కాయితాలు, పుస్తకాలు దాచుకుని తాను పెద్దయ్యాక తన పిల్లలకి చూపించుకుని "ఒకప్పుడు నేను కవితలు రాసేవాణ్ణి" అని చెప్పుకుంటాడు. అంతే.

ఇప్పుడు సోషల్ మీడియా అతనిలాంటి వాళ్లకి సహాయం చేస్తోంది.  ఇప్పుడు అతని కవితలు ప్రచురించడానికి ఏ సంపాదకుడూ అవసరం లేదు.

ఎవరైనా సోషల్ మీడియాలో ఒక వేదిక నిర్మిస్తే రాయాలనుకునేవాళ్లు కవితలు రాసి అక్కడ పోస్ట్ చేయగలుగుతారు.

అవి చదివి - "నువ్వు కవివి కావు" అని జడ్జ్ చేయకుండా "ఈ లైను ఇలా రాయి" అని భుజం తట్టేవాళ్ళు కావాలి. చేకూరి రామారావుగారి "చేరాతలు" లా  కొత్తకవులకి ప్రోత్సాహకరంగా మాట్లాడాలి.

శివారెడ్డిలా కాఫీ హోటల్లో కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ కవితలు రాయించాలి.

అలా చేస్తే తెలుగు కనుమరుగు కాదు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న యువకవుల కవితల్లో అపురూపమైన పదజాలం వస్తోంది.

బాల సుధాకర్ మౌళి, కాశీనాథ్, నందకిషోర్ - లాంటి కవులు రకరకాల ప్రాంతాల వ్యవహారిక భాషలో కవిత్వం రాస్తున్నారు.

సామాజిక మాధ్యమాల వల్ల - కవి సంగమం, కవి సమయం, వాట్సాప్ గ్రూపులు - కవులకి వేదికలు ఏర్పాటు చేస్తున్నాయి. 

ఏ కవితలో ఏ గొప్ప శక్తి ఉందో ? 

స్వర్ణాయుల కృష్ణవేణి అని ఒకావిడ ఇంటర్ ఫెయిల్ అయ్యి  ఒకటో తరగతి వాళ్లకి పాఠాలు చెప్తూ ఉంటుంది - కవితలు రాస్తోంది. యూట్యూబులో వీడియో ఉంటుంది - కవిసంగమం తరఫున - చూడండి. 

చేరా-మోడల్లో ప్రోత్సహించి కొత్త కవులతో కవితలు రాయించి 144 కవితలతో ఒక సంకలనం ప్రచురించాం. 

కవిసంగమం డిజైన్ చేశాను. కవిత్వం బతుకుతుంది అని ఆశావహంగా వుంది. 

ఎవ్వరు పని చేసినా ఎల్లలు లేని తెలుగు కోసమే !" -

అని యాకూబ్‌గారు  అంటూ ఉండగానే - ఇంకా - అప్పటికి కూడా - అంతకుముందు వరకూ నిండు గోదారిలా చిక్కగా వున్న గది - ఒక్కసారిగా ఎండాకాలపు-నీటిపాయలా చిక్కిపోయిందని - ఇలా అయితే తెలుగు ఎలా బ్రతుకుతుందని - ఆవేదనతో వున్న చందు సుబ్బారావుగారు "ఆ రాస్తున్నారు - అవీ ఓ కవితలే - ఒక్కరైనా తిలక్ లాగా ఎప్పటికీ నిలిచే ఒక్క వాక్యమైనా రాయగలుగుతున్నారా ?" - అని రుసరుసలాడారు.

అది వింటూనే యాకూబ్‌గారు  - "చందు సుబ్బారావుగారు! మిమ్మల్ని గొప్ప రచయిత అనడానికి మేమున్నాం - మరి మమ్మల్ని కవులని తలుచుకోవడానికి ఎవరో ఒకరు మా తర్వాత వాళ్ళు కూడా ఉండాలి కదా సార్! అందుకే కవిత్వం ఉంటుంది - ఉండాలి సార్! 

కూలి పని చేసుకునే వాళ్ళు, ప్రొక్లైనర్ రిపేర్ చేసే నరేష్ కుమార్ , బార్బర్ షాప్ లో పని చేసే కుర్రాడు - వీళ్ళందరూ కవులమైన నాతో, పాపినేని శివశంకర్‌తో డయాస్ పంచుకుంటున్నామని సంతోషిస్తున్నారు." -

అని చెప్పి ప్రసంగం ముగించారు.

చందు సుబ్బారావుగారు లేచి మైకు దగ్గరికి వచ్చి - "కవితని జడ్జ్ చేయాలి. మీరు వందలు వందలు రాసుకోండి - మేం జడ్జ్ చేస్తాం " - అంటూ నవలా రచయిత సూర్యదేవర రామమోహనరావు గారిని నవల గురించి మాట్లాడడానికి ఆహ్వానించారు.

సూర్యదేవర రామమోహనరావు గారి - పాపులర్ నవల పరిధులు, ప్రయోజనాలు: 

సూర్యదేవర రామమోహనరావుగారి మాటలు - వ్యాపార నవల గురించి:

"సాహిత్యం అంత్యదశలో వుంది. పాఠకులు లేరు. వలసదారులు అజ్ఞానుల్ని చేశారు. ఇప్పటికీ తెలుగులో భట్టి విక్రమార్క కథలు, శిరచ్ఛేద చింతామణి కథలు, యద్దనపూడి నవలలు చదివినవారు ఎక్కువ. 

అసలు రచయితలెలా పుడతారంటే మూడు కారణాలు - అవసరం, ఆవేశం, దురద. 

నేను 80ల్లో డబ్బు కోసం రాశాను. నా నవలలు 60-70 వేల కాపీలు పోయేవి. ఇప్పుడు మూడు వేలు దాటట్లేదు. 

కవిత్వం నెట్లో రాయడం బాలేదు. 

రామోజీరావుగారి కొడుకులు నెట్లో పత్రిక నడుపుదామంటే నేనున్నంత కాలం ప్రింట్ వుండాల్సిందే అన్నారాయన. 

ఒకానొక కాలంలో నవల కోసం లెండింగ్ లైబ్రరీలు కిటకిటలాడేవి. 

ఒక్కో నవల - యండమూరివి  లక్ష,మల్లాది నవలలు 70 వేలు, నావి అరవై వేలు కాపీలు అచ్చయ్యేవి . 

ఇప్పుడు చూస్తే ఏంటి పరిస్థితి? ఓల్గా పొద్దుగూకులూ స్వేచ్ఛే. కుప్పిలి పద్మ - చెలం మైదానం ఆరుసార్లు చదివానంటుంది. నువ్వు రాయాలమ్మా - చదవడం ఏంటి - అనుకుంటాన్నేను. రంగనాయకమ్మ - రామాయణం, భారతం తిట్టడం మానేసి కొత్తవి రాయాలి. 

సాహిత్యం పాడైపోవడానికి కారణం - రచయితలూ రాసినవే రాస్తున్నారు. 

అమెరికాలో నవలలు బాగా చదువుతారు. Ian McEwan రాసిన Nutshell అనే నవల చదివాను. ఒకమ్మాయి కడుపుతో వున్నపుడు తన ప్రియుడితో కలిసి తన భర్తని చంపడానికి  చేస్తుంది. అది కడుపులో వున్న బిడ్డ విని - పుట్టి - పెద్దయ్యాక తల్లి మీద పగ తీర్చుకుంటాడు. ఇది మన భారతంలో అభిమన్యుడి కథలా లేదూ?

Avtaar సినిమా అంతా మన గంధర్వుల, ఉపదేవతల కథ.  

అమెరికా వాళ్ళు మన రామాయణం, భారతం ఆధారంగా కొత్త కొత్త కథలు రాసుకుంటున్నారు.

మరి మనమో - తిట్టుకుంటూ కూర్చుంటున్నాము.
రాజమండ్రిలో - వాస్తు, పంచాంగాలు, అపూర్వ  చింతామణి - అమ్ముకుంటున్నాము. 

పాఠకులని పెంచడానికి ప్రయత్నం లేదు. పబ్లిషర్స్ లేరు. 

మనం కూడా మన రామాయణం, భారతం, వేదాల్లోంచి కొత్తకొత్త కథలు పుట్టించే రచయితలని తయారు చేసుకోవాలి. 

నేను నా నవలలని ఇంగ్లీషులోకి ట్రాన్స్‌లేట్ చేయించి డెన్వర్ లో ఒక పబ్లిషింగ్ హౌస్ తో కలిసి ప్రచురించాలని ప్రయత్నిస్తున్నాను. 

కౌటిల్యుడెప్పుడో అర్థశాస్త్రంలో రాశాడు - సాహిత్యపు పన్ను వుండాలని, దానితో లైబ్రరీలు కట్టించాలని. 

కర్ణాటక ప్రభుత్వం 7.5% సాహిత్యపు పన్ను వసూలు చేస్తోంది. 

మన రెండు తెలుగు ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చెయ్యట్లేదు. ప్రభుత్వం పూనుకుంటే తప్ప సాహిత్యం నిలవదు"-

- అని కొంచెం ఆవేశం, కొంచెం ఆవేదన, మరి కొంచెం వ్యగ్యం కలిపి ఎన్నో ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు ప్రముఖ నవలా రచయిత - సూర్యదేవర రామమోహనరావుగారు.

ఎల్లలు దాటిన తెలుగు సాహిత్యాన్ని ఎల్లప్పటికీ నిలపడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి అన్న సూర్యదేవర రామమోహనరావుగారి ప్రసంగాన్ని మెచ్చుకుంటూ తర్వాతి వక్త పాలపర్తి ఇంద్రాణిగార్ని - "ఐదు నిముషాలు మాత్రమే మాట్లాడండి" - అంటూ ఆహ్వానించారు కొంచెం చల్లబడ్డ చందు సుబ్బారావుగారు.

పాలపర్తి ఇంద్రాణిగారి - బాల సాహిత్యం:

చీర కట్టుకున్న సీగానపెసూనాంబలా వున్న ఇంద్రాణిగారు మైకు దగ్గరికి వస్తూనే "నన్ను చిన్నపిల్లని చేసి నాకు  తక్కువ టైం ఇచ్చారు" అంటూ అందరినీ నవ్వించారు.

అప్పటిదాకా వేడిగా, వాడిగా, వెచ్చగా జరుగుతున్న సభ - అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చూపించే చందమామ వెన్నెల సోకినట్లు చల్లబడింది.

ఇంద్రాణి కబుర్లు నాకు భలే నచ్చేశాయి - బహుశా అవి ఇప్పటికీ అవకాశం దొరికితే Legosతో ఆడుకుందామా అనుకునే నా ప్రపంచానికి దగ్గరగా అనిపించినందుకేమో :)

ఇంక మరి  ఇంద్రాణి గారి బాలల-కబుర్లు ఇక్కడ:

"ఇక్కడ బాల-సాహిత్యం గురించి మాట్లాడడానికి వస్తుంటే ఇది గుర్తుకొచ్చింది. చలం గారిని ఒకసారి ఏదో స్కూల్లో సభలో మాట్లాడమని పిలిస్తే వెళ్లి  చెప్పారట : ఇప్పటికిప్పుడు ఈ స్కూల్ పడిపోవాలి - టీచర్లు చచ్చిపోవాలి, పిల్లలు పారిపోవాలి - అని.

నేను చాలా చెప్పాలని వచ్చాను. కానీ టైం  లేదు.

ఇప్పటివరకూ ఈ సభలో పెద్దవాళ్ళు చెప్పిన విషయాలతో నాకేం సంబంధం లేదు.

నాకు చందమామ చదవడం , కార్టూన్స్ చూడడం ఇష్టం. టిన్‌టిన్ చూస్తాను.

చిన్నప్పుడు మా నాన్నగారు సైకిలు మీద ముందు చిన్న సీటు మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లి చందమామ, పిప్పరమెంట్లు కొనిపెట్టేవారు.

చందమామలో బొమ్మలు చాలా అందంగా ఉండేవి - నాకు అద్భుతం గా అనిపించేవి.

అలాగే విజ్‌డం అనే పుస్తకం కూడా చదివేదాన్ని. అందులో ప్రతీ పేజీలో కింద ఒక సూక్తి  వుండేది. నాకు బాగా ఇష్టమైన సూక్తి: " కార్యసాధకుడు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు". 

నాకనిపించేదేంటంటే తల్లులే తొలి బాలసాహితీవేత్తలు.

చిన్నప్పుడు నేను బాగా సెన్సిటివ్. నాకు ధైర్యం చెప్పడానికి మా అమ్మగారు చెప్పిన సూక్తి: ఏనుగు వీధిలో వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. ఏనుగు చలించదు" అది నాకు చాల ఇష్టమైంది - దాన్ని నా పుస్తకాల అలమారులో అతికించుకున్నాను.


గోరంత దీపం కొండంత వెలుగు - మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు, ఆకేసి పప్పేసి - అని పాడే చక్కిలిగింతల పాట, చందమామ రావే - అంటూ గోరుముద్దలు తినిపించే అమ్మ పాట - ఇవన్నీ బాలసాహిత్యం కింద వస్తాయి.  ఇవే కాక - వదినగారు మీరు వాసి గలవారు, వండబోయిన చోట కుండ నాకబోయేరు, ఇంకా పొడుపు కథలు - ఇవన్నీ కలిసిన  బాలసాహిత్యం మౌఖికంగానే వ్యాప్తి చెందింది. .

నాకు చిన్నప్పుడు బావా బావా పన్నీరు - బావని పట్టుకు తన్నేరు పాట చాల ఇష్టం. నాకున్న ఇద్దరు బావల్నీ అలా పట్టుకు కొట్టాలని వుండేది. కానీ ఆ కోరిక తీర లేదనుకోండి.

చందమామ కథల్లో అల్లరి దెయ్యాల కథలు నాకు చాలా నచ్చేవి. భయం వెయ్యకపోగా ఆ దెయ్యాలు కనిపిస్తే బావుండనిపిస్తుంది.

రాజకుమార్తెలు, రాకుమారులు, స్వయంవరాలు - ఆ కథలన్నీ అద్భుతంగా ఉండేవి. నాకు స్వయంవరం  కోరిక తీరనే లేదు.

ఇంక భేతాళ కథలు. విక్రమార్కుడికి మౌనభంగం అయి భేతాళుడు చెట్టు మీదికి ఎగిరిపోయినప్పుడు అసలెందుకీ విక్రమార్కుడు మాట్లాడుతాడు అనుకునేదాన్ని. చివర్న వుండే విక్రమార్కుడి సమాధానం చదవకుండా పరిష్కారం ఊహించాలని ప్రయత్నించేదాన్ని. కానీ అప్పటి నా స్థాయికి అది కుదిరేది కాదు.

ఇప్పటికీ చందమామలు చదువుతాను నేను. పాతికేళ్ళ నాటి చందమామ కథ అని పాత కథలతోనే నడిపిస్తున్నారు.

చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను.

పిల్లల కోసం సృష్టించే సాహిత్యం కొంచెం భాద్యతాయుతంగా వుండాలి.

అదెలా అంటే - కథల్ని ఆసక్తి కలిగించేలా చెప్పాలి.

చెప్పకూడనివి చెప్పకూడదు.

ఉదాహరణకి - బుర్రుపిట్ట బుర్రుపిట్ట పాటలో ఎలాంటి భావం వుందో చూడండి - అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది - మగనిచేత మొట్టికాయ తింటనన్నది అనే లైన్లలో.


బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మగనిచేత మొట్టికాయ తింటనన్నది

మా పాప చిట్టి చిలకమ్మా - అమ్మ కొట్టిందా అని చెప్పడం మొదలు పెట్టిన ప్రతీసారి ఏడ్చేది - అమ్మ కొట్టడం అన్న భావనే భరించలేనట్లు.

- అంటూ తను మాట్లాడిన ప్రతీ మాటకీ శ్రోతల నవ్వుల-నజరానాలు బోల్డన్ని అందుకుంటూ పిల్లల సాహిత్యంపై ప్రసంగాన్ని ముగించారు ఇంద్రాణి.

ఇంద్రాణి ప్రసంగం అవ్వగానే కొత్తపాళీ-నారాయణ స్వామిగారు లేచి - "ఒక నిముషం మాట్లాడుతాను నేను. ఇంతవరకూ మాట్లాడిన ఇంద్రాణి తన గురించి తను చెప్పుకోలేదు కానీ తను చాలా మంచి కవయిత్రి. ఈ మధ్యనే తన పాపతో తల్లిగా తను జరిపిన సంభాషణల్ని "చిట్టి చిట్టి మిరియాలు"అని ఒక సంకలనంలా తీసుకొచ్చింది" అని ఎంతో ఆత్మీయంగా పరిచయం చేశారు.

అప్పుడు గుర్తొచ్చింది నాకు ఏప్రిల్-2017 ఈమాట సంచికలో చంద్రలతగారు పరిచయం చేసిన ఇంద్రాణిగారి "చిట్టి చిట్టి మిరియాలు" పుస్తక పరిచయం - అది చదవగానే - మిఠాయి పొట్లం లాంటి సమీక్ష – పుస్తకం తప్పక చదవాలి అనిపించేలా వుంది - అంటూ అక్కడ నేను పెట్టిన వ్యాఖ్య.  అది గుర్తుకు రాగానే  అనేసుకున్నాను - ఆ పుస్తకం తప్పక చదవాలని.

--------------------------------------------------------------------------------------------------------------


ఇప్పటికి ఇక్కడ ఆపుతున్నాను. ఈ ముగింపునాటి ముగింపు-పోస్ట్ వచ్చేవారం.  ఆ తర్వాత తొలినాటి కబుర్లకి వెళ్తాను.


తన - తానా - ఒక్క సౌండునుండు
వినగ వినగ దీర్ఘపు జాడ వేరు
తన కబుర్లందు తానా కబుర్లు వేరయా
చెప్పుతుంట నేను - చదవ రండి మీరయా!


18 కామెంట్‌లు:

  1. Wow
    Tells me how you much you love it
    Hope you had great time in TANA.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Yes, Sridhar. This was the first TANA I attended & enjoyed every bit of the literary forum. Thanks for your comment.

      తొలగించండి
  2. "తన కబుర్లందు తానా కబుర్లు వేరయా"
    భేష్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు, నారాయణస్వామిగారు! త్వరలో మీ బ్లాగులో కొత్త పోస్టులు చదివే అవకాశం వుంటుందని ఆశ :)

      తొలగించండి
  3. పేరు ప్రఖ్యాతలు ఉన్న నవలా రచయితల నవలల సర్కులేషన్ 80 వేలనుండి 3 వేల కాపీలకు పడిపోతే, మరి కొత్త రచయితల సంతతి తలచుకొంటే మరింత బాధకలుగుతుంది. మున్ముందు ఒక్కప్పుడు నవలా రచయితలు ఉండేవారు అని మన తరువాతి తరం చెప్పుకుంటారేమోనని భయం వేస్తుంది. తెలుగు సాహిత్యాన్ని బతికించడం కోసం ప్రభుత్వం కృషి చేయాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది నిజం, వెంకట్‌గారు. తెలుగులో నవలలే కాదు - తెలుగు అనే ఒక లిపి వుండేదని చెప్పుకునే రోజులు రాకుండా వుంటే అదే చాలనిపిస్తోంది.

      తొలగించండి
  4. మీ సమీక్ష బావుంది. ముఖ్యంగా యాకూబ్, సూర్యదేవర, ఇంద్రాణి గార్ల వ్యాఖ్యలతో అన్వయించుకోవటం సులభం. అయితే కూడు, నీడ, గుడ్డ స్థాయి దాటని తెలుగు రాష్ట్రప్రభుత్వాలు, సాహిత్యానికి చేయూతనిస్తాయని ఆశించటం మన భ్రమ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామి గారు: సరిగ్గా చెప్పారు - తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎంత ఆశించగలమో!

      తొలగించండి
  5. సాహిత్యం చచ్చిపోవటం అంటూ ఉండదు. సాహిత్యం కానివి సవాలక్ష సాహిత్యం పేరుతో చలామణీలోనికి రావటం పుణ్యమా అని సాహిత్యాన్ని గుర్తించటం కొంత కష్టం అవుతుంది. అంతే. పదిమంది దొంగల మధ్య ఇరుక్కున్న పదకొండో వాడినీ‌ జనం దొంగ అనుకున్నట్లుగా సాహిత్యం అంటేనే చెత్తా - తలనొప్పీ అని జనం అనుకొనే స్థితి రావటం మాత్రం నిజం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయంగారు: అనుభవంగల పెద్దవారుగా మీరన్నమాట చద్దిమూట.

      తొలగించండి
  6. బ్లాగు-బాగు ఒక్క తీరుగ నుండు
    సరిగజూడ ఒత్తుల జాడ వేరు
    బ్లాగులందు బోల్డన్ని కబుర్లు మేలయా
    చెప్పుచుంటి నేను ఒప్పరే సజ్జనుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పేరడీ పద్యాల సరదా బావుంది కానీ - ఓ బ్లాగు రాద్దూ! బోల్డన్ని కబుర్ల కన్నా మేలు-కబుర్లు చెప్పగలవు - రాయకపోవడం ఏమీ బాలేదు.

      తొలగించండి
  7. Lalitha garu, just now read your blog (finally) and its an excellent summary as usual. Thanks for doing this. 👍

    రిప్లయితొలగించండి
  8. అవును. రామ్మోహనరావుగారు చెప్పినట్లుగా కాల్పనిక సాహిత్యానికి కాలం చెల్లింది. మొన్నటి దాకా వ్యక్తిత్వ వికాస, భక్తి పుస్తకాలు బాగా అమ్ముడయితే నేడు యాత్రాసాహిత్యానికి గిరాకీ ఉందని నవోదయా సాంబశివరావు అంటున్నారు. కవిత్వమైతే పుస్తకం అచ్చయ్యాక బంధు మిత్రులకు పంచవలసినదే. సాహిత్య సభలకు హాజరయే సాహిత్యాభిమానుల కొరత కూడా ఎక్కువగానే ఉంది. మీ కథనం తో, తానా సమావేశానికి హాజరు కాని లోటు భర్తీ అయ్యింది.









    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తానా-కబుర్లు క్రమం తప్పకుండా చదువుతున్న మీకు ధన్యవాదాలు!

      తొలగించండి
  9. కవిత్వమైతే పుస్తకం అచ్చయ్యాక బంధు మిత్రులకు పంచవలసినదే. Very true.
    సాహిత్య సభలకు హాజరయే సాహిత్యాభిమానుల కొరత కూడా ఎక్కువగానే ఉంది. very true again.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు, శ్యామలీయంగారు!

      తొలగించండి